మ్యాట్రిమోనిలో పరిచయమైన సైబర్ నేరగాడి ఉచ్చులో చిక్కుకున్న హైదరాబాద్ యువతి 2.71కోట్లు పొగొట్టుకుంది
విధాత : మ్యాట్రిమోనిలో పరిచయమైన సైబర్ నేరగాడి ఉచ్చులో చిక్కుకున్న హైదరాబాద్ యువతి 2.71కోట్లు పొగొట్టుకుంది. మోసం చేసిన నిందితుడు శ్రీబాల వంశీకృష్ణను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వంశీకృష్ణ మ్యాట్రిమోనిలో హైదరాబాద్ మధినగూడకు చెందిన బాధిత యువతితో పరిచయం పెంచుకున్నాడు. గ్లెన్మార్క్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నట్టు చెప్పి, అమెరికా తీసుకెలుతానని, అందుకు తన సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని బాధిరాతురాలిని నమ్మించాడు.
సిబిల్ స్కోరు పెంచుతానని చెప్పి స్కోర్ పెంచేందుకు కంపెనీ నుంచి రుణాలు ఇప్పిస్తానని నమ్మబలికి ఆమెకు సంబంధించిన బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకున్నాడు. పలు దఫాలుగా రూ.2.71 కోట్లు కాజేశాడు. జరిగిన మోసాన్ని ఆలస్యంగా గ్రహించిన బాధితురాలు మార్చి 16న చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడి వంశీకృష్ణ నుంచి పలు బ్యాంకులకు చెందిన ఆరు పాస్బుక్లు, 10 డెబిట్ కార్డులు, 3 ఫోన్లు, 4 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. సైబర్ నేరం జరిగిన వెంటనే బాధితులు 1930 నెంబరు ఫోన్ చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు.