తెలంగాణలో ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలు విద్యార్థుల కంటే ప్రభుత్వాన్నే ఎక్కువగా టెన్షన్ పెడుతున్నాయి.
విధాత : తెలంగాణలో ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలు విద్యార్థుల కంటే ప్రభుత్వాన్నే ఎక్కువగా టెన్షన్ పెడుతున్నాయి. ఈ నెల 28నుంచి ఇంటర్మీడియట్, మార్చి 18నుంచి పదవ తరగతి పరీక్షలు జరుగనుండగా, అధికార యంత్రాంగం పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టింది. అయితే పరీక్షల నిర్వహణలో ఏ చిన్న తప్పు దొర్లినా అది ప్రతిపక్షానికి అస్త్రంగా మారడం ఖాయంగా కనిపిస్తున్నది. గత బీఆరెస్ ప్రభుత్వ హయాంలో ఇంటర్మీడియట్ పేపర్ల మూల్యాంకనాన్ని ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించడం, మూల్యాంకనంలో భారీగా తప్పులు దొర్లడం, 27మంది విద్యార్థులు ఆత్మహత్యల పాలవ్వడం రాజకీయంగా కూడా సంచలనం రేపింది.
అదే క్రమంలో ప్రశ్నపత్రాల్లో తప్పులు దొర్లడం, పది, టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలు వివాదాస్పదంగా మారగా, అప్పటి అధికార బీఆరెస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్ర రచ్చకు దారితీసింది. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు.. ప్రశ్నపత్రాల లీకేజీల ఆందోళలనలపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ సహా పలు పార్టీలు, విద్యార్థి సంఘాల నాయకులపై కేసులు కూడా నమోదయ్యాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, ఆ పార్టీ అనుబంధ విద్యార్థి యువజన సంఘాలు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల సమస్యలపైన, టెన్త్, టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలపైన ఆందోళనలు నిర్వహించాయి. గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో రావడంతో ఇప్పుడు ఇంటర్, టెన్త్ పరీక్షలు ఏ విధంగా నిర్వహించబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.
తప్పులు, లీకేజీలు జరిగితే ఆభాసుపాలే!
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలకు 9 లక్షల మంది, టెన్త్ పరీక్షకు 5లక్షల మంది వరకు హాజరుకానున్నారు. ఎక్కడ ఏ తప్పు దొర్లినా విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బందికరంగా మారనుంది. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పరీక్షల నిర్వహణ వైఫల్యాలపై ఆందోళనలు నిర్వహించిన కాంగ్రెస్.. ఇప్పుడు అధికారంలో ఉండి అదే తప్పులు చేస్తే ప్రతిపక్ష బీఆరెస్ సహా ఇతర పార్టీలు, సంఘాల నుంచి విమర్శలు ఎదుర్కోక తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఈ దఫా పరీక్షల నిర్వహణపై సీరియస్గా దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు పరీక్షల ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహించింది. ఏకంగా 24మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పరీక్షల పర్యవేక్షణ బాధ్యతలలో నియమించింది. గత ప్రభుత్వ హయాంలో పరీక్షల నిర్వహణలో జరిగిన తప్పులు మళ్లీ దొర్లకుండా చూడాలని అధికారులను గట్టిగానే ఆదేశించింది. ప్రశ్నపత్రాలలో తప్పులు దొర్లకుండా చూసుకోవడం, అలాగే పరీక్షల సక్రమ నిర్వహణ, జవాబు పత్రాల తరలింపు, మూల్యాంకన ప్రక్రియలు, ఫలితాల వెల్లడి వరకు ఎక్కడ తప్పులు దొర్లినా సహించేది లేదంటూ హెచ్చరించింది. ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ బాధ్యతను నిపుణులకు అప్పగించింది.
అయితే పరీక్షల నిర్వహణపై ఎంతగా ముందస్తు కసరత్తు చేసినప్పటికీ ఈ దఫా ఇంటర్ హాల్టికెట్ల పంపిణీలో ముందెన్నడూ లేని రీతిలో జాప్యం నెలకొనడం విమర్శల పాలైంది. ఇకపోతే మెరుగైన ఫలితాల సాధన దిశగా ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు ప్రశ్నపత్రాల లీకేజీలు..మాల్ ప్రాక్టీస్లకు పాల్పడే అవకాశముండటంతో అటువంటి విద్యాసంస్థలకు చెందిన అధ్యాపక, ఉపాధ్యాయులను ఈ దఫా పరీక్షల నిర్వహణ విధుల్లో వీలైనంత దూరంగా పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎప్పటిలాగే 144సెక్షన్ విధించనున్నారు. పరీక్షల సమయంలో జిరాక్స్ కేంద్రాలను మూసివేస్తారు. పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం తీసుకుంటున్న పకడ్బందీ చర్యలు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగనీయబోవన్న ఆశాభావం వ్యక్తమవుతున్నది.