Telangana Rising Global Summit| తెలంగాణ రైజింగ్ లో రికార్డు పెట్టబడులు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తొలి రోజున రికార్డు స్థాయిలో పెట్టుబడులను సాధించడంలో విజయవంతమైంది. ఒకే రోజు 35 కుపైగా ఎంవోయూలు..రూ. 2.43 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించడంలో సమ్మిట్ సక్సెస్ సాధించింది.

Telangana Rising Global Summit| తెలంగాణ రైజింగ్ లో రికార్డు పెట్టబడులు

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్( Telangana Rising Global Summit)తొలి రోజున రికార్డు స్థాయిలో పెట్టుబడుల(record investments)ను సాధించడంలో విజయవంతమైంది. ఒకే రోజు 35 కుపైగా ఎంవోయూలు..రూ. 2.43 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించడంలో సమ్మిట్ సక్సెస్ సాధించింది. భారత్ ఫ్యూచర్​ సిటీలో రెండు రోజుల పాటు కొనసాగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తొలి రోజున పేరొందిన కంపెనీలు.. దేశ విదేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తల నుంచి అనూహ్య స్పందన లభించింది.

35ఎంవోయూలు..రూ.2.43లక్షల పెట్టుబడులు

తొలి రోజే సుమారు రూ..2.43 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. 35 ఎంఓయూల పై సంతకాలు జరిగాయి. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రం “విజన్ 2047” దిశగా వేగంగా పయనిస్తున్న ఆర్థిక శక్తిగా తన సుస్థిర స్థానాన్ని చాటుకుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో తొలి రోజు డీప్‌టెక్‌, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ రంగాల్లో పలు పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేశారు. తెలంగాణలో పెట్టుబడులకు మన దేశంతో పాటు ఇతర దేశాల నుంచి ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. దీంతో ఒకే రోజున రూ. 2.43 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం ఆకర్షించింది. ఈ పెట్టుబడులు రాష్ట్ర అభివృద్ధికి, పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాల సృష్టికి దోహదపడనున్నాయి. ప్రత్యేకంగా, పునరుత్పాదక ఇంధనం, బయోటెక్, సినిమా నిర్మాణం, మీడియా, విద్య, టెక్నాలజీ వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు రావటం విశేషం.

ప్రధాన పెట్టుబడులు

భారత్ ప్యూచర్​ సిటీలో బ్రుక్‌ఫీల్డ్ యాక్సిస్ వెంచర్స్ కూటమి – రూ. 75 వేల కోట్లతో గ్లోబల్ రీసెర్చ్​ అండ్​ డెవెలప్​మెంట్​, డీప్​ టెక్​ హబ్​ ఏర్పాటుకు ముందుకు వచ్చింది.
పునరుత్పాదక విద్యుత్తు, ఈవీ ఇన్ఫ్రా విస్తరణకు విన్ గ్రూప్ – రూ. 27,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది.
SIDBI స్టార్ట ప్​లకు రూ.1,000 కోట్లు పెట్టబడులకు ముందుకు వచ్చింది.
వరల్డ్ ట్రేట్​ సెంటర్​ ఇన్నోవేషన్​ హబ్​ ఏర్పాటుకు రూ. 1000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.
ఈవ్​రెన్​ యాక్సిస్​ ఎనర్జీ రూ.31500 కోట్లతో సోలార్ పవర్​ , విండ్ పవర్​ మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.
మెఘా ఇంజనీరింగ్​ గ్రూప్ రూ.8 వేల కోట్లతో సోలార్, పంప్‌డ్ స్టోరేజ్, ఈవీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది.
ఏరోస్పేస్​ డిఫెన్స్​ రంగాల్లో ఎమ్మార్వోతో పాటు కార్గో విస్తరణకు జీఎంఆర్​ గ్రూప్ రూ. 15,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది.
డిఫెస్స్​, ఏవియానిక్స్​ తయారీకి అపోల్​ మైక్రో సిస్టమ్​ లిమిటెడ్​ రూ.1,500 కోట్లు పెట్టుబడులకు సిద్ధపడింది.
సోలార్​ ఎరోస్పేస్​, డిపెన్స్​ రంగంలో మిస్సైల్​ భాగాలు, ఏరో ఇంజన్​ స్ట్రక్షర్​కు రూ. 1,500 కోట్లు, ఎంపీఎల్​ లాజిస్టిక్స్​ కంపెనీ రూ.700 కోట్లు, టీవీఎస్​ ఐఎల్​పీ రూ.200 కోట్లు పెట్టుబడులకు ముందుకొచ్చాయి.
రెన్యూసిస్​, మిడ్ వెస్ట్, అక్షత్​ గ్రీన్​ టెక్​ ఎలక్ట్రానిక్స్‌ హైడ్రోజన్‌ టెక్ విస్తరణకు రూ. 7,000 కోట్లు పెట్టుబడులు పెడుతాయి. డిస్ట్రిబ్యూషన్​ హైడ్రో టెక్​ రంగంలో సాహీటెక్​ ఇండియా రూ. 1,000 కోట్లు. ఇంటిగ్రేటేడ్ స్టీల్​ ప్లాంట్​ ఏర్పాటుకు కృష్ణా పవర్​ యుటిలిటీస్​ రూ. 5,000 కోట్లు. సిమెంట్​ రంగ విస్తరణకు అల్ట్రా బ్రైట్​ సిమెంట్స్​, రెయిన్​ సిమెంట్స్​ రూ.2000 కోట్లకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
సీతారాం స్పిన్నర్స్​ రూ.3 వేల కోట్లతో టెక్స్​ టైల్​ యూనిట్​ నెలకొల్పనుంది. షోలాపూర్​ తెలంగాణ టెక్స్​ టైల్​ అసోసియేషన్ అండ్​ జీనియస్​ ఫిల్టర్స్ పవర్​ లూమ్​ టెక్నికల్​ యూనిట్కు రూ. 960 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది.

తెలంగాణ ప్రభుత్వంపై విశ్వాసానికి పెట్టుబడులు ప్రతీక

రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై దేశీయ, అంతర్జాతీయ విశ్వాసానికి నిదర్శనమని సీఎం రేవంత్​ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక్కడ పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడి నాణ్యమైన ఉపాధి అవకాశంగా, మౌలిక సదుపాయాలుగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. డీప్‌టెక్ సిటీ నుండి టెక్స్​ టైల్​ యూనిట్​ వరకు అన్ని రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలు, వైవిధ్యమైన పరిశ్రమల స్థాపనకు కంపెనీలు ముందుకు రావటం తెలంగాణ సుస్థిర పరిశ్రమల విధానాన్ని ప్రపంచానికి చాటిచెపుతోంది మంత్రి శ్రీధర్​బాబు అన్నారు.
ఈ భారీ పెట్టుబడులు తెలంగాణ రైజింగ్ 2047 దిశలో బలమైన పునాదులు వేస్తాయని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ అన్నారు.

కీలక పెట్టుబడులు

తొలి రోజున ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ రూ.41 వేల కోట్ల ఒప్పందాలు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెందిన టీఎమ్‌టిజీ (ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్) సంస్థ హైదరాబాద్‌లో అంతర్జాతీయ మీడియా, స్మార్ట్ టెక్నాలజీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రతిపాదించింది. ఈ మెగా డిజిటల్ మీడియా హబ్ ఏర్పాటుతో వేలాది మంది ఉద్యోగాలు రానున్నాయి.

ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ సంస్థ తెలంగాణలో వన్యప్రాణి సంరక్షణ మరియు జంతు సంక్షేమ కేంద్రం “వంతర” ఏర్పాటు చేయనుంది.
ఇది ఆసియాలో అతిపెద్ద ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకోనుంది.

బాలీవుడ్​ హీరో సల్మాన్ ఖాన్ కు చెందిన సల్మాన్​ ఖాన్​ వెంచర్స్ ఇండస్ట్రీస్​​ రూ.10,000 కోట్లతో రాష్ట్రంలో ప్రత్యేక టౌన్‌షిప్, ఫిల్మ్​ అండ్​ టెలివిజన్ స్టూడియో నిర్మించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇందులో వినోద వసతులు కల్పించనుంది.

ప్రముఖ సంస్థ అథిరత్ హోల్డింగ్స్ రాష్ట్రంలో 25 కాంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్లు నెలకొల్పనుంది. వీటిని స్థాపించేందుకు రూ. 4,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. రాష్ట్రంలో పర్యావరణహిత ఇంధన ఉత్పత్తి, గ్రామీణ ఉపాధి పెంపునకు ఇవి కీలకంగా మారనున్నాయి.

అపోలో గ్రూప్ హైదరాబాద్‌లో అత్యాధునిక విశ్వవిద్యాలయం, వైద్య విద్య మరియు పరిశోధనా కేంద్రం నిర్మాణానికి రూ. 800 కోట్లు పెట్టనుంది.
ఇది భవిష్యత్తు ఆరోగ్య విద్యా రంగానికి కొత్త దిశను చూపనుంది.

అంతర్జాతీయ మోటార్‌స్పోర్ట్స్ సంస్థ సూపర్‌క్రాస్ ఇండియా తెలంగాణలో ప్రపంచ స్థాయి రేసింగ్ ట్రాక్ మరియు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయనుంది.
ఇది స్పోర్ట్స్ టూరిజం అభివృద్ధికి దోహదం చేయనుంది.

యూనివర్సిటీ ఆఫ్ లండన్ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో ఆధునిక నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీంతో రాష్ట్రంలో యువతకు అంతర్జాతీయ విద్యా అవకాశాలు లభిస్తాయి.