ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు, ఓ మీడియా సంస్థ వ్యక్తి శ్రవణ్కుమార్కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది
రెడ్ కార్నర్ నోటీస్కు మార్గం సుగమం
విధాత, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు, ఓ మీడియా సంస్థ వ్యక్తి శ్రవణ్కుమార్కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ వారెంట్ ద్వారా పంజాగుట్ట పోలీసులు అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్లకు రెడ్ కార్నర్ నోటీసును జారీ చేయనున్నారు. ఈ అరెస్ట్ వారంట్కు సంబంధించి కోర్టులో పోలీసులు తమ వాదనలు బలంగా వినిపించారు. అటు ప్రభాకర్ రావు కూడా తన న్యాయవాది ద్వారాఅఫిడవిట్ దాఖలు చేశారు. రెండు వర్గాల వాదనలు విన్న కోర్టు నిందితులిద్దరికి నాన్ బెయిల్బుల్ వారెంట్లను జారీ చేసింది.
దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు అరెస్ట్ తప్పదని స్పష్టమైంది. వారెంట్ కోసం పోలీసులు సీఆర్పీసీ సెక్షన్-73 కింద పిటిషన్ వేసి ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కేసులో ప్రధాన నిందుతుడని, ఇప్పటి వరకు అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు రాధకిషన్రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావుల కుట్ర వెనకాల మొత్తం ప్రభాకర్ రావు ఉన్నాడని వాదించారు. ఇందుకు అరెస్టయిన నిందితులు విచారణలో వెల్లడించిన విషయాలను కూడా కోర్టుకు నివేదించారు.
ఎస్ఐబీ కార్యాలయంలో ఆధారాలు, సాక్ష్యాలను ధ్వసం చేసి మాయం చేశారని కోర్టుకు తెలిపింది. దీంతో దశాబ్దాల పాటు సేకరించిన మావోయిస్టు, అసాంఘిక శక్తుల సమాచారం మొత్తం నాశనం అయ్యిందని ప్రాథమిక ఆధారాలతో కోర్టులో తమ వాదనలను వినిపించారు. వారు చేసిన కుట్ర వ్యక్తిగత భద్రతతో పాటు రాష్ట భద్రతకు తీవ్ర విఘాతం కలిగించేలా ఉన్నాయని వెల్లడించారు. పోలీసుల వాదనలతో ఏకీభవించిన కోర్టు ప్రభాకర్రావు, శ్రవణ్కుమార్లకు వారెంట్ జారీ చేసింది.