Income Tax | మీరు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారా..? ఒకేసారి కాకుండా విడుతల వారీగా పన్నులు చెల్లిస్తుంటారా? అయితే, మీకో అలెర్ట్. ప్రస్తుతం అడ్వాన్స్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి గడువు ఈ నెల 15తో ముగియనున్నది. లేకపోతే ఆదాయపు పన్ను శాఖ జరిమానా విధించనున్నది. చాలా మంది పన్ను చెల్లింపుదారులు అడ్వాన్స్డ్ ట్యాక్స్ చెల్లిస్తుంటారు. ఒకే మొత్తంలో కాకుండా విడతలవారీగా చెల్లించేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) అవకాశం ఇస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం 2023-24కి సంబంధించి నాల్గో విడత అడ్వాన్స్డ్ ట్యాక్స్ చెల్లించేందుకు 15తో గడువు ముగియనుండగా.. పన్ను చెల్లించేందుకు సమయం రెండురోజులే మిగిలింది. ఎవరైనా పన్నులు చెల్లించకపోతే వెంటనే చెల్లించాలని అధికారులు సూచిస్తున్నారు.
అడ్వాన్స్డ్ ట్యాక్స్ సైతం ఒక రకమైన ఆదాయపు పన్ను. కానీ, సాధారణ పన్నులాగా వార్షిక ప్రాతిపదికన ఏకమొత్తంలో చెల్లించాల్సిన అవసరం లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ముందస్తుగానే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వాయిదాల వారీగా ముందుగానే జమ చేస్తూ వస్తుంటారు. దీన్నే అడ్వాన్స్డ్ ట్యాక్స్గా పిలుస్తుంటారు. అంచనా వేసిన ఆదాయంపై చెల్లించాల్సిన ట్యాంక్సులు రూ.10వేలకు మించి ఉన్నవారంతా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు సైతం ముందస్తు పన్నులు కట్టాల్సిందే. అయితే, ఉద్యోగులకు ఆయా కంపెనీలే జీతం నుంచి టీడీఎస్ కోత విధిస్తుంటాయి. దాంతో ప్రత్యేకంగా ఉద్యోగులు అడ్వాన్స్డ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఒక వేళ ఇతర ఆదాయ మార్గాలు ఉండి.. రూ.10వేలు పన్ను దాటిన సమయంలో ఈ నిబంధన వర్తిస్తుంది. అయితే, వ్యాపారం చేయని 60ఏళ్లు పైబడిన వారికి ముందస్తు పన్ను మినహాయింపు ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత కింద ఈ నెల 15వ తేదీ వరకు పన్ను చెల్లింపుదారులు 15శాతం పన్నులను అడ్వాన్స్గా చెల్లించాల్సి ఉంటుంది. మళ్లీ సెప్టెంబర్ 15 నాటికి 45శాతం, మూడో విడతలో డిసెంబర్ 15 వరకు 75శాతం, నాల్గో విడతలో మార్చి 15లోగా వంద శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
అడ్వాన్స్డ్ ట్యాక్స్ను వాయిదాల రూపంలో చెల్లించినప్పటికీ.. పన్ను మొత్తం సంవత్సరానికి లెక్కిస్తారు. ముందుగా ఆర్థిక సంవత్సరంలో ఎంత పన్ను చెల్లించాల్సి ఉంటుందో తెలుసుకోవాలి. మీ ఆదాయం నుంచి తగ్గింపులను తీసివేసిన తర్వాత, మీరు పన్ను స్లాబ్ ప్రకారం మిగిలిన మొత్తంపై పన్నును లెక్కించవచ్చు. అయితే, గడువులోగా అడ్వాన్స్డ్ ట్యాక్స్ను చెల్లించకపోతే ఆదాయపు పన్ను శాఖ చర్యలు తీసుకుంటుంది. సెక్షన్ 234-సీ ప్రకారం.. గడువులోగా చెల్లించాల్సిన పన్నుపై ఒకశాతం వరకు వడ్డీ జరిమానాగా విధిస్తుంది. సెక్షన్ 234బీ మేరకు ఆర్థిక ఏడాది చివరి వరకు చెల్లించిన ముందస్తు ట్యాక్స్, మొత్తం పన్నులో 90శాతం మించకపోయినా.. పూర్తిగా చెల్లించకపోయినా బకాయిగా ఉన్న పన్ను మొత్తంపై నెలకు ఒకశాతం వరకు వడ్డీ చెల్లించాల్సిందే. సెక్షన్ 234ఏ మేరకు చివరి తేదీ తర్వాత కడితే బకాయిపై నెలకు వడ్డీ శాతం పడుతుంది. ఈ వడ్డీ మొదటి విడత చెల్లింపుపై ఒక నెలకు.. తర్వాతి ఇన్స్టాల్మెంట్స్ చెల్లించని పక్షంలో మూడు నెలల పాటు విధిస్తారు.