హైదరాబాద్ నగరంలో ఘోరం జరిగింది. ఐసీఎఫ్ఏఐ యూనివర్సిటీలో ఓ యువతికి అనుమానాస్పద రీతిలో గాయాలు అయ్యాయి. యువతి చేతులకు, కాళ్లకు కాలిన గాయాలు వెలుగు చూశాయి.
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ఘోరం జరిగింది. ఐసీఎఫ్ఏఐ యూనివర్సిటీలో ఓ యువతికి అనుమానాస్పద రీతిలో గాయాలు అయ్యాయి. యువతి చేతులకు, కాళ్లకు కాలిన గాయాలు వెలుగు చూశాయి.
ఐసీఎఫ్ఏఐ యూనివర్సిటీలోని ఉమెన్స్ హాస్టల్లోని నాలుగో అంతస్తులోని బాత్రూమ్లో ఆమెకు కాలిన గాయాలయ్యాయి. దీంతో ఆమెను హుటాహుటిన స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. కాలిన గాయాలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
అయితే స్నానం చేసే బకెట్లో అప్పటికే కొందరు ఆగంతకులు యాసిడ్ పోసినట్లు సమాచారం. ఈ విషయం తెలియని లేఖ్య.. బకెట్లో ఉన్నవి నీళ్లే అనుకుని మగ్గుతో ముంచుకుని ఒంటిపై పోసుకుంది. ఒక్కసారిగా యాసిడ్ ఒంటి మీద పడటంతో భరించలేని మంటతో ఆ విద్యార్థిని గట్టిగా అరిచింది. విద్యార్థిని కేకలతో తోటి విద్యార్థినులు వాష్రూమ్ దగ్గరికి వెళ్లి చూడగా.. అసలు విషయం తెలిసింది. దీంతో వాళ్లు వెంటనే కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందించారు. ఒళ్లంతా గాయాలతో తల్లడిల్లిపోతున్న సదరు విద్యార్థిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
వేడి నీరు ఒంటిపై పడటం వల్లే గాయాలైనట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. అసలు విద్యార్థినిపై ఎవరు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. దీని వెనుక ఉన్న కారణాలు ఏమై ఉంటాయనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.