PoK Protests | అగ్నిగుండమైన పాక్ ఆక్రమిత కాశ్మీర్ – పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మృతి
పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజా ఆందోళనలు ఉధృతం. కాల్పుల్లో ఇద్దరు మృతి, 22 మందికి గాయాలు. ప్రాథమిక హక్కుల కోసం వేలాది మంది వీధుల్లోకి.. సైన్యం మోహరింపు, ఇంటర్నెట్ నిలిపివేత.

Pakistan-Occupied Kashmir Unrest: 2 Dead, Thousands Protest Against Pak Govt
ముజాఫరాబాద్:
PoK Protests | పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ప్రజల ఆగ్రహం బహిరంగ తిరుగుబాటుగా మారింది. ప్రాథమిక హక్కులు ఇవ్వాలంటూ వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. ముజాఫరాబాద్, మిర్పూర్, కోట్లి, రావలకోట్, నీలం వ్యాలీ, కెరాన్ వంటి ప్రాంతాల్లో ఆదివారం, సోమవారం నిరసనల తుఫాన్ ఎగిసిపడింది.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పిఓకే)లోని ముజఫరాబాద్లో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక నిరసనల్లో ఇద్దరు మరణించారు, 22 మంది గాయపడ్డారు. ఆవామీ యాక్షన్ కమిటీ (ఏఏసీ) నాయకత్వంలో జరిగిన ‘షటర్ డౌన్ వీల్ జామ్’ సమ్మెలో పాక్ ఆర్మీ, ఐఎస్ఐ మద్దతున్న ముస్లిం కాన్ఫరెన్స్ గుండాలు ప్రజలపై కాల్పులు జరిపినట్లు సమాచారం. పాక్ వార్తా ఛానళ్లు షేర్ చేసిన వీడియోల్లో రోడ్లపై గందరగోళం స్పష్టంగా కనిపించింది.
ప్రజలు నినాదాలు చేస్తూ రోడ్లపైకి దిగారు. జెండాలు ఊపుతూ వాహనాలపైకి ఎక్కి ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్లు, దుకాణాలు, బస్సులు, రవాణా సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.
70 ఏళ్లుగా మాకు ఎటువంటి హక్కులు లేవు : పిఓకే ప్రజల ఆవేదన
AAC ప్రజల తరఫున 38 పాయింట్ల డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. అందులో ముఖ్యంగా:
- PoK అసెంబ్లీలో 12 శరణార్థి సీట్లు రద్దు: పాకిస్థాన్లో నివసిస్తున్న కాశ్మీరి శరణార్థులకు కేటాయించిన సీట్లు స్థానిక ప్రజా ప్రతినిధులను బలహీనపరుస్తున్నాయని ఆరోపిస్తున్నారు.
- మంగ్లా, నీలం–జీలమ్ ప్రాజెక్టుల విద్యుత్ స్థానికులకు సబ్సిడీపై ఇవ్వాలి: అక్కడి జలవనరులపై విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నా, స్థానికులకు న్యాయమైన ధరలకు కరెంట్ అందడం లేదని ఆరోపణ.
- సరసమైన ధరలకు గోధుమ పిండి, నిత్యావసరాల సరఫరా– ఆహారధరలు పెరిగిపోవడంతో కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి.
- ఆలస్యమైన ఆర్థిక సంస్కరణలు వెంటనే అమలు చేయాలి: పరిపాలనా అవినీతి, ప్రత్యేక వర్గాల ప్రయోజనాలు రద్దు చేయాలంటూ స్పష్టమైన డిమాండ్.
70 ఏళ్లుగా మాకు మాకు న్యాయంగా దక్కాల్సిన హక్కులు దక్కలేదు. ఇక చాలు. లేకపోతే ప్రజల ఆగ్రహం ఎదుర్కోవాలంటూ AAC నేత షౌకత్ నవాజ్ మీర్ హెచ్చరించారు. ఆయన ఈ ఆందోళనను “ప్లాన్ A”గా పేర్కొంటూ.. తర్వాత ఇంకా కఠినమైన “ప్లాన్ D” సిద్ధంగా ఉందని హెచ్చరించారు.
భారీగా సైన్యం మోహరింపు.. ఇంటర్నెట్ నిలిపివేత
ఆందోళనలు విస్తరించడంతో పాక్ ప్రభుత్వం బలప్రదర్శన చేసింది.
- పంజాబ్ నుంచి వేలాది సైనిక దళాలు పీఓకేకు తరలించారు.
- ముజాఫరాబాద్, కోట్లి, రావల్కోట్లో ఫ్లాగ్ మార్చ్లు నిర్వహించారు.
- అదనంగా ఇస్లామాబాద్ నుంచి 1,000 మందికి పైగా పోలీసులను పంపించారు.
- ఇంటర్నెట్, సోషల్ మీడియా, మొబైల్ సేవలను నిలిపివేసి సమాచార ప్రవాహాన్ని అడ్డుకున్నారు.
- ముఖ్య నగరాల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను మూసివేశారు.
పాక్ ప్రభుత్వం “శాంతి భద్రతలు మా బాధ్యత” అని అధికారికంగా ప్రకటించినా, స్థానిక ప్రజల్లో దీనిపై నమ్మకం లేదని అక్కడి వర్గాలు చెబుతున్నాయి. “హక్కులు ఇవ్వాలన్న డిమాండ్ను అణచివేయడానికి మాత్రమే బలప్రయోగం జరుగుతోంది” అని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఆందోళనలకు పెరుగుతున్న మద్దతు
ప్రజా నిరసనలకు న్యాయవాద సంఘాలు, సివిల్ సొసైటీలు కూడా మద్దతు తెలపడం గమనార్హం. ఇది ఆందోళనను మరింత ఉధృతం చేస్తోంది.
ప్రస్తుతం AAC తాత్కాలికంగా నిరసనలను విరమించినా, అక్టోబర్ 15 నుంచి మలి దశ ఉద్యమం ప్రారంభిస్తామని ప్రకటించింది. దీంతో పిఓకే అంతటా ఉత్కంఠ కొనసాగుతోంది.
ఇటీవల పాక్ ఎయిర్ఫోర్స్ చైనా తయారీ J-17 జెట్లతో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో గ్రామాలపై బాంబులు వేసి 30 మంది పౌరులు మృతి చెందారు. దీంతో స్థానిక ప్రజల్లో భయం మరింత పెరిగింది. మరోవైపు, ఆపరేషన్ సిందూర్ తర్వాత జైషే మహ్మద్ వంటి తీవ్రవాద సంస్థలు కొత్త స్థావరాలు PoKలో ఏర్పాటు చేసుకోవడం స్థానికులకు మరింత కలవరపాటు కలిగిస్తోంది.