కేంద్రంలో పదేళ్ల బీజేపీ పాలనలో జరిగిన ప్రగతి శూన్యమని రాష్ట్ర బీసీ సంక్షేమం,రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆదివారం కొత్తపల్లి మండలంలోని బావుపేట గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు
విధాత బ్యూరో, కరీంనగర్: కేంద్రంలో పదేళ్ల బీజేపీ పాలనలో జరిగిన ప్రగతి శూన్యమని రాష్ట్ర బీసీ సంక్షేమం,రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆదివారం కొత్తపల్లి మండలంలోని బావుపేట గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.
సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బిజెపి పాలనలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు.
విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కు రప్పించి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామని చెప్పిన హామీని ఆయన గుర్తు చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయలేదని,రైతులకు పెన్షన్ ఇవ్వలేదని,తెలంగాణ విభజన హామీలు అమలు చేయలేదని ఆయన ఆరోపించారు.పదేళ్లలో ఏ ఒక్క హామీ అమలు చేయకుండా బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.రాముడి పేరుతో కమలనాథులు ఓట్లు అడగడం సిగ్గుచేటని విమర్శించారు.
ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తే పోటీ నుండి తప్పుకుంటానని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్టు మంత్రి ప్రభాకర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని,500 రూపాయలకు గ్యాస్ సిలిండర్,200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడమే కాకుండా ఆరోగ్యశ్రీ మొత్తాన్ని 10 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లు తప్ప, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పేదలకు ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు కాలేదన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ బీజేపీ కో హఠావో , దేశ్ కో బచావో అందరి నినాదం కావాలన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తే డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలపై వివక్షత ను నిర్విఘ్నంగా కొనసాగిస్తారన్నారు. నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించలేని కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా సామాన్యులపై పెను భారం పడుతున్నదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడించాలని, ఒకసారి తనకూ అవకాశం ఇవ్వాలని రాజేందర్ రావు కోరారు.తనను గెలిపిస్తే బావుపేటను మండల కేంద్రంగా మార్పు చేయడానికి కృషి చేస్తానని,సొంత నిధులతో ఎస్సీ కాలనీలో మినరల్ వాటర్ ప్లాంట్ , ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.