స్టార్ కమెడీయన్గా మంచి పేరు తెచ్చుకున్న వివేక్ 2021లో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే.ఆయన మృతి కోలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద షాకే ఇచ్చింది అని చెప్పాలి. తనదైన నటనతో.. కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వివేక్ టాలీవుడ్ ప్రేక్షకులకి కూడా సుపరిచితమే. ఆయన అపరిచితుడు, రాఘువరన్ బీటెక్, శివాజీ, బాయ్స్, ఖుషీ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. గుండెపోటుతో హఠాన్మరణం చెందిన వివేక్ భౌతికంగా మనకి దూరమైన తన సినిమాలతో ప్రేక్షకులకి దగ్గరగానే ఉన్నాడు. అయితే తాజాగా వివేక్ ఇంట్లో శుభకార్యం జరగగా, ఆ శుభకార్యంలో వివేక్ కూతురు చేసిన పనికి అందరు ఫిదా అవుతున్నారు.
వివేక్కి పెళ్లీడు వచ్చిన కూతురు ఉండగా, ఆమె పెళ్లి చూడకుండానే కన్నుమూసారు. అయితే వివేక్ కూతురి వివాహం మార్చి 28న చాలా సింపుల్గా జరిగింది. చెన్నైలోని విరుగంబాక్కం పద్మావతి నగర్ లోని చిన్న కలైవారన్ రోడ్ లో గల వివేక్ నివాసం వద్ద జరగగా ఈ వేడుకకి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా పెళ్లి వేడుకకి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే పెళ్లి తర్వాత వివేక్ కూతురు తన తండ్రి జ్ఞాపకంగా భర్తతో కలిసి మొక్కలు నాటింది. ప్రకృతిని కాపాడాలనేది తన తండ్రి కల. అందుకోసమే తాను మొక్కలు నాటినట్టు చెప్పుకొచ్చింది.
ఇక వివాహానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మొక్కలు పంపిణి చేసి వాటిని నాటాలని కోరారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. వాటిని చూసిన అభిమానులు, నెటిజన్స్ వివేక్ ను తలుచుకొని ఎమోషనల్ అవుతున్నారు. వివేక్ .. అబ్ధుల్ కలాంని ఆదర్శంగా తీసుకొని లక్షలాది మొక్కలు నాటిన విషయం మనకు తెలిసిందే. ఎప్పుడు కూడా సమాజ సేవ చేస్తూ నలుగురికి అండగా ఉండేవాడు. నిరంతరం మొక్కలు కూడా నాటుతూ ప్రకృతిని కాపాడాలంటూ.. తన అభిమానులకు కూడా పిలుపునిచ్చేవారు. తండ్రి లేకపోయిన ఆయన కలని బ్రతికిస్తున్న కూతురిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది.