ఇంకా అందని జీతాలు.. ఉద్యోగులకు తప్పని పాట్లు
విధాత,అమరావతి:రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు చాలామంది జీతాలు, పింఛన్ల కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు.ఈ నెల రెండో తారీకు దాటినా చాలామంది ఖాతాల్లో జీతాలు జమ కాలేదు.ఉద్యోగులకు సగం మందికి అందినా, పింఛనుదారుల్లో వేల మందికి ఎదురుచూపులు తప్పడం లేదు.చాలినన్ని నిధులు అందుబాటులో లేకపోవడంతో అన్నింటికీ సర్దుబాట్లు తప్పడం లేదు.ఫలితంగా చెల్లింపులు ఆలస్యమవుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో జీతాలు, పింఛన్ల కోసం ప్రతినెలా రూ.5 వేల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఉన్న నిధుల మేరకు గురువారం […]

విధాత,అమరావతి:రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు చాలామంది జీతాలు, పింఛన్ల కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు.ఈ నెల రెండో తారీకు దాటినా చాలామంది ఖాతాల్లో జీతాలు జమ కాలేదు.
ఉద్యోగులకు సగం మందికి అందినా, పింఛనుదారుల్లో వేల మందికి ఎదురుచూపులు తప్పడం లేదు.చాలినన్ని నిధులు అందుబాటులో లేకపోవడంతో అన్నింటికీ సర్దుబాట్లు తప్పడం లేదు.ఫలితంగా చెల్లింపులు ఆలస్యమవుతున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో జీతాలు, పింఛన్ల కోసం ప్రతినెలా రూ.5 వేల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఉన్న నిధుల మేరకు గురువారం కొందరికి, శుక్రవారం మరికొందరికి జీతాలు జమ చేసినట్లు తెలిసింది.ప్రధానంగా రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు జీతాలు అందాయి.జిల్లాలు, వివిధ ప్రభుత్వశాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు చాలామంది తమకు ఇంకా రాలేదని పేర్కొంటున్నారు. ముందుగా బిల్లులు సమర్పించిన కొద్దిమందికి జీతాలు జమ చేసినా అనేక జిల్లాల్లో ఇంకా పెండింగులో ఉన్నాయి.రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ పింఛన్లు జమ కాలేదని, ఈ మేరకు తనకు ఫోన్లు వస్తున్నాయని పింఛనుదారుల చర్చావేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఈదర వీరయ్య తెలిపారు.
తమకే జమ కాలేదా, అందరికీ రాలేదా అన్న విషయంలో స్పష్టత లేక పింఛనుదారులు ఆందోళన చెందుతున్నారు.శనివారమైనా అందుతాయా అన్నది అనుమానమే. ఒకవైపు ఇప్పటికే వేస్ అండ్ మీన్స్ పరిమితి దాటిపోయినట్లు తెలిసింది. తిరిగి చెల్లింపులకు ఓవర్ డ్రాప్టుకు మధ్య గడువును అంచనా వేస్తూ కొంత మొత్తం సర్దుబాటు చేశారని, ఆ మేరకు మాత్రమే చెల్లింపులు జరిగాయని చెబుతున్నారు. రోజుకు ఖజానాకు పన్నులు, ఇతర వసూళ్ల రూపంలో వచ్చే మొత్తాలు తక్కువే.
ఈ నేపథ్యంలో మొత్తం అందరికీ జీతాలు, పింఛన్లు అందేందుకు మరికొంత సమయం పడుతుందని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. రిజర్వుబ్యాంకు నిర్వహించే సెక్యూరిటీ వేలం మంగళవారం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రూ.2,000 కోట్ల రుణం సమీకరించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సమర్పించింది. 16, 17 ఏళ్లల్లో తిరిగి చెల్లించేలా ఈ రుణ మొత్తం తీసుకుంటోంది. ఆ నిధులు బుధవారానికి సర్దుబాటు అవుతాయి. ఈలోపు ఓవర్ డ్రాప్టు సౌకర్యాన్ని వినియోగించుకుంటూ కొద్దికొద్దిగా చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేస్తారని సమాచారం.
బ్యాంకుల విలీనంతో ఖాతా నంబర్లు, కోడ్ల మార్పు దేశంలో కొన్ని బ్యాంకులు ఇతర బ్యాంకుల్లో విలీనమయ్యాయి. ఆ ప్రభావంతో జులై ఒకటి నాటికి సంబంధిత బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న వారు తమ ఖాతా నంబరు, ఐఎఫ్సీఆర్ కోడ్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగులు, పింఛనుదారులవి కూడా కొందరివి మార్పు చేయాల్సిన అవసరముంది.