‘మీరు దౌర్జన్యం చేస్తే నేను చేస్తా... మీరు గొడవ పడితే నేను గొడవ పడుతా. మీరు వంద మంది గొడవకు వస్తే.. నేను లక్ష మందితో వస్తా. నేను ఎవ్వరికీ బెదరను
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ‘మీరు దౌర్జన్యం చేస్తే నేను చేస్తా… మీరు గొడవ పడితే నేను గొడవ పడుతా. మీరు వంద మంది గొడవకు వస్తే.. నేను లక్ష మందితో వస్తా. నేను ఎవ్వరికీ బెదరను.. నన్ను భయపెట్టే వారే లేరు…’ ఇవన్నీ హీరో బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్ లు అనుకుంటున్నారా? కాదండి… నారాయణ పేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గ్రామస్థులకు ఇచ్చిన వార్నింగ్. వివరాల్లోకి వెళితే… నారాయణ పేట నియోజకవర్గం మరికల్ మండలం వెంకటాపూర్ గ్రామానికి ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి గ్రామస్థుల నుంచి ఎదురు దెబ్బ తగిలింది. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే ప్రచారాన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామంలోకి రావద్దని నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు.
గ్రామస్థులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నేను ఎవ్వరికీ భయపడే వ్యక్తిని కాదని, మీరు ఎంత మంది వచ్చినా ఈ రాజేందర్ రెడ్డి బయపడడనే విషయం తెలుసుకోవాలని అన్నారు. అయినా గ్రామస్థులు ఆయన్ను గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో మరింత ఆగ్రహం చెందిన ఎమ్మెల్యే… ‘దౌర్జన్యం చేస్తే మీరు వంద మంది ఉన్నారు… మేమూ లక్షమందితో వస్తాం. మీరు ఉల్టా మాట్లాడితే.. నేను ఉల్టాగా ఉంటా. ఎవ్వరికీ భయపడే వ్యక్తి రాజేందర్ రెడ్డి కాదు’ అని గ్రామస్థులపై ఎదురుదాడికి దిగారు. మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని గ్రామస్థులు పట్టుబట్టారు. ఇవన్నీ తరువాత మాట్లాడుదాం.. ప్రస్తుతం మా ప్రచారం మమ్మల్ని చేసికోనివ్వడి… అంటూ గ్రామస్థులను కోరారు. గ్రామస్థుల గోల మధ్య ఎమ్మెల్యే ప్రసంగించారు.
పింఛన్ తినేది మీరు… రైతు బంధు డబ్బులు అందుతున్నాయి, రూపాయికే బియ్యం అందుతుంది.. ఇంకా ఎన్నో ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందుతూ మమ్మల్ని అడ్డుకుంటారా అని గ్రామస్థులను ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ను కోరిన వెంటనే నారాయణ పేట జిల్లాను ప్రకటించారు. వెనుకబడిన ఈ ప్రాంతాన్ని తన హయాంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, ఇదంతా కావాలనే ఇతర పార్టీల వారు నాపై ప్రజలను రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మళ్ళీ కేసీఆర్ సీఎం అయితేనే తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధిలోకి వస్తుందన్నారు. గ్రామస్థుల గొడవ మధ్యనే ఎమ్మెల్యే తన ప్రసంగం ముగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.