ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడి
ఊహించినట్లే జరిగింది. అమెరికా ఇరాన్ కీలక అణుస్థావరాలపై భీకర దాడి చేసింది. ఫోర్ట్, నటాంజ్, ఎస్ఫహాన్ అణుశుద్ధి కర్మాగాలపై తన బి–2 బాంబర్లతో విరుచుకుపడింది. ప్రతిగా ఇరాన్ ఇజ్రాయెల్పై దాడులకు తెగబడింది.

రెండు వారాల్లో అన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల్లో ముగించాడు. ఇరాన్కు తీవ్ర హెచ్చరిక జారీ చేసిన ట్రంప్ ఆశ్చర్యకరంగా ఇరాన్పై దాడి చేసాడు. ఇరాన్ ముఖ్యమైన మూడు అణుకేంద్రాలైన ఫోర్డో, నటాంజ్, ఎస్ఫహాన్ (Fordow, Natanz, and Esfahan)అణుకేంద్రాలను పూర్తిస్థాయిలో నాశనం చేసినట్లు ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. సరిగ్గా శుక్రవారం రాత్రి 10 నుండి 10.30 (CST) మధ్య ఎనిమిది ఇంధన ట్యాంకర్ విమానాలు ఓక్లహామా ఎయిర్బేస్ నుండి బయలుదేరి బి–2 బాంబర్ల (B-2) స్థావరమైన మిస్సోరీకి చేరుకున్నాయి. అక్కన్నుంచి నిశ్శబ్దంగా ఆరు బి–2 బాంబర్లు, ఇంధన విమానాలు బయలుదేరి ఇరాన్ వైపుగా దాదాపు 37 గంటలు ప్రయాణించి ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలపై దాడులు నిర్వహించాయి. వీటికి దన్నుగా అమెరికా సూపర్ ఫైటర్ జెట్లు ఎఫ్–22(F-22)లు, ఐదోతరం ఫైటర్ ఎఫ్35ఏ(F35A)లు అనుసరించినట్లు వాషింగ్టన్ పోస్ట్ వివరించింది. ముఖ్యంగా అతి ప్రమాదకరంగా భావిస్తున్న ఫోర్డో అణుఇంధన శుద్ధి కేంద్రం(Fordo Nuclear enrichment Centre) పై ఏకంగా ఆరు జిబియు–57 (GBU-57)బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించినట్లు తెలిసింది. దీంతో రెండు బాంబులతో పనైపోతుందని అంచనా వేసిన రక్షణరంగ నిపుణులకు ఆశ్చర్యపరుస్తూ ఆరు బాంబులు వేయడంతో ఫోర్డో నామరూపాల్లేకుండా సర్వనాశనమైపోయిందని అమెరికా ప్రకటించింది. దీంతోపాటు, తీరానికి 400మైళ్ల దూరంలో మోహరించిఉన్న అమెరికన్ జలాంతర్గాములు (Sub-marines)దాదాపు 30 తోమహాక్(Tomahawk) క్రూయిజ్ క్షిపణులకు కూడా ప్రయోగించినట్లు తెలిసింది.
— Donald J. Trump (@realDonaldTrump) June 21, 2025
వీటి ప్రయోగంతో అమెరికా అధికారికంగా యుద్ధంలోకి దిగినట్లైంది. దాడుల తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump)జాతినుద్దేశించి మాట్లాడుతూ, అమెరికా సైన్యం అత్యద్భుతంగా పనిచేసిందని కొనియాడారు. ప్రపంచంలోని ఏకైక భారీ సైనిక శక్తి తన సత్తా ఏంటో చాటిందన్న ట్రంప్, వారికి అభినందనలు తెలియజేసారు. ఇక ఇరాన్(Iran)కు మిగిలింది శాంతి, దు:ఖం అనే రెండు అవకాశాలే. ఎటువంటి ప్రతిఘటనాచర్యలు చేపట్టినా, ఇరాన్కు రెండోదో మిగులుతుందని హెచ్చరించారు.