AP Cabinet | ఏపీ తొలి కేబినెట్ కీలక నిర్ణయాలు.. చంద్రబాబు ఐదు సంతకాలకు ఆమోదం
సీఎం ఎన్. చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ తొలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సోమవారం రాష్ట్ర సచివాలయంలో మూడున్నర గంటల పాటు సాగిన కేబినెట్ భేటీ నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థ సారధి వెల్లడించారు

వరుసగా ఏడు శ్వేత పత్రాల విడుదలకు నిర్ణయం
మెగా డీఎస్సీకి కేబినెట్ ఆమోదం
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు
గంజాయి నివారణకు కేబినెట్ సబ్ కమిటీ
జూలై మూడో వారంలో బడ్జెట్ సమావేశాలు
మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పార్థసారధి
విధాత : సీఎం ఎన్. చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ తొలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సోమవారం రాష్ట్ర సచివాలయంలో మూడున్నర గంటల పాటు సాగిన కేబినెట్ భేటీ నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థ సారధి వెల్లడించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఏపీ సీఎం చంద్రబాబు చేసిన 5 సంతకాల ఫైళ్లకు సంబంధించిన అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని పార్థసారథి తెలిపారు. జులై 1 నుంచి రూ.7 వేల పింఛన్ అందిస్తామని చెప్పారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ చేపట్టేందుకు ఆమోదించిందని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ.. పింఛన్ల పెంపు, స్కిల్ సెన్సెస్లకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు.
183 అన్న క్యాంటీన్లను ఆగస్టు నెలలో ఒకే రోజున ఒకేసారి ప్రారంభించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించిందని, జిల్లాలకు రేపు లేదా ఎల్లుండి ఇంచార్జిలను నియమిస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారని వెల్లడించారు. జగన్ ప్రభుత్వం పరిపాలనపైన, వ్యవస్థలను, వనరులను ఏ విధంగా ధ్వంసం చేశాడన్నదానిపై ప్రజలకు వివరించేందుకు వరుసగా ఏడు శ్వేత పత్రాల విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని పార్థసారధి తెలిపారు. పోలవరం ,అమరావతి, విద్యుత్తు, ఫైనాన్స్, శాంతిభద్రతలు, మద్యం, పర్యావరణం కింద సాండ్ అండ్ మైన్ అంశాలపై శ్వేత పత్రాలు విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.
మెగా డీఎస్సీకి ఆమోదం
వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయకుండా విద్యా రంగానికి తీవ్రమైన నష్టం చేసిందని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే ఏపీ సీఎం చంద్రబాబు ఐదు ప్రధాన ఫైళ్లపై సంతకాలు చేశారు. నేడు జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో అందుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీకిగానూ మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఇందులో ఎస్జీటీ, టీజీటీ, ఇతరత్రా పోస్టులు ఉన్నాయి. డీఎస్సీకి క్వాలిఫికేషన్ అంటే టెట్ క్వాలిఫై అవ్వాలి. 80 శాతం డీఎస్సీ మార్కులు, 20 శాతం టెట్ మార్కులు పరిగణిస్తారు. కానీ జగన్ ప్రభుత్వం చివరిసారిగా టెట్ నిర్వహించింది, డీఎస్సీ నిర్వహించకపోవడంతో టీచర్ పోస్టుల కోసం చూస్తున్న నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
ఈ చట్టం పేరు చెప్పగానే భూ యజమానులు పిడుగుపడ్డట్లుగా భయపడ్డారని, గత వైసీపీ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని పార్థసారధి ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూములకు సంబంధించిన వివాదాలు పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని,. కేంద్రం తెచ్చిన చట్టంలో జగన్ ప్రభుత్వం మార్పులు చేసిందని ఆరోపించారు. ఎన్డీయే సర్కార్ తెచ్చిన చట్టాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు అమలు చేయలేదని, కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం ఈ చట్టాన్ని అమల్లోకి తేవడంతో సన్న, చిన్నకారు రైతులు నిద్రలేని రాత్రులు గడిపారన్నారు.
పాస్ బుక్ లపై జగన్ ఫొటో పెట్టడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారని చెప్పారు. కేంద్రం తెచ్చిన చట్టంలో టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని ఉంటే, దానికి బదులుగా ఎవరైనా వ్యక్తి అని జగన్ సర్కార్ మార్చిందని, ఏదైనా వివాదం తలెత్తితే ఎక్కడ అప్పీల్ చేసుకోవాలో కూడా చెప్పలేదన్నారు. దీనిపై ప్రజలు హైకోర్టును ఆశ్రయించాలని వైసీపీ నేతలు చెబుతున్నట్లుగా చేయడం సాధ్యమైనా అని కొలుసు పార్థసారథి ప్రశ్నించారు. దోపిడీ చేసేందుకు వైసీపీ అమలు చేసిన చట్టమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ సైతం భూయజమానుల వద్ద ఉండవు అని చెప్పడం వారిలో భయాన్ని పెంచిందన్నారు.
సామాజిక భద్రత పెన్షన్లు
65 లక్షల మందికి 28 కేటగిరీలలో పలు వర్గాలకు ఇస్తున్న సామాజిక భద్రత పింఛన్ ను పెంచినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. పింఛన్ ను రూ.3000 నుంచి రూ.4 వేలకు పెంచినట్లు చెప్పారు. జులై 1నుంచి కొత్త పెన్షన్లు అందిస్తామని చెప్పారు. జగన్ ప్రభుత్వానికి వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగేళ్లు పట్టిందని, కానీ చంద్రబాబు ప్రభుత్వం 10, 15 రోజుల్లో నిర్ణయం అమలు చేసిందన్నారు. సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ఉదయం 6 నుంచి సాయంత్రం లోగా లబ్ధిదారులకు పింఛన్ అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. దివ్యాంగులకు రూ.3 నుంచి రూ.6
వేలకు పింఛన్ పెంచారు.
పూర్తి అంగవైకల్యం ఉన్న వారికి రూ.5 వేల నుంచి రూ.15 వేలకు పెన్షన్ పెంచినట్లు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులు, అనారోగ్యంతో ఉన్నవారికి పింఛన్ రూ.5 వేల నుంచి రూ.10 వేలు అందిస్తామని పేర్కొన్నారు. మూడు నెలల బకాయి పెన్షన్ ను ఒకేసారి జులై 1న రూ.7 వేలు పింఛన్ అందిస్తామని పార్థసారథి తెలిపారు. పెంచిన పెన్షన్లతో రూ.819 కోట్లు ప్రభుత్వంపై అదనంగా ఆర్థిక భారం పడుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం సామాజిక భద్రత పింఛన్లకు ఏడాదికి రూ. 23,272.44 వెచ్చించగా, చంద్రబాబు ప్రభుత్వం ఏడాదికి రూ. 33,099 వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు.
స్కిల్ డెవలప్ మెంట్..
స్కిల్ డెవలప్మెంట్కు తమ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని పార్థ సారధి చెప్పారు. ఉన్నత చదవులు చదివినా జాబ్ చేసేందుకు అవసరమైన స్కిల్స్ లేకపోవడంతో యువత ఉద్యోగాన్ని తెచ్చుకోలేకపోతుంది. దాంతో స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమంతో యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తాం.. వ్యవసాయరంగంలోనూ నైపుణ్యాన్ని పెంచేందుకు స్కిల్ డెవలప్మెంట్ అమలు చేయడానికి తీర్మానం చేసినట్లు పార్థసారథి తెలిపారు.
అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ
ఎన్టీఆర్ ఆశయ సాధనలో భాగంగా అన్నా క్యాంటీన్లను చంద్రబాబు గత ప్రభుత్వం ఏర్పాటు చేయగా, ఆపై అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. అన్నా క్యాంటీన్లు పున ప్రారంభించి పేదలకు రూ.5కే నాణ్యమైన భోజనం అందిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 183 అన్న క్యాంటీన్లను ఒకేసారి ప్రారంభిస్తాం. మిగతా 20 అన్నా క్యాంటీన్లను త్వరలో ప్రారంభించాలని కేబినెట్ ఆమోదించింది. ప్రపంచంలో పేరున్న సంస్థల నుంచి టెండర్లు స్వీకరించి ఆగస్టులో ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు.ఇక, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని, జూలై మూడో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదం తీసుకోనున్నట్లుగా తెలిపారు.
గంజాయి నివారణకు కేబినెట్ సబ్ కమిటీ
గంజాయి నివారణకు హోంమంత్రి అనిత సారథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లుగా పార్థ సారధి తెలిపారు. హోం, రెవెన్యూ, హెల్త్, గిరిజన శాఖ మంత్రులతో ఉప సంఘం ఏర్పాటు చేయనున్నారు. గంజాయి నియంత్రణపై మంత్రుల కమిటీలో సభ్యుడిగా మంత్రి నారా లోకేశ్ ఉండనున్నారని చెప్పారు.