తమిళ యువతిని పెళ్ళి చేసుకుంటారా..? రాహుల్‌ గాంధీని ప్రశ్నించిన మహిళ

విధాత, మార్తాండం (తమిళనాడు): రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో శనివారం ఓ సరదా సన్నివేశం చోటు చేసుకున్నది. ఉదయం యాత్ర కన్యాకుమారి జిల్లా ములగమూడు పట్టణ పంచాయతీ నుంచి మొదలైంది. మధ్యాహ్నం అదే జిల్లా మార్తాండం ప్రాంతంలో లంచ్ బ్రేక్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ మహిళా కూలీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారి సంపాదన, కుటుంబ స్థితిగతులు, తీసుకురావాల్సిన మార్పు తదితర అంశాలపై మాట్లాడారు. మాటల మధ్యలో […]

తమిళ యువతిని పెళ్ళి చేసుకుంటారా..? రాహుల్‌ గాంధీని ప్రశ్నించిన మహిళ

విధాత, మార్తాండం (తమిళనాడు): రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో శనివారం ఓ సరదా సన్నివేశం చోటు చేసుకున్నది. ఉదయం యాత్ర కన్యాకుమారి జిల్లా ములగమూడు పట్టణ పంచాయతీ నుంచి మొదలైంది. మధ్యాహ్నం అదే జిల్లా మార్తాండం ప్రాంతంలో లంచ్ బ్రేక్ తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఉపాధి హామీ మహిళా కూలీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారి సంపాదన, కుటుంబ స్థితిగతులు, తీసుకురావాల్సిన మార్పు తదితర అంశాలపై మాట్లాడారు. మాటల మధ్యలో ఓ మహిళ రాహుల్ పెళ్లి ప్రస్తావనను తీసుకొచ్చారు.

“మీరు తమిళనాడును ప్రేమిస్తారని మాకు తెలుసు. తమిళ యువతితో మీకు వివాహం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం” అని ఓ మహిళ రాహుల్ గాంధీతో అన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్విట్టర్‌లో వెల్లడించారు. వారితో మాట్లాడుతున్న సమయంలో రాహుల్ చాలా ఉత్సాహంగా కనిపించినట్లు ఆయన చెప్పారు. ఆ సన్నివేశానికి అద్దం పట్టే రెండు ఫొటోలను తన ట్వీట్ కు జత చేశారు.

మరోవైపు తెలంగాణలోని మేడ్ పల్లి గ్రామం నుంచి వ్యక్తిగతంగా వందల కిలోమీటర్లు ప్రయాణించి ఊసయ్య అనే వ్యక్తి యాత్రకు వెళ్లి రాహుల్ గాంధీని కలిశారు. కాసేపు ఆయనతో నడక సాగించారు. శనివారం సాయంత్రం యాత్ర కేరళలోకి ప్రవేశించింది. సరిహద్దులో ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాహుల్‌కు ఘన స్వాగతం పలికారు. కేరళలో 18 రోజుల పాటు కార్యక్రమం ఉంటుందని నేతలు తెలిపారు.