దేశానికి మోడల్ గా కొడంగల్ : సీఎం రేవంత్ రెడ్డి

దేశానికే మోడల్‌గా కొడంగల్‌ను తీర్చిదిద్దుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో రూ.110 కోట్లతో నిర్మించనున్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ పునర్‌నిర్మాణానికి భూమిపూజ చేశారు. కొడంగల్‌ నుంచే దౌల్తాబాద్‌, కోస్గి ఆలయాల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు

విధాత : దేశానికే మోడల్‌గా కొడంగల్‌ను తీర్చిదిద్దుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో రూ.110 కోట్లతో నిర్మించనున్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ పునర్‌నిర్మాణానికి భూమిపూజ చేశారు. కొడంగల్‌ నుంచే దౌల్తాబాద్‌, కోస్గి ఆలయాల అభివృద్ధి పనులకు, కొడంగల్ లో 430 పడకల ఆసుపత్రి నిర్మాణానికి  సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. లగచర్లను ఎడ్యుకేషనల్‌ హబ్‌గా మార్చుతున్నామని చెప్పారు. కృష్ణానదీ జలాలతో కొడంగల్‌ భూములు తడవాలన్నారు. నారాయ‌ణ‌పేట‌, కొడంగ‌ల్ ఎత్తిపోత‌ల ప‌థ‌కం భూసేక‌ర‌ణ బాధ్య‌త‌ మంత్రి శ్రీహ‌రికి అప్ప‌గిస్తే నెల‌లోపే పూర్తి చేశారని, ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి ఏ అడ్డంకులు లేవు.. ఎప్పుడంటే అప్పుడు నిధులు మంజూరు చేస్తాం..కృష్ణా జలాలు ఇక్కడికి వచ్చే వరకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి శ్రీహరిని నిద్ర పోనీయొద్దని స్థానిక నేతలకు సూచించారు.

కొడంగల్‌ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మంత్రి పదవి దక్కలేదని, ఇప్పుడు కొడంగల్‌ ఎమ్మెల్యేనైన తనకు సీఎం పదవి దక్కిందన్నారు. వికారాబాద్ రైల్వే లైన్ తొంభై శాతం పూర్తైందని, సిమెంట్ ప‌రిశ్ర‌మ వ‌చ్చే ఆరు నెల‌ల్లో నిర్మాణం జ‌రుగుతుంది.. స్థానికంగా ఉద్యోగ‌, ఉపాది అవ‌కాశాలు మెరుగు అవుతాయని రేవంత్ రెడ్డి తెలిపారు. మెడిక‌ల్, ఇంజ‌నీరింగ్, ఎటీసీ సెంట‌ర్ , న‌ర్సింగ్ కాలేజ్, పాలిటెక్నిక్, సైనిక్ స్కూల్ ఇలా అన్ని విద్యా సంస్థ‌లు కొడంగ‌ల్ లో ఏర్పాటు అవుతున్నాయని గుర్తు చేశారు. యేడాదిన్న‌ర లో ఎడ్యూకేష‌న్ హ‌బ్ ప‌నులు పూర్తి అవుతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు చ‌దువు కోసం కొడంగ‌ల్ కు వ‌చ్చేలా చేస్తున్నాం అన్నారు. కొడంగ‌ల్ కార్య‌క‌ర్త‌ల ఆశీర్వాదంతో ముఖ్య‌మంత్రి ప‌ద‌వి వ‌చ్చిందని, దేశానికి ఆద‌ర్శంగా కొడంగ‌ల్ ను తీర్చిదిద్దుకోవాలన్నారు.

2300 ఎక‌రాల్లో ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్ ను ల‌గ‌చ‌ర్ల ద‌గ్గ‌ర ఏర్పాటు చేసుకుంటున్నాం అని, ఎయిర్ పోర్టు నుంచి కొడంగ‌ల్ కు పెద్ద రోడ్డు నిర్మిస్తున్నామని, రాజ‌కీయాల‌కు అతీతంగా క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయాలన్నారు. ఈ రోజు ప్ర‌తి తండా కు, గ్రామ‌పంచాయ‌తీకి రోడ్డు నిర్మించుకున్నాం అని, కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల క‌ష్టంతోనే నేను ఈ స్థాయికి వ‌చ్చాను అన్నారు. అంద‌రి స‌హ‌కారంతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నాం.. రోజూ కు 18 గంట‌లు క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్నాం.. రైతు రుణ‌మాఫీ, స‌న్న బియ్యం, రైతు భ‌రోసా, ఇందిర‌మ్మ ఇళ్లు, రేష‌న్ కార్డులు, ఫీజు రీఎంబ‌ర్స్ మెంట్ఇ లా ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేస్తున్నాం అని తెలిపారు.పేద‌ల విద్య‌, వైద్యం కోసం ఎన్నో కార్య‌క్ర‌మాలు చేస్తున్నాం అన్నారు. తిరుప‌తిలో ఏ సాంప్ర‌దాయం ప్ర‌కారం పూజ‌లు చేస్తారో అవే పూజ‌లు కొడంగ‌ల్ శ్రీవారి దేవాల‌యంలో చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, ఎంఎల్ ఏ లు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, జిల్లా ఉన్నతాధికారులు,కొడంగల్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Latest News