కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేస్తుందన్న భయం ప్రధాని మోదీకి పట్టుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు
కాంగ్రెస్తోనే బలహీనవర్గాల సంక్షేమం
విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేస్తుందన్న భయం ప్రధాని మోదీకి పట్టుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇండియా కూటమి వస్తే సంవత్సరానికి ఒకరు ప్రధాని అవుతారని ప్రధాని మోదీ చెపుతున్నారని, ఇండియా కూటమికి మూడంకెల సీట్లే రావంటున్న మోదీ మరి సంవత్సరానికి ఒక ప్రధాని అవుతారని ఎట్లా అంటున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ కులగణన చేస్తామని చెప్పడంతో బీజేపీ దిగజారి మాట్లాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ పదేళ్ల పాలనలో అయోధ్య రామమందిరం కట్టడం తప్ప దేశాన్ని పారిశ్రామిక, వ్యవసాయ, వైజ్ఞానిక రంగాల్లో, ఆర్ధిక రంగంలో కొత్తగా ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. రిజర్వేషన్లను, రాజ్యాంగాన్ని తీసేస్తామన్నట్లుగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. మోదీ ఆలోచన అంత కార్పొరేట్ స్థాయే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ వస్తే ముస్లింలకు రిజర్వేషన్ తీసేస్తాడనడంలో సందేహం లేదన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే.. రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీలకి సామాజిక న్యాయం దక్కుతుందని చెప్పారు.