స్పెషల్ చెఫ్ని వెంటపెట్టుకొని మరి ఇండియాకి వస్తున్న ఇంగ్లండ్ జట్టు..

ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ని 1-1తో సమం చేసింది భారత జట్టు. ఇక మరి కొద్ది రోజులలో సొంత గడ్డపై ఇంగ్లండ్ జట్టుతో తలపడేందుకు సిద్ధమైంది.టీమిండియాతో ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ జట్టు భారత్ పర్యటనకు వస్తోంది. జనవరి 25 నుంచి టీమిండియా-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ జరగనుండగా, ఈ టెస్టు సమరానికి ముందు ఇంగ్లండ్ జట్టు భారత్ లో రెండు వార్మప్ మ్యాచ్ లు ఆడనుంది. ఈ వార్మప్ మ్యాచ్ ల్లో ఇంగ్లండ్ తో ఆడే ఇండియా-ఏ జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఈ జట్టుకు అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా, ఆంధ్రా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కేఎస్ భరత్ కు కూడా ఈ జట్టులో స్థానం లభించింది.
ఇంగ్లండ్ జట్టు కోసం ఈ నెల 12 నుంచి రెండ్రోజుల పాటు తొలి వార్మప్ గేమ్, అనంతరం ఈ నెల 17 నుంచి నాలుగు రోజుల పాటు మరో వార్మప్ గేమ్ నిర్వహించబోతున్నారు. మొదటి వార్మప్ మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం గ్రౌండ్ బి వేదికగా నిలవనుండగా, రెండో మ్యాచ్ కు నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది.భారత్తో పోటీ పడేందుకు ఇండియాకు రానున్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఆ మేరకు పూర్తి సన్నద్ధమవుతోంది. స్పిన్కు అనుకూలించే ఉపఖండపు పిచ్లపై భారత స్పిన్నర్లను ఎదుర్కోవడం అంత తేలికకాదని, కాకపోతే అన్నింటికి సంసిద్ధంగా తాము ఉన్నామని ఇంగ్లండ్ క్రికెటర్స్ అంటున్నారు. 2012 తర్వాత ఇంగ్లిష్ జట్టు భారత్లో టెస్టు సిరీస్ విజయం సాధించలేకపోయిన విషయం తెలిసిందే. గత పర్యటనలో తొలి మ్యాచ్ నెగ్గిన ఇంగ్లండ్.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్లు ఓడి సిరీస్ కోల్పోవడం మనం చూశాం.
అయితే ఈ సారి సిరీస్ సాధించాలని కసితో ఉన్నారు. సుదీర్ఘ టూర్లో జట్టు ఆటగాళ్లు అస్వస్థత, అనారోగ్యాలకు గురికాకుండా తమ వెంట ప్రత్యేక వంటగాడిని తెచ్చకుంటున్నట్లు సమాచారం. ప్రఖ్యాత ఫుట్బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ చెఫ్ను భారత్కు తెస్తున్నట్లు అక్కడి పత్రికలు రాసుకొచ్చాయి. గతంలో పాకిస్థాన్ పర్యటన సందర్భంగానూ ఇంగ్లండ్ ఇలా ప్రత్యేక వంటవాళ్లను వెంట తీసుకెళ్లిన విషయం తెలిసిందే.భారత పర్యటనలో భాగంగా ఇంగ్లండ్.. జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా తొలి మ్యాచ్ ఆడనుంది. హైదరాబాద్ వేదికగా తొలి టెస్టు జరగాల్సి ఉంది. జనవరి 25 నుంచి మొదలుకాబోయే టెస్టు సిరీస్… మార్చి 07 నుంచి 11 దాకా ధర్మశాల వేదికగా జరుగబోయే ఆఖరి టెస్టుతో ముగుస్తుంది.