Site icon vidhaatha

Yadagirigutta | యాదాద్రి కాదు.. ఇక నుంచి యాద‌గిరి గుట్టే…టెంపుల్ బోర్డ్ ఏర్పాటు చేస్తామ‌న్న సీఎం

 

Yadagirigutta | యాదాద్రి భువ‌న‌గిరి : ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి త‌న జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా త‌న మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రులు, ఎమ్మెల్యేల‌తో క‌లిసి శుక్ర‌వారం యాద‌గిరిగుట్ట ల‌క్ష్మి న‌ర్సింహ స్వామిని ద‌ర్శించుకున్నారు. అనంత‌రం యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వ‌హించిన సీఎం రేవంత్ రెడ్డి టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టీటీడీ స్థాయిలో బోర్డుకు ప్రాధాన్యత ఉండేలా పూర్తి అధ్యయనంతో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.

గోశాలలో గోసంరక్షణకు ఒక ప్రత్యేక పాలసీని తీసుకురావాలని అధికారులకు సీఎం సూచించారు. గోసంరక్షణకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్నారు. గతంలో కొండపై నిద్ర చేసేందుకు భక్తులకు అవకాశం ఉండేదని గుర్తుచేశారు. కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలన్నారు. విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాల‌ని అధికారుల‌కు స్ప‌ష్టం చేశారు.

ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణను పూర్తి చేయాలని, అందుకు అవసరమైన నిధులను వెంట‌నే మంజూరు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాల్సిందేనన్నారు. మరో వారం రోజుల్లో పూర్తి వివరాలు, ప్రపోజల్స్‌తో త‌న వ‌ద్ద‌కు రావాలని అధికారుల‌ను సీఎం అదేశించారు. ఇకనుంచి యాదాద్రికి బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Exit mobile version