ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు 7 రోజుల రిమాండ్, కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. ఈ నెల 23వరకు ఆమె ఏడు రోజుల పాటు
విధాత : ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు 7 రోజుల రిమాండ్, కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. ఈ నెల 23వరకు ఆమె ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉండనుంది. కస్టడీ ముగిసిన తర్వాత 23వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఆమెను తిరిగి హాజరుపర్చాలని కోర్టు ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో సౌత్ గ్రూప్ లాబీయింగ్ ద్వారా100 కోట్ల రూపాయలు ఆప్కు అందించడంలో కవిత ప్రమేయం ఉందని ఈడీ అభియోగాలు మోపింది. ఈ అభియోగాలపై కస్టడీలో ఈడీ అధికారులు కవితను విచారణ చేయనున్నారు. కవిత బినామీగా ఉన్న రామచంద్రపిళ్లై, అభిషేక్ బోయినపల్లి, మాగుంట, అమిత్ అరోరాలతో పాటు కవిత భర్త అనిల్ను, పీఏ అశోక్ కౌశిక్లతో కలిపి ఆమెను విచారించనున్నారని సమాచారం. ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ కేసులో కవితతో పాటు 13మంది అరెస్టు కాగా, వారిలో కొందరు జైలులో ఉండగా, మరికొందరు బెయిల్పై ఉన్నారు.
రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు పలు కీలక అంశాలను పొందుపర్చారు. లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తి అని, ప్రధాన సూత్రధారి అని పేర్కొన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన తనయుడు రాఘవ, శరత్ చంద్రారెడ్డితో కలిసి సౌత్ సిండికేట్ ఏర్పాటు చేశారని పేర్కొంది. అప్ నేతలతో కుమ్మక్కై, వారికి రూ.100 కోట్లు ముడుపులు ఇచ్చారని, లిక్కర్ పాలసీలో తమకు అనుకూలంగా నిబంధనలు రూపొందేలా చూసుకున్నారని ఆరోపించింది. రామచంద్ర పిళ్లైని బినామీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీతో కవిత వాటా పొందారని, అతని ద్వారానే కవిత తన లావాదేవీలు సాగించారని, ఎంపీ మాగుంట ద్వారా రూ.30 కోట్లు ఢిల్లీకి కవిత చేర్చారని పేర్కొంది. సంబంధిత 30 కోట్లను అభిషేక్ బోయినపల్లి ఢిల్లీకి తీసుకెళ్లారని నివేదించింది. స్టేట్మెంట్ రికార్డు చేసే సమయంలో కవిత అసంబద్ధ సమాధానాలు చెప్పారని, సాక్ష్యాలను ధ్వంసం చేశారని పేర్కొంది. ఆమె గతంలో విచారణకు హాజరైన సందర్భంగా అందించిన తన సెల్ఫోన్లలో డాటాను తొలగించారని రిమాండ్ రిపోర్టులో ఈడీ తెలిపింది.
కవిత భర్త అనిల్ సహా ఐదుగురికి ఈడీ నోటీస్లు
కవిత భర్త అనిల్కు ఈడీ శనివారం నోటీసులు జారీ చేసింది. అనిల్తో పాటు కవిత పీఆర్వో రాజేశ్, ఆమె ముగ్గురు అసిస్టెంట్లకు నోటీసులు జారీ చేసింది. సోమవారం వారంతా విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే కవిత ఇంట్లో నిర్వహించిన సోదాల సందర్భంగా ఆ ఐదుగురికీ సంబంధించిన సెల్ ఫోన్లను ఈడీ సీజ్ చేసింది. కవిత భర్త అనిల్ను ఆయన చేస్తున్న వ్యాపారాలపైన, కవిత లావాదేవీలపైన ఈడీ అధికారులు విచారణ చేయనున్నారు.