జపాన్లోని మహానగరమైన పుకుయామా వణికి పోతున్నదిట. ఏం వార్త వినాల్సి వస్తుందోనని జనం హడలెత్తిపోతున్నారట. అంత హడలెత్తించే విషయం కారణం ఒక పిల్లి
టోక్యో : జపాన్లోని మహానగరమైన పుకుయామా వణికి పోతున్నదిట. ఏం వార్త వినాల్సి వస్తుందోనని జనం హడలెత్తిపోతున్నారట. అంత హడలెత్తించే విషయం కారణం ఒక పిల్లి. ఇప్పుడు అధికారులు ఆ పిల్లి జాడకనిపెట్టి, పట్టుకునేందుకు ప్రత్యేక గాలింపు బృందాలను ఏర్పాటు చేశారు. ఎంత తొందరగా పట్టుకుని ప్రజలకు అంత త్వరగా ఉపశమనం కలిద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ ఏమా పిల్లి కథ!
జపాన్లోని ఫుకుయామాలో ఓ పిల్లి ప్రమాదకరమైన రసాయనాల ట్యాంకులో పడి.. అక్కడి నుంచి కనిపించకుండా పోయిందట. ఆ పిల్లి బయటకు తిరిగితే.. క్యాన్సర్ కారక రసాయనాన్ని వెదజల్లుతూ పోతుందని ఆ నగర వాసులు, అధికారులు భయపడుతున్నారు. దీంతో ఆ పిల్లిని వెతికేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సదరు పిల్లి కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. చివరిసారిగా ఆ పిల్లి ఒక రసాయన కర్మాగారం నుంచి బయటకు వెళ్లిపోయినట్టు సీసీటీవీ ఫుటేజ్లో గమనించారు. ఒక కార్మికుడు ఆ పిల్లి పాదముద్రలను గమనించి.. విషయాన్ని పై అధికారులకు చేరవేశాడు. ఆ పిల్లికి అంటుకున్న రసాయనం ఎంతో ప్రమాదకరమైనదని అధికారులు చెబుతున్నారు. దానిని ముట్టుకున్నా.. లేదా ఆ వాసన పీల్చినా శరీరంపై దద్దర్లు వస్తాయని, వాపు కనిపిస్తుందని పేర్కొంటున్నారు. ఇది క్యాన్సర్ వ్యాధికి దారి తీసే ప్రమాదం కూడా ఉన్నదని హెచ్చరిస్తున్నారు. అది బతికి ఉన్నదో, అప్పటికే ఆ రసాయనం తీవ్రతకు చనిపోయిందో అర్థం కాక ప్రజల తలలు పట్టుకుంటున్నారు.
నోమురా మెక్కి బుకుమా ఫ్యాక్టరీ మేనేజర్ కో బై యాషి మాట్లాడుతూ వారాంతం తర్వాత కార్మికులు తిరిగి పనికి వచ్చినప్పుడు రసాయనాన్ని కప్పి ఉంచే షీటు పాక్షికంగా చిరిగిపోయిందని తెలిపారు. అప్పటి నుంచి పిల్లి కోసం సిబ్బంది వెతుకుతున్నారని చెప్పారు. ఫ్యాక్టరీ కార్మికులు సాధారణంగా రక్షిత దుస్తులను ధరిస్తారని, ఇప్పటివరకైతే కార్మికులలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు కనిపించలేదని పేర్కొన్నారు. దీనిపై స్వీడన్లోని కరోలిన్ స్కా ఇన్స్టిట్యూట్కు చెందిన రసాయన ప్రమాద అంచనాల నిపుణురాలు నిండా శంకు మాట్లాడుతూ సాధారణంగా పిల్లులు తమ బొచ్చును నాకుతుంటాయని, ఈ విధంగా చూస్తే ఆ పిల్లి ఇప్పటికే ఆ రసాయనాన్ని నాకి చనిపోయి ఉంటుందని అభిప్రాయపడ్డారు.