Raghu Babu| టాలీవుడ్ కమెడీయన్ రఘుబాబు మనందరికి సుపరిచితమే. ఆయన ఇటీవల సినిమాలలో అంతగా కనిపించడం లేదు. అయితే రఘుబాబు వెళ్తున్న కారును బైక్పై వేగంగా వచ్చిన జనార్ధన్ రావు అదుపు తప్పి ఢీ కొట్టడంతో అక్కడికక్కడ మృతి చెందాడు. మృతుడు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నల్లగొండ పట్టణ కార్యదర్శి సంధినేని జనార్ధన్ రావు (51)గా గుర్తించారు. తెలంగాణలోని నల్గొండ పట్టణ సమీపంలోని అద్దంకి- నార్కట్ పల్లి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో రఘుబాబు తప్పేమి లేదని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పుకొస్తున్నారు. కాని మృతుని భార్య నాగమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలలోకి వెళితే నల్గొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన సందినేని జనార్దన్ రావు (51) బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. బుధవారం రోజు మధ్యాహ్నం ఆయన పట్టణంలోని రిక్షా పుల్లర్స్ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన దత్తసాయి వెంచ్ నుండి తన బైక్పై ఇంటికి వెళుతున్నారు. అదే సమయంలో నటుడు రఘుబాబు తన కారులో (KA 03 MP 69 14) హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తుండగా, ప్రమాదవశాత్తు రఘుబాబు కారు జనార్దన్ రావు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో జనార్దన్ రావుకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన సమయంలో రఘుబాబు చాలా ఆందోళనగా కనిపించాడు. పక్కన ఉన్న వ్యక్తులు టెన్షన్ పడొద్దని, నీళ్లు తాగమని సూచించారు. అయితే ద్విచక్ర వాహనం మీద వచ్చిన వ్యక్తి ఎటువైపు నుంచి వచ్చాడు.. ఎలా ప్రమాదం జరిగింది అని రఘుబాబుతో స్థానికులకి తెలియజేశారు. ప్రమాదం సమయంలో నటుడు రఘుబాబు కారు బైకును దాదాపు 50 మీటర్ల దూరం లాక్కెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. చనిపోయిన జనార్దన్ రావు స్వస్థలం నకిరేకల్ మండలంలోని మంగళపల్లి గ్రామం అని తెలుస్తోంది. జనార్దన్ రావుకు భార్య నాగమణి, కుమార్తె, కుమారుడు ఉన్నారు.