సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ కన్నుమూత

ముంబై : సహారా గ్రూప్ వ్యవస్థాపకులు, చైర్మన్ సుబ్రతా రాయ్(75) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్, డయాబెటిస్తో బాధపడుతున్న రాయ్.. మంగళవారం రాత్రి గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచినట్లు సహారా గ్రూప్ అధికారికంగా ప్రకటించింది. సుబ్రతా రాయ్కు భార్య స్వప్న, ఇద్దరు కుమారులు సుశాంతో రాయ్, సీమాంటో రాయ్ ఉన్నారు. వీరిద్దరూ విదేశాల్లో ఉంటున్నారు. రాయ్ మృతిపట్ల రాజకీయ, పారిశ్రామిక వేత్తలు సంతాపం ప్రకటించారు.
1948, జూన్ 10న బీహార్లో జన్మించిన సుబ్రతా రాయ్.. గోరఖ్పూర్లోని గవర్నమెంట్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో మెకానికల్ ఇంజినీరంగ్ చదివారు. 1976లో ఆర్థికంగా నష్టపోయిన చిట్ఫండ్ సంస్థ సహారా ఫైనాన్స్ను సుబ్రతా రాయ్ కొనుగోలు చేశారు. 1978లో దానిని సహారా ఇండియా పరివార్గా తీర్చిదిద్ది, తన విజయ ప్రస్థానాన్ని ప్రారంభించారు రాయ్. ఇక ఆ గ్రూపును ఫైనాన్స్, స్థిరాస్తి, మీడియా, ఆతిథ్యం వంటి రంగాలకు తన వ్యాపారాన్ని విస్తరించారు.
1992లో రాష్ట్రీయ సహారా పేరుతో ఓ వార్తా పత్రికను, సహారా టీవీ ఛానల్ ప్రారంభించారు. కొన్నాళ్లకు సహారా టీవీని సహారా వన్గా మార్చారు. 2010లో రాయ్ లండన్లోని గ్రోస్వెనర్ హౌస్ హోటల్ను, 2012లో న్యూయార్క్లోని ప్లాజా హోటల్ను కొనుగోలు చేసి అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచారు. 2000 దశకంలో సహరా ఇండియా పరివార్ సంస్థలో 1.2 మిలియన్ ఉద్యోగులు పని చేసేవారు. దేశంలోనే రైల్వే తర్వాత అత్యధిక ఉద్యోగులు ఉన్న సంస్థగా సహారా గ్రూప్ గుర్తింపు తెచ్చుకుంది. కేవలం రూ. 2 వేల మూలధనంతో సహారాను ప్రారంభించి దేశంలోనే అగ్రగామిగా నిలిపారని కంపెనీ తెలిపింది.
ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన సహారా గ్రూప్ 2014 నుంచి సవాళ్లను ఎదుర్కొంది. ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన కోట్ల కొద్దీ నగదును రిఫండ్ చేయాల్సిందిగా సెబీ కోరింది. మదుపరుల డబ్బులు తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతో సుప్రీం కోర్టు ఆదేశాల మధ్య రాయ్ తిహార్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన పెరోల్పై ఉన్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు మంగళవారం రాత్రి గుండె పోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్లు సహారా గ్రూప్ ప్రకటించింది.