దయనీయంగా రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి…పెన్షనర్స్ ప్రాణాలు కాపాడాలి
తెలంగాణ రాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని, వారి ప్రాణాలు కాపాడాలని మాజీ టీఎన్జీఓ అధ్యక్షుడు దేవీప్రసాద్ వెల్లడించారు. 3/24 నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బకాయిలు రావడంలేదు, తాము సర్వీసులో దాచుకున్న సొమ్ము తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు

- పెన్షనర్స్ ప్రాణాలు కాపాడాలి
- దయనీయంగా రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి
- హామీ ఇచ్చి నెరవేర్చని జాబితాలో ఉద్యోగుల పీఆర్సీ, డీఏలు
- మాజీ టీఎన్జీఓ అధ్యక్షుడు దేవీప్రసాద్
హైదరాబాద్, అక్టోబర్ 12(విధాత): తెలంగాణ రాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని, వారి ప్రాణాలు కాపాడాలని మాజీ టీఎన్జీఓ అధ్యక్షుడు దేవీప్రసాద్ వెల్లడించారు. 3/24 నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బకాయిలు రావడంలేదు, తాము సర్వీసులో దాచుకున్న సొమ్ము తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నెల 700 కోట్లు విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పి ఉద్యోగులను వేధిస్తున్నది, అనేక మంది తమ డబ్బులు రావడం లేదని మానసిక ఒత్తిడి కారణంగా మరణాలు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 15000 కోట్ల బకాయిలు ప్రతి నెల ఇచ్చిన మాట ప్రకారం చెల్లించినా రెండు ఏళ్లు పడుతుంది, దీనికి తోడు ప్రతి నెల రిటైర్ అయ్యే ఉద్యోగుల పరిస్థితి చెప్పనక్కరలేదని అన్నారు. రెండు లక్షల నలభై వేల కోట్లు అప్పులు తెచ్చిన ప్రభుత్వం రిటైర్ ఉద్యోగుల బకాయి తీర్చక పోవడం శోచనీయమన్నారు. ప్రజలకు హామీ ఇచ్చి నెరవేర్చని జాబితాలో ఉద్యోగుల పీఆర్సీ, డీఏలు కూడా చేరాయి, ప్రభుత్వం పై ఒత్తిడి పెంచి పోతున్న ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాలదేనని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ లేదు, హెల్త్ కార్డులు లేవు, 5 డీఏ ల జాడే లేదు, సీపీఎస్ రద్దు పై నాన్చివేత ధోరణి, కనీసం పండుగల అడ్వాన్స్ కూడా ఇవ్వకుండా ఉద్యోగులను వేధించడం దుర్మార్గమన్నారు. దీపావళి పండుగ సందర్భంగా డీ ఏ లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు