REVANTH REDDY । కేసీఆర్‌.. నిన్ను తెలంగాణ సమాజం మర్చిపోయింది: సీఎం రేవంత్‌రెడ్డి

‘ఇప్పటికైనా మీలో మార్పు రావాలి.. ప్రభుత్వం చేసే మంచి పనులకు మద్దతు ఇవ్వండి.. లోపాలు ఉంటే సలహాలు ఇవ్వండి’ అని ముఖ్యమంత్రి హితవు పలికారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్‌ హాజరుకాకపోవడాన్ని ప్రస్తావించిన రేవంత్‌రెడ్డి.. ‘బడి దొంగలను చూసాం కానీ.. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా ఉన్న విచిత్ర పరిస్థితి తెలంగాణలో చూస్తున్నాం’ అని ఎద్దేవా చేశారు.

REVANTH REDDY ।  కేసీఆర్‌.. నిన్ను తెలంగాణ సమాజం మర్చిపోయింది: సీఎం రేవంత్‌రెడ్డి

REVANTH REDDY । పది నెలల్లో రాష్ట్ర ప్రజలు కోల్పోయింది ఏమీ లేదని, వాస్తవానికి కేసీఆర్‌ ఇంట్లోనే నలుగురు ఉద్యోగాలు కోల్పోయారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. పది నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమైందని కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ ‘ఈ పది నెలల్లో నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు, రైతులు రైతు రుణమాఫీతో రుణ విముక్తులయ్యారు. కోటి 5లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో లబ్ధి పొందారు. నష్టాల్లో కూరుకున్న ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది’ అని చెప్పారు. ‘49 లక్షల 90వేల కుటుంబాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వినియోగించుకుంటున్నారని, రూ.500లకే మా ఆడబిడ్డలు వంటగ్యాస్ సిలిండర్ అందుకోగలుగుతున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10లక్షల వరకు ఉచిత వైద్యం అందుకోగలుగుతున్నారు. 21వేల మంది టీచర్లు పదోన్నతులు పొందగలిగారు. 35వేల మంది టీచర్ల బదిలీలు చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిది’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

కేసీఆర్ వాస్తు కోసం సచివాలయం, ప్రగతి భవన్ కట్టుకుండు కానీ.. రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. ‘మా ప్రభుత్వం రాగానే 100 నియోజవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. విద్యనే తెలంగాణ సమాజాన్ని నిర్మిస్తుందని నిరూపిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా 563 గ్రూప్ ఉద్యోగాలకు విజయవంతంగా పరీక్షలు నిర్వహించామని, త్వరలో వారికి నియామక పత్రాలు అందించి.. వారిని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేస్తామని తెలిపారు. పది నెలల్లో రైతులు, నిరుద్యోగులను ఆదుకున్నాం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఇవన్నీ చేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘మీరు లేకపోయినా ఏం బాధలేదు.. మీతో ప్రజలకేం పని లేదు.. తెలంగాణ సమాజం నిన్ను మరిచిపోయింది’ అని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘ఇప్పటికైనా మీలో మార్పు రావాలి.. ప్రభుత్వం చేసే మంచి పనులకు మద్దతు ఇవ్వండి.. లోపాలు ఉంటే సలహాలు ఇవ్వండి’ అని ముఖ్యమంత్రి హితవు పలికారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్‌ హాజరుకాకపోవడాన్ని ప్రస్తావించిన రేవంత్‌రెడ్డి.. ‘బడి దొంగలను చూసాం కానీ.. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా ఉన్న విచిత్ర పరిస్థితి తెలంగాణలో చూస్తున్నాం’ అని ఎద్దేవా చేశారు.