Kadiyam Kavya | కాంగ్రెస్తోనే అన్ని వర్గాలకు మేలు
రాష్ట్రంలో కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య అన్నారు

పదేళ్లు బిజెపి అధికారంలో ఉండి ఏం చేసింది
వరంగల్ జిల్లాకు బిజెపి రిక్త హస్తం
కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య
విధాత, వరంగల్ ప్రతినిధి: రాష్ట్రంలో కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య అన్నారు. శనివారం రోజు చిట్యాల మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చేస్తానన్నారు.
పదేళ్ల అధికారంలో బిజెపి చేసింది ఏంటి
కేంద్రంలో బీజేపీ పార్టీ పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోగా 32 వేల ఉద్యోగాలను కల్పించిదన్నారు. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ ప్రజల ఆదరణను పొందుతుందని అన్నారు. వరంగల్ జిల్లాలో పేదలకు వైద్యం అందించడంతో పాటు, కడియ ఫౌండేషన్ ద్వారా అనేక సేవలు అందించానని ఎంపీ అభ్యర్థి కడియం కావ్య తెలిపారు.
వరంగల్ జిల్లాకు శూన్యం
భారతీయ జనతా పార్టీ పదేళ్ల పాలనలో వరంగల్ జిల్లా అభివృద్ధికి చేసింది ఏమీ లేదు. కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, స్థానికులకు ఉపాధి అవకాశాలు లేక నష్టం పోయారని పేర్కొన్నారు. బీజేపీ అంటేనే మతతత్వ పార్టీ, దుర్మార్గపు పార్టీ అని అన్నారు. బీజేపీ సర్కార్లో దళితులకు అన్యాయం జరుగుతోందని వెల్లడించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే అని ఎవరికి ఓటు వేసిన నష్టపోయేది ప్రజలే అన్నారు.
భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పవని పేర్కొన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 ఎం.పీ స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదిస్తే మీతో ఉండి ఈ నియోజకవర్గన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎంపీ అభ్యర్థి కడియం కావ్య స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి, రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, జాతీయ కార్యదర్శి కత్తి వేంకట స్వామి, మహిళా జిల్లా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి, మార్క విజయ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాం నరసింహారెడ్డి, జడ్పిటిసిలు తిరుపతి రెడ్డి, MPTC అనిల్, మాజీ జడ్పిటిసి సాయిలు, మరియు ముఖ్య నాయకులు కిషన్ మధు వంశీకృష్ణ రాయకుండు, కామిని రత్నాకర్ రెడ్డి మరియు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.