విధాత: నల్లగొండ మున్సిపల్ కార్పోరేషన్ తొలి మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఖాయమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం నల్లగొండ పట్టణం చింతల్ రాంనగర్ ప్రాంతంలో రూ.2.5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రాజీవ్ పార్క్ & మామిళ్లగూడెం పార్క్ అభివృద్ధి పనులకు, 34వ వార్డులో సుమారు రూ. 2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మంచి నీటి సరఫరా అభివృద్ధి పనులకు వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ పట్టణాన్ని మరింత సుందరంగా, ప్రజలకు అనుకూలంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది అని తెలిపారు. కొత్తగా చేపట్టనున్న అభివృద్ధి పనుల ద్వారా పట్టణ ప్రజలకు మెరుగైన వినోద సదుపాయాలు, పచ్చదనం, ప్రశాంత వాతావరణం అందుబాటులోకి రానున్నాయన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని, పట్టణ పరిధిలో ప్రతి ఇంటికి నిరంతర నీటి సరఫరా లక్ష్యంగా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
నల్లగొండ పట్టణ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులన్నింటినీ దశలవారీగా మెరుగుపరుస్తామని తెలిపారు. జల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా చేపడుతున్న ఈ నీటి సరఫరా అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసి, స్థానికుల దైనందిన జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తామని మంత్రి వెంకట్ రెడ్డి భరోసా ఇచ్చారు. నల్లగొండ మున్సిపాల్టీ కార్పోరేషన్ తొలి మేయర్ పీఠం జనరల్ మహిళగా రిజర్వ్ అయ్యిందని, ఈ ఎన్నికల్లో మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించి రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో పట్టణం మరింత అభివృద్ది చేసే అవకాశం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీదేవి,భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయం సందర్శించిన వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి :
MSG | ‘మన శంకరవరప్రసాద్ గారు’లో మెరిసిన కొత్త ముఖం ఎవరు? .. సోషల్ మీడియా నుంచి సిల్వర్ స్క్రీన్ ప్రయాణం
AIADMK Manifesto 2026 : ‘స్త్రీలకే కాదు..తమిళనాడులో పురుషులకు కూడా ఫ్రీ బస్సు స్కీమ్’
