Rain Alert | తెలంగాణ వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నప్పటికీ.. రాత్రి వేళ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే నాలుగైదు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిసి ముద్దైన సంగతి తెలిసిందే.
ఇవాళ ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని తెలిపారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసినట్లు చెప్పారు. అకాల వర్షాలు కురుస్తున్నప్పటికీ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని వాతావరణ కేంద్రం వివరించింది. ఇవాళ, రేపు ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలోని కొన్నింటికీ రెడ్ అలర్ట్ జారీ చేశారు.
బుధవారం సుమారు 21 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. ఈరోజు తూర్పు, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో జల్లులు పడే అవకాశం ఉంది. బుధవారం ఎక్కడైతే ఎక్కువ వర్షాలు పడ్డాయో అక్కడ ఇవాళ తక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇవి హీట్ వేవ్ వర్షాలు కావడంతో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో దీని ప్రభావం ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.