మునుగోడు రిటర్నింగ్ అధికారిపై వేటు
విధాత: మునుగోడు రిటర్నింగ్ అధికారిపై కేంద్ర ఎన్నికల కమిషన్ వేటు వేసింది. ఎన్నికల గుర్తుల గందరగోళానికి ముగింపు పలికిన ఈసీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. యుగ తులసి అభ్యర్థి ఫిర్యాదు ఆధారంగా నివేదికలను పరిశీలించిన ఈసీ మొదట రోడ్ రోలర్ గుర్తు కేటాయించింది. దీని కోసం ఫారం 7 ను సవరించాలని ఆదేశించిది. సవరించిన ఫారం 7(ఏ) ను తక్షణమే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఈసీకి నివేదిక పంపాలని ఆదేశించింది. ఎన్నికల పరిశీలకుడికి సమాచాం […]

విధాత: మునుగోడు రిటర్నింగ్ అధికారిపై కేంద్ర ఎన్నికల కమిషన్ వేటు వేసింది. ఎన్నికల గుర్తుల గందరగోళానికి ముగింపు పలికిన ఈసీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. యుగ తులసి అభ్యర్థి ఫిర్యాదు ఆధారంగా నివేదికలను పరిశీలించిన ఈసీ మొదట రోడ్ రోలర్ గుర్తు కేటాయించింది.
దీని కోసం ఫారం 7 ను సవరించాలని ఆదేశించిది. సవరించిన ఫారం 7(ఏ) ను తక్షణమే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఈసీకి నివేదిక పంపాలని ఆదేశించింది.
ఎన్నికల పరిశీలకుడికి సమాచాం లేకుండా ఎన్నికల గుర్తు మార్చిన వ్యవహారంలో రిటర్నింగ్ అధికారి తీరును ఈసీ తీవ్రంగా పరిగణించింది. గుర్తు మార్పు విషయంలో సంబంధిత అభ్యర్థికి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నది.
రిటర్నింగ్ అధికారి తనకు లేని అధికారాన్ని ఉపయోగించి గుర్తు మార్చారని ఆక్షేపించి, విధి నిర్వహణలో తీవ్ర లోపం ఉన్నట్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్వోను మార్చాలని నిర్ణయం తీసుకున్నది. కొత్త ఆర్వో కోసం మూడు పేర్లను అధికారులు ప్రతిపాదించారు. సాయంత్రంలోగా కొత్త ఆర్వో నియామక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
కేంద్ర ఎలక్షన్ కమిషన్ తీరు ఆక్షేపనీయం
మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ వ్యవహారంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరు ఆక్షేపనీయమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్ అన్నారు. బీజేపీ రాజ్యాంగ వ్యవస్థలను ఏ విధంగా దుర్వినియోగంచేస్తున్నదో తెలిపేందుకు ఇది ఒక మరో తార్కాణమన్నారు.
పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యస్ఫూర్తికి అద్దం పట్టే విధంగా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ పైన బీజేపీ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తున్నది. 2011లోనే సస్పెండ్ చేసిన రోడ్డు రోలర్ గుర్తును తిరిగి పెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేయడమే అన్నారు.
గతంలో తమ అభ్యర్ధన మేరకు రోడ్డు రోలర్ గుర్తును తొలిగించి, మరోసారి తిరిగి ఈ ఎన్నికల్లో రోడ్డు రోలర్ ను తేవడం ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధమన్నారు. తమ పార్టీ కారు గుర్తును పోలిన గుర్తులతో అయోమయానికి గురిచేసి దొడ్డిదారిన ఓట్లు పొందే కుటిల ప్రయత్నాన్ని బీజేపీ చేస్తున్నదని ఆరోపించారు.
ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలన్న రాజ్యంగ స్ఫూర్తికి ఇది విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నారు. బీజేపీ రాజ్యాంగబద్ధ సంస్థలను తన స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
నిబంధనల మేరకు పని చేసిన రిటర్నింగ్ అఫీసర్ బదిలీపైన ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీజేపీ జాతీయ నాయకత్వంలో పని చేస్తున్న కేంద్ర ఎన్నికల కమిషన్.. మునుగోడులో ఓటమి తప్పదు అనే బీజేపీ అడ్డదారులు తొక్కుతున్నది కేటీఆర్ మండిపడ్డారు.