ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ స్థాయి ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంచెలంచెలగా టాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయి పెరుగుతుండడం అందరికి గర్వంగా ఉంది. రాజమౌళి బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో మన ఖ్యాతి ఎల్లలు దాటేలా చేశాడు. ఇప్పుడు మహేష్ బాబుతో విజువల్ వండర్ తెరకెక్కించే ప్లాన్ చేస్తుండగా, ఈ సినిమాతో హాలీవుడ్ కూడా మన సినిమా గురించి తప్పక చర్చించుకుంటుందని కొందరు అంటున్నారు. అయితే రాజమౌళి ఎప్పటికప్పుడు తన సినిమాలతో గ్రాఫ్ పెంచుతుంటే టాప్ డైరెక్టర్స్గా ఉన్న పూరీ జగన్నాథ్, బోయపాటి, త్రివిక్రమ్, కొరటాల శివ వంటి వారు ఇటీవల పట్టు కోల్పోతు వరుస ఫ్లాపులతో నిరాశపరుస్తున్నారు.
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఒకప్పుడు అత్యద్భుతమైన సినిమాలు చేశాడు. ఆయన సినిమాలు బాక్సాఫీస్ని షేక్ చేసేవి. కాని ఇప్పుడు అంతగా అలరించలేకపోతున్నాడు. చివరిగా లైగర్ అనే సినిమా చేయగా, ఈ మూవీతో పూర్తిగా నిరాశపరిచాడు. పూరీ నుండి ఇలాంటి సినిమాను అభిమానులు, ఆడియెన్స్ అస్సలు ఊహించలేదు. ఇక రచయిత నుండి దర్శకుడిగా మారి వరుస హిట్ సినిమాలు అందించిన కొరటాల.. చిరు, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో ‘ఆచార్య’ చిత్రం చేశారు. ఈ చిత్రం మెగా ఫ్యాన్స్ని కూడా డిజప్పాయింట్ చేసింది. ఈ మూవీపై చిరంజీవి పలు సందర్భాలలో తన అసహనం కూడా వ్యక్తం చేయడం మనం చూశాం.
ఇక మాస్, యాక్షన్ చిత్రాలకు ప్రసిద్ది చెందిన తెలుగు దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ‘అఖండ’ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన తర్వాత ‘స్కంద’తో తుస్సుమనిపించాడు. ఈ సినిమా దారుణాతి దారుణంగా బోల్తా కొట్టింది. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘గుంటూరు కారం’ చిత్రంతో సంక్రాంతికి అదిరిపోయే ఫీస్ట్ ఇవ్వడం ఖాయమని అందరు అనుకున్నారు. కాని ఇది చూపించాక ఇది త్రివిక్రమ్ మార్క్ సినిమా కాదని, ప్రేక్షకులని అంతగా అలరించలేకపోయిందని చెప్పుకొస్తున్నారు. మంచి దర్శకులుగా పేరు తెచ్చుకున్న వీరు ఇటీవల ఫామ్ కోల్పోతూ ఉండడం ఫ్యాన్స్ ని కాస్త కలవరపరుస్తుంది. తర్వాత సినిమాల విషయంలో అయిన కాస్త జాగ్రత్తలు తీసుకొని మంచి హిట్స్ అందించాలని కోరుతున్నారు