తమ పార్టీపై, కుటుంబంపై అసత్యాలతో బురదచల్లే ప్రచారాలు యూ ట్యూబ్ చానెళ్లు మానుకోవాలని లేని పక్షంలో తాము పెట్టె పరువు నష్టం కేసులను
విధాత, హైదరాబాద్: తమ పార్టీపై, కుటుంబంపై అసత్యాలతో బురదచల్లే ప్రచారాలు యూ ట్యూబ్ చానెళ్లు మానుకోవాలని లేని పక్షంలో తాము పెట్టె పరువు నష్టం కేసులను ఎదుర్కోవాల్సివుంటుందని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా హెచ్చరించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ ఛానళ్లు కొన్ని, ఏలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తంబ్ నెయిల్స్ పెడుతూ, వార్తల పేరుతో శుద్ద అబద్దాలను చూపిస్తున్నాయని, గుడ్డి వ్యతిరేకత వలనో లేదా అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడో ఇలాంటి నేరపూరితమైన, చట్టవిరుద్ధమైన వీడియోలను, ఫేక్ న్యూస్ లను ప్రచారం చేస్తున్నాయన్నారు. ఇది వ్యక్తిగతంగా నాతోపాటు, మా పార్టీని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే జరుగుతున్నదని భావిస్తున్నామని, కేవలం ప్రజలను అయోమయానికి గురి చేసి, తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న చర్యగా భావిస్తున్నామని ట్వీట్లో పేర్కోన్నారు.
గతంలో మాపై అసత్య ప్రచారాలను, అవాస్తవాలను ప్రసారం చేసిన, ప్రచురించిన మీడియా సంస్థలపైన కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించామని, ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న ఈ దుర్మార్గపూరిత, కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామని కేటీఆర్ తెలిపారు. అసత్యాలను అదేపనిగా ప్రచారం చేసి, అడ్డమైన తంబునెల్స్ తో వార్తల పేరిట ప్రాపగండకు పాల్పడుతున్న యూట్యూబ్ ఛానళ్లపైన పరువు నష్టం కేసులు నమోదు చేయడంతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు. దీంతోపాటు ఆయా యూట్యూబ్ ఛానళ్లను నిషేధించాలని యూట్యూబ్కి అధికారికంగా ఫిర్యాదు కూడా చేస్తామని,
ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తూనే, కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ ఛానళ్లు చట్ట ప్రకారం తగిన శిక్షకు సిద్దంగా ఉండాలని హెచ్చరిస్తున్నామని కేటీఆర్ పేర్కోన్నారు.