మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ బీఆరెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆనంద్ భాస్కర్ బీఆరెస్ అధినేత కేసీఆర్కు పంపించారు. రాపోలుతో పాటు మెదక్ జిల్లా సీనియర్ నేత మహమ్మద్ మొహినుద్దీన్, వరంగల్ జిల్లా నేత, రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షుడు
విధాత : మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ బీఆరెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆనంద్ భాస్కర్ బీఆరెస్ అధినేత కేసీఆర్కు పంపించారు. రాపోలుతో పాటు మెదక్ జిల్లా సీనియర్ నేత మహమ్మద్ మొహినుద్దీన్, వరంగల్ జిల్లా నేత, రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షుడు తీగల లక్ష్మణ్ గౌడ్లు కూడా బీఆరెస్కు రాజీనామా చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ వెలుపల శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆరెస్ పార్టీకి తన అవసరం లేదని, అందుకే గత కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నానని వెల్లడించారు. విధిలేని పరిస్థితుల్లోనే బీఆరెస్ పార్టీని వీడుతున్నానని, దూరమవుతూ దూషించడం తన నైజం కాదన్నారు. తనను పార్టీలోకి ఆహ్వానిస్తూ కప్పిన గులాబీ కండువాను హైదరాబాద్లోని తెలంగాణ భవన్కు వినమ్రంగా పోస్టు ద్వారా రాజీనామా పంపిస్తున్నట్టు వెల్లడించారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్రియాశీలకంగా పనిచేస్తోందని.. కుల జనగణన దిశగా అడుగులు వేస్తోందని ప్రశంసించారు. ఏ పార్టీలోకి వెళతాననేది చెప్పలేనని.. ప్రజా ఉద్యమాల్లో ఉంటానని పేర్కొన్నారు.బలహీనవర్గాల ఆకాంక్షల సాధన, సామాజిక న్యాయ ఉద్యమాల్లో భవిష్యత్తులో తనదైన పాత్ర పోషిస్తానని చెప్పారు. చేనేత సామాజిక వర్గ ఉపాధి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటు పడుతూనే ఉంటానని తెలిపారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేసే కుట్రలు జరుగుతున్నాయని, వాటిని నిలువరించే ఉద్యమాల్లో కీలక భూమిక పోషిస్తానని ప్రకటించారు. హైదరాబాద్ అంశాన్ని రేవంత్ రెడ్డి, కేసీఆర్ అందరి దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. తెలంగాణ భౌగోళిక స్వరూపం ప్రగతి పరిరక్షణ కోసం ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తాననన్నారు.