Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల అధికారుల, పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దులతో పాటు ఆయా జిల్లాల మధ్య చెక్పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు తనిఖీల్లో రూ. 130.26 కోట్ల విలువైన నగదు, ఆభరణాలు, మద్యం, డ్రగ్స్తో పాటు ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎన్నికల కోడ్ కూసినప్పటి నుంచి మంగళవారం రాత్రి వరకు రూ. 71.55 కోట్ల నగదు, రూ. 7.75 కోట్ల విలువ చేసే మద్యం, రూ. 4.58 కోట్ల విలువ చేసే డ్రగ్స్, రూ. 40.08 కోట్ల విలువ చేసే నగలు, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. రూ. 6.29 కోట్ల విలువైన కానుకలను కూడా సీజ్ చేశారు. నిన్న ఒక్కరోజే తనిఖీల్లో రూ. 21.84 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.