Woman Molest | చేవెళ్ల బస్టాండ్లో దారుణం.. 20 ఏండ్ల యువతిపై అత్యాచారం

Woman Molest | బస్టాండ్లో నిద్రిస్తున్న ఓ 20 ఏండ్ల యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని చేవెళ్ల బస్టాండ్లో ఆదివారం రాత్రి చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కేశంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన యువతి(20)కి నాలుగు నెలల క్రితం పెళ్లైంది. వివాహమైన వారం రోజులకే భర్తతో ఆమెకు విబేధాలు ఏర్పడ్డాయి. దీంతో ఆమె తన పుట్టింటికి తిరిగి వచ్చింది. భర్త వద్దకు వెళ్లకుండా పుట్టింట్లోనే ఉంటున్న ఆమె.. ఆదివారం తల్లిదండ్రులతో గొడవపడింది. ఆ తర్వాత చేవెళ్లలోని తన సోదరి ఇంటికి బయల్దేరింది. తన సోదరి ఇంటి వద్ద లేకపోవడంతో తిరిగి చేవెళ్ల బస్టాండ్కు ఆదివారం రాత్రి చేరుకుంది. కానీ సొంతూరికి వెళ్లేందుకు బస్సుల్లేవు. అప్పటికే కల్లు తాగిన ఆమె.. నిద్రమత్తులోకి జారుకుంది.
ఇక ఇద్దరు యువకులు ఆ యువతిని గమనించారు. కామంతో రగిలిపోయారు. రాత్రి 10 తర్వాత బస్టాండ్లో ఎవరూ లేకపోవడంతో.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడ్నుంచి పరారీ అయ్యారు. ఇక సోమవారం తెల్లవారుజామున సమయం బస్టాండ్కు వచ్చిన ప్రయాణికులు.. వివస్త్రగా ఉన్న యువతిని చూసి, పోలీసులకు సమాచారం అందించారు. బస్టాండ్ వద్దకు చేరుకున్న పోలీసులు.. యువతిని చేరదీసి, ఆస్పత్రికి తరలించారు. బస్టాండ్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. చేవెళ్లకు చెందిన అనిల్ కుమార్, రాజు కలిసి ఆ యువతిపై అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం వారిద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.