కుసుమంచిలో స‌ర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేష‌న్.. భూ రిజిస్ట్రేషన్లలో నూతన శకం

ఖమ్మం జిల్లా పాలేరు నియోజ‌క‌వ‌ర్గం కుసుమంచి మండలంలో స‌ర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేష‌న్ చేసి చారిత్రాత్మకమైన అడుగు వేశామ‌ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స‌ర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేష‌న్ అయిన సందర్భంగా మంత్రి స్పందిస్తూ ఇంటిగ్రేటెడ్ భూభార‌తి పోర్టల్ దేశానికి ఆద‌ర్శంగా నిలుస్తుంద‌ని చెప్పారు.

first land registration with land map

విధాత, హైదరాబాద్:

మంగళవారం కుసుమంచి మండ‌లంలోని గట్టు సింగారం రెవెన్యూ గ్రామంలోని స‌ర్వే నంబ‌ర్ 156/ఇ/1 లో గ‌ల 1 ఎక‌రా 4 గుంట‌ల భూమిని నేల‌కొండ‌ప‌ల్లి మండ‌లం మెటాపురం గ్రామానికి చెందిన చెందిన‌ భాగం కిషన్‌రావు అనే రైతు విక్రయించారు. అదే గ్రామానికి చెందిన క‌ట్టా వెంక‌టేశ్వర్ రావుకు విక్రయిస్తున్న త‌న భూమి హ‌ద్దులతో కూడిన‌ మ్యాప్‌ను జ‌త‌చేసి కూసుమంచి త‌హ‌శీల్దార్‌ కార్యాల‌యంలో రిజిస్ట్రేష‌న్ చేశారు. దీనికి సంబంధించి (భూ క‌మ‌త పటము-1, భూధార్ నంబ‌ర్ 795GCHDCUPJ7H0)ను తాసిల్దార్‌ కేటాయించారు. ఇదే విధానాన్ని ద‌శ‌ల‌వారీగా రాష్ట్రవ్యాప్తంగా అమ‌లు చేసి భూవివాదాల‌కు శాశ్వత ప‌రిష్కారం ల‌భించేవిధంగా త‌మ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప‌నిచేస్తుంద‌ని పొంగులేటి అన్నారు. భూభారతి చట్టం ద్వారా ప్రభుత్వం భూ వ్యవహారాల్లో పూర్తిస్థాయి పారదర్శకతను తీసుకొచ్చింద‌ని ఆయన తెలిపారు. ప్రతి భూమికి కచ్చితమైన సర్వే మ్యాప్, ప్రత్యేక భూధార్ నంబర్ కేటాయించడం ద్వారా యాజమాన్యం హక్కులపై సందేహాలకు తావు లేకుండా చేస్తోంద‌ని అన్నారు. భూభారతి పోర్టల్ ద్వారా ఈ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. రైతు జీవితం భూమితో ముడిప‌డి ఉంద‌ని, దానిపై హక్కు స్పష్టంగా ఉన్నప్పుడే అత‌నికి భరోసా ఉంటుంద‌ని మంత్రి తెలిపారు. ఆ హక్కును సర్వే మ్యాప్‌, భూధార్ నెంబర్‌తో శాశ్వతంగా నిర్ధారించిన‌పుడే రైతుకు ధైర్యం, భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంద‌ని చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెవెన్యూ వ్యవస్థను సమూలంగా బలోపేతం చేస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. స‌ర్వే అండ్ ల్యాండ్ రికార్డులు, సెటిల్ మెంట్, రిజిస్ట్రేష‌న్ అండ్ స్టాంప్స్ విభాగాల‌ను ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చి రూపొందించిన ఇంటిగ్రేటెడ్ భూభార‌తి పోర్టల్‌ను ఏప్రిల్ 2వ తేదీ నుంచి నారాయ‌ణ‌పేట జిల్లా కోస్గి, ఖ‌మ్మం జిల్లా కుసుమంచి, భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, రంగారెడ్డి జిల్లా ఆమన్‌గ‌ల్‌, సంగారెడ్డి జిల్లా వ‌ట్‌ప‌ల్లిలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామ‌ని వివరించారు. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో కూసుమంచిలో సర్వే మ్యాప్‌తో భూమి రిజిస్ట్రేషన్ ప్రారంభిచామని చెప్పారు. రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో స‌ర్వే మ్యాప్ త‌ప్పనిస‌రి అనే నిబంధ‌న‌ను భూభార‌తి చ‌ట్టంలో పొందుప‌రిచామ‌న్నారు. ఎవ‌రైనా స్వచ్ఛందంగా వారి ఆస్తుల‌కు సంబంధించిన స‌ర్వే స‌ర్టిఫికేట్ కోసం ద‌రఖాస్తు చేసుకొని దృవీక‌రించుకోవ‌చ్చని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Read Also |

అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె…డిమాండ్లపై ప్రభుత్వం కమిటీ
Tiwanese Watermelon | పుచ్చ‌కాయ‌ల సాగు.. 3 నెల‌ల్లోనే రూ. కోటికి పైగా సంపాద‌న‌..

Latest News