ఎన్నికల ముంగిట నారాయణ పేట నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడి కాంగ్రెస్ క్యాడర్ అయోమయంలో ఉంది. గత ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు ఓటమిని చవిచూశారు
– గత మూడు ఎన్నికల్లోనూ తెలిసొచ్చిన తప్పిదం
– వరుసగా పట్టుకోల్పోతున్న వైనం
– తాజా ఎన్నికల్లో తెరపైకి ఎర్రశేఖర్
– పార్టీలో రగులుతున్న అసంతృప్తులు
– క్యాడర్ అంతా కుంభం వైపే
– పేట హస్తంలో ఆసక్తికర రాజకీయం
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ఎన్నికల ముంగిట ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నారాయణ పేట నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడి కాంగ్రెస్ క్యాడర్ అయోమయంలో ఉంది. గత ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు ఓటమిని చవిచూశారు. ఆయా ఎన్నికల్లో అభ్యర్థులుగా ఊహించని విధంగా కొత్త మొహాలను తెరపైకి తేవడమే నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని పార్టీ శ్రేణులు మదనపడుతున్నారు. ఈ క్రమంలో తాజా ఎన్నికకూ అభ్యర్థిని తేల్చలేదు. ఇంతకాలం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న కుంభం శివకుమార్ రెడ్డికే టికెట్ వస్తుందని ఎదురుచూస్తున్నారు. టికెట్ ధీమాతోనే కుంభం ఇన్నాళ్లూ పార్టీని ముందుకు నడిపించారు. ప్రతి మండలంలో విస్తృతంగా ప్రచారం చేశారు. గ్రామాల్లో పర్యటించి, ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు. కార్యకర్తలకు నేనున్నానంటూ భరోసా ఇస్తూ పార్టీని ముందుకు నడిపించారు. ఆయనకు టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఆపార్టీ నేతల్లో వినబడుతోంది. నారాయణ పేట నియోజకవర్గం 2007లో ఏర్పడిన నాటి నుంచి రెండు సార్లు తెలుగు దేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మక్తల్ నియోజకవర్గంలో ఉన్న నారాయణ పేట మండలం, కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న దామరగిద్ద మండలం, అప్పటి అమరచింత నియోజకవర్గం నుంచి ధన్వాడ మండలం, మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి కోయిలకొండ మండలాలను కలిపి కొత్తగా నారాయణ పేట నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ నాలుగు మండలాల్లో ఒక్క నారాయణ పేట పట్టణం మాత్రం బీజేపీకి బలంగా ఉంది.
కుల సమీకరణలతో కాంగ్రెస్ టికెట్లు?
నారాయణ పేట నియోజకవర్గం 2007లో ఏర్పాటైంది. ఈ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ కి ధీటుగా తెలుగుదేశం పార్టీ పుట్టుకొచ్చింది. కొత్తగా నియోజకవర్గం ఏర్పాటైన తరువాత 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎల్లారెడ్డి గెలుపొందారు. అప్పుడు కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా నియోజకవర్గానికి పరిచయం లేని సూగప్పను బరిలోకి దించింది. కాంగ్రెస్ నేతలంతా ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినా, అధిష్టానం కుల సమీకరణతో టికెట్ కేటాయించినట్లు ప్రకటించింది. ఎవరికీ తెలియని అభ్యర్థిని రంగంలో దించడమే కాంగ్రెస్ చేసిన తప్పిదమని ఆ పార్టీ నాయకులే అన్నారు. సూగప్ప ఘోరంగా ఓటమి చెందిన తరువాత కాంగ్రెస్ అధిష్టానం ఖంగుతింది. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి రాజేందర్ రెడ్డి, తెరాస నుంచి కుంభం శివకుమార్ రెడ్డి బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువగా ఉన్నా, ఈ నియోజకవర్గంలో ఓటర్లు టీడీపీకే పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి పెద్దగా ఓట్లు రాబట్టుకోలేదు. అప్పుడు కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా కృష్ణ వామనగిరి.. ఎవ్వరికీ పరిచయం లేని వ్యక్తిని రంగంలోకి దించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన రాజేందర్ రెడ్డి కి 40107 ఓట్లు రాగా, తెరాస అభ్యర్థి కుంభం శివకుమార్ రెడ్డికి 37837 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణ వామనగిరికి 29278 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో గెలుపొందిన రాజేందర్ రెడ్డి కొద్దికాలం తరువాత తెరాసలో చేరారు. దీంతో శివకుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్ కు సేవలు అందించిన శివకుమార్ రెడ్డికి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు. ఇక్కడ కూడా మళ్ళీ కుల సమీకరణ వల్ల ఆయనకు టికెట్ రాలేదనే విషయం పార్టీ అధిష్టానం స్పష్టం చేసింది. కుల సమీకరణలో భాగంగా ఈ నియోజకవర్గం బలహీన వర్గాలకు కేటాయించారు. ఈ ఎన్నికల్లో కూడా సరాఫ్ కృష్ణ అనే కొత్త మొహాన్ని కాంగ్రెస్ రంగంలోకి తీసుకొచ్చింది. ఇంతకాలం పార్టీని నిలబెట్టిన శివకుమార్ రెడ్డిని పార్టీ పక్కకు పెట్టింది. దీంతో మనస్తాపం చెందిన ఆయన కాంగ్రెస్ కు బై చెప్పి, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ పొరపాటు అర్థమైంది. శివకుమార్ రెడ్డికి టికెట్ ఇస్తే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగిరేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. తెరాస అభ్యర్థి రాజేందర్ రెడ్డికి ధీటుగా శివకుమార్ రెడ్డి పోటీ పడ్డారు. రాజేందర్ రెడ్డికి 68767 ఓట్లు రాగా, శివకుమార్ రెడ్డికి 53580 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 20111 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి సరాఫ్ కృష్ణ కు 6344 ఓట్లు వచ్చాయి. అతి తక్కువ ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి ఘోరంగా ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తప్పిదం తేటతెల్లమైంది. శివకుమార్ రెడ్డిని కాదని సరాఫ్ కృష్ణకు టికెట్ ఇవ్వడంతో కాంగ్రెస్ క్యాడర్ అంతా ఆ పార్టీని వీడారు. తీవ్ర అన్యాయం జరిగిందనే భావనతో కాంగ్రెస్ క్యాడర్ శివకుమార్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. ప్రతిసారి కాంగ్రెస్ అధిష్టానం చేసిన తప్పిదం వల్ల గెలిచే స్థానాన్ని పోగొట్టుకుంటున్నామని క్యాడర్ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుందా?
నారాయణ పేట నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తయారైంది. ఈ సారి కూడా గత ఎన్నికల మాదిరిగానే తప్పటడుగు వేస్తుందా అని ఆపార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నియోజకవర్గంలో ఇది నిజమే అని అనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో పార్టీ కోసం కష్ట పడేవారిని గుర్తించకుండా, ఎన్నికల సమయంలో కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చి చేతులు కాల్చుకుంటోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం కూడా పార్టీ అదే పనిలో పడిందని, ఇంతకాలం పార్టీ కార్యకర్తల బలంతో ఒంటరిగా నడిపించిన శివకుమార్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా పక్కన బెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చర్చ జరుగుతోంది. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ (చంద్ర శేఖర్)ను తెర పైకి తెచ్చినట్లు సమాచారం. కుల సమీకరణలో భాగంగా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని ఆ పార్టీ అధిష్టానం నేతలు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే ఈ విషయం బయటకు రావడంతో పార్టీ అధిష్టానంపై కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. శివకుమార్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని అధిష్టానానికి హెచ్చరికలు పంపుతున్నారు. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు.