విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న కుమ్ములాట తారస్థాయికి చేరింది. పశ్చిమ టికెట్ ఆశిస్తున్న హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి వర్గాల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఒక్కరంటే మరొకరికి గిట్టని పరిస్థితి ఇప్పటికే ఏర్పడింది. ఒకరికి టికెట్ వస్తే మరొకరికి సహకరించని పరిస్థితికి చేరింది. పైకి ఇరువర్గాలు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకుంటున్నప్పటికీ ఉప్పు నిప్పుగా వ్యవహరిస్తున్నారు. తనకు పోటీగా రాఘవరెడ్డి నియోజకవర్గంలో చేపడుతున్న ప్రచార కార్యక్రమాలను రాజేందర్ రెడ్డి వర్గం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. ఆఖరికి పార్టీ టికెట్ ఇవ్వకుంటే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమంటూ జంగా వర్గం నాయకులు అల్టిమేటం జారీ చేసే స్థితికి చేరారు.
పెద్దమ్మ గడ్డలో తన్నులాట, కేసు
ఇటీవల రాఘవరెడ్డి హనుమకొండలోని పెద్దమ్మ గడ్డ ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండగా, రాజేందర్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకుడు అంబేద్కర్ రాజు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఒకరిపై మరొకరు చేయి చేసుకునే వరకు వచ్చింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేశారు. రాఘవరెడ్డితో పాటు ఆయన అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఈ సందర్భంగా రాఘవరెడ్డి, రాజేందర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. నాయిని వెనుక మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఉన్నారని ఆరోపించారు. పెద్దమ్మ గడ్డకు ప్రచారం కోసం వెళితే నాయిని అనుచరుడు అంబేద్కర్ రాజు దాడి చేసే ప్రయత్నం చేసాడని తెలిపారు. సేవా దళ్ నాయకులు అశోక్ ను, కత్తుల కవిత ను, రేణుక ను కొట్టారు. రాత్రికి రాత్రి తనపై కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అనిశెట్టి వెపన్ కేసులో రాజేందర్ రెడ్డికి మంత్రి దయాకర్ రావు అండగా వున్నాడని చెప్పారు. ఆంజనేయ స్వామి భూమి కబ్జా కేసులో ఉన్నావని, అన్ని కేసుల్లో కుమ్మక్కయ్యారని, రేవూరిని ఓడించింది నాయిని అంటూ విమర్శించారు.
తారస్థాయికి వర్గ విభేదాలు
రాఘవరెడ్డి, రాజేందర్ రెడ్డి వర్గాలు ఎవరికి వారు తమ అనుచరులను పెంపొందించుకుంటూ ప్రచార కార్యక్రమంతో పాటు ఇతరత్రా పార్టీ కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజేందర్ రెడ్డి ఉన్నందున పార్టీ జిల్లా కార్యాలయం నుంచి తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ పరిశీలకులు, ఇతర నేతలు అధికారిక కార్యాలయంలో జరిగే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. దీనికి భిన్నంగా రాఘవరెడ్డి హనుమకొండ హంటర్ రోడ్ లో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసుకొని పోటీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా ఇరువర్గాలు వేర్వేరుగా చేస్తున్నందున పార్టీ శ్రేణులతో పాటు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది పైగా ఒక వర్గం అంటే మరొక వర్గానికి పడని పరిస్థితి నెలకొంది.
టికెట్ పంచాయతీ
రాజేందర్ రెడ్డి, రాఘవరెడ్డి వరంగల్ పశ్చిమ టికెట్ ఆశిస్తున్నారు. రాజేందర్ రెడ్డి గత రెండు పర్యాయాలు టికెట్ ఆశించినప్పటికీ 2014లో ఎర్రబెల్లి స్వర్ణకు, 2018లో మహాకూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పేరు ప్రకాశ్ రెడ్డికి టికెట్ కేటాయించారు. దీంతో రాజేందర్ రెడ్డి తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈసారి టికెట్ నాదే అనే ధీమాతో ఉన్నారు. ఈ స్థితిలో గత ఎన్నికల్లో పాలకుర్తి మంచి పోటీ చేసిన రాఘవరెడ్డి ఆ నియోజకవర్గాన్ని వీడి తన సొంత నియోజకవర్గమైన పశ్చిమలో గత కొన్ని నెలలుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అప్పటినుంచి ఇరువురి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. తనకు పోటీగా రాఘవరెడ్డి నియోజకవర్గంలో కార్యకలాపాలు చేపట్టడమే కాకుండా, టికెట్ ఆశించడాన్ని రాజేందర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కారణంగానే ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
జంగా వర్గం రాజీనామా అల్టిమేటం
రాఘవరెడ్డికి వరంగల్ పశ్చిమ కాంగ్రెస్ టికెట్ ఇవ్వకుంటే మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేస్తామని ఆయన వర్గం నేత కట్ల శ్రీనివాస్ శనివారం హెచ్చరించారు. జంగాకు గెలుపు అవకాశాలున్నా అధిష్ఠానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై సమాచారం తీసుకున్నాకే టికెట్ కేటాయించాలన్నారు. రాఘవరెడ్డికే టికెటివ్వాలని, లేనిపక్షంలో కార్పొరేటర్లు, నాయకులు కలిసి కఠిన నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. రాజేందర్ రెడ్డి తనకే టికెట్ వస్తుందని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఇదంతా ఓ మైండ్ గేమ్ అంటూ కొట్టిపారేశారు.
నాయకులపై కార్యకర్తల ఆగ్రహం
పదేళ్లుగా అధికారానికి దూరమై నియోజకవర్గంలో 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్నిక కాక పార్టీని నమ్ముకున్న కేడర్ అనేక ఇబ్బందులు పడుతున్నారు. నాయకులు మాత్రం రెండు వర్గాలుగా విడిపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీని పట్టించుకోకుండా వ్యక్తిగత ప్రతిష్ట కోసం కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తున్నారని ఆ పార్టీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.