Banks | మొత్తం ఉద్దేశపూర్వకంగా ఎగవేసినవే అందులో మెహుల్ చోక్సీ టాప్ పొజిషన్ 31 బ్యాంకులకు 8,738 కోట్లు చోక్సీ టోకరా ఎన్పీఏల రద్దులోనూ బీజేపీ సర్కారుదే రికార్డు మన్మోహన్ హయాంలో 1.93 లక్షల కోట్లు.. మోదీ హయాంలో అంతకు ఐదింతలు రద్దు 8 ఏళ్లలో బ్యాంకుల్లో 12 లక్షల కోట్లు గాయబ్ న్యూఢిల్లీ: అవినీతిని సహించే ప్రసక్తే లేదని, తన జీవితాంతం అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటానని ప్రధాని నరేంద్రమోదీ పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ఎర్రకోటపై […]
Banks |
న్యూఢిల్లీ: అవినీతిని సహించే ప్రసక్తే లేదని, తన జీవితాంతం అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటానని ప్రధాని నరేంద్రమోదీ పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ఎర్రకోటపై ఉపన్యాసంలో నొక్కి చెప్పారు. అయితే.. మోదీ హయాంలోనే భారతీయ బ్యాంకులను బడా కార్పొరేట్ శక్తులు వేల కోట్లలో లూటీ చేశాయని, వాటి యజమానుల్లో కొందరు దర్జాగా విదేశాలకు చెక్కేశారని పలువురు రాజకీయ, ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. వాళ్లకు కోట్లలో రుణాలు ఇచ్చిన బ్యాంకులు మాత్రం దిక్కుతోచని స్థితిలో కునారిల్లుతున్నాయి.
బక్క కస్టమర్ల బకాయిలపై ప్రతాపం చూపిస్తూ.. ఎస్ఎంఎస్ సేవలకు కూడా చిల్లర వసూలు చేస్తూ నష్టాలు భర్తీ చేసుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నాయి. బ్యాంకులను ముంచిన టాప్ 50 కార్పొరేట్ కంపెనీలపై స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఇటీవల పార్లమెంటుకు వివరాలు సమర్పించింది. అందులో గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ అధినేత మెహుల్ చోక్సీ నంబర్ వన్గా నిలిస్తే.. ఎరా ఇన్ఫ్రా ఇంజినీరింగ్ లిమిటెడ్, ఆర్ఈఐ ఆగ్రో లిమిటెడ్, ఏబీజీ షిప్యార్డ్ లిమిటెడ్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
వీరంతా కలిసి.. బ్యాంకులకు ఎగవేసిన మొత్తం 87వేల కోట్ల 295 కోట్లు. అందులో చోక్సీ ఎగవేసింది 8,738 కోట్లు. 50 సంస్థల్లోనూ టాప్ 10లో ఉన్న కంపెనీలే దాదాపు సగం సొమ్ము ఎగ్గొట్టాయి. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులకు అవి ఎగ్గొట్టిన మొత్తం 40,825 కోట్లని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో ఎరా ఇన్ఫ్రా 5,750 కోట్లు టోపీ పెడితే.. ఆర్ఈఐ ఆగ్రో 5,148 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఏబీజీ షిప్యార్డ్ లిమిటెడ్ 4,774 కోట్లు ఎగ్గొట్టింది. కాన్కాస్ట్స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ కంపెనీ ‘కట్టలేక’ పోయిన సొమ్ము 3,911 కోట్లు.
ఐదేళ్లలో 10 లక్షల కోట్ల మొండి బకాయిల రద్దు
గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఎస్సీబీలు మాఫీ చేసిన రుణాలు.. 10,57,326 కోట్లని ప్రభుత్వం పేర్కొన్నది. ఇందులో సామాన్య ప్రజలు తీర్చలేక పోయిన అప్పు ఎంత ఉంటుందో, బడా కంపెనీలు, పెద్ద పెద్ద వ్యక్తులు ఎగవేసిన సొమ్ము ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు.
విచిత్రం ఏమిటంటే.. ఎన్పీఏలు, రుణమాఫీల విషయానికి వస్తే.. అదంతా గతంలో మన్మోహన్సింగ్ ప్రభుత్వం పుణ్యమేనని చెప్పే కొందరు దేశ ‘భక్తులు’.. మెహుల్ చోక్సీ వంటివారు 2016 నుంచి రుణాలు పొంది, పరారైన వారేనని అంగీకరించేం దుకు మాత్రం సిద్ధ పడరని ఒక రాజకీయ విశ్లేషకుడు విమర్శించారు. వీరంతా విల్ఫుల్ డిఫాల్టర్లని కేంద్రమే చెప్పిందని గుర్తు చేశారు. అంటే.. రుణాలు తిరిగి చెల్లించే అవకాశం ఉన్నా.. రుణాలు చెల్లించనివారు అని అర్థం.
8 ఏళ్లలో బ్యాంకుల నుంచి 12 లక్షల కోట్లు స్వాహా
నరేంద్రమోదీ పాలనలో 8 ఏళ్ల కాలంలో 12 లక్షల కోట్లు పద్ధతి ప్రకారం బ్యాంకుల నుంచి స్వాహా అయ్యాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. సొమ్మంతా బడా కార్పొరేట్లు తీసుకున్న రుణాలేనని చెబుతున్నారు. చట్టబద్ధంగా రుణాలు తీసుకోవడం, మొండి బకాయిల పేరుతో మాఫీ చేయించుకోవడం బడా కార్పొరేట్లకు ఆటలా మారిందని విమర్శలు ఉన్నాయి. మొండి బకాయిలు రద్దు చేయడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నదేనని, అయితే.. అంతర్జాతీయ ప్రమాణాలతో పోల్చితే భారత్లో నాలుగు నుంచి ఆరు రెట్లు అధికంగా రుణాల రద్దు ఉంటున్నదని ఒక ఆర్థిక నిపుణుడు తెలిపారు.
ఇంత భారీ స్థాయిలో లోటీ సజావుగా సాగిపోవడం రాజకీయంగా అండలేనిదే సాధ్యం కాదని ఆయన అన్నారు. కీలకమైన రాజకీయ శక్తుల నుంచి ఫలానా వాళ్లకు రుణాలు ఇవ్వాలని ఆదేశాలు వస్తే.. ఏదైనా బ్యాంకు జీఎం, ఈడీ లేదా సీఎండీ వారికి ఆ రుణం ఇవ్వడం తప్ప మరో మార్గం లేదని ఒక బ్యాంకింగ్ రంగంపై పట్టున్న ఒక నిపుణుడు స్పష్టం చేశారు. రాజకీయ నాయకులతో సంబంధం లేని వారు మాత్రమే దొరికిపోతుంటారని అన్నారు.
ఎన్పీఏల రద్దు ఇలా
బ్యాంకులకు చెల్లించాల్సిన గడువు 90 రోజులు దాటితే వాటిని మొండి బకాయిల జాబితాలో చేర్చుతారు. అయితే.. అప్పులు ఇచ్చిన బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు వెంటనే రంగంలోకి దిగవు. వాటిని వివిధ క్యాటగిరీలుగా విభజిస్తాయి. సబ్స్టాండర్డ్, ఒకటో స్థాయి అనుమాన స్థితి, రెండో స్థాయి అనుమాన స్థితి ఇలా ఉంటాయి. ఇలా అన్ని స్థాయిలు దాటి పోయిన తర్వాత ఇక అవి వసూలు కావనే నిర్ణయానికి వచ్చిన దాదాపు నాలుగేళ్లకు మొండి బకాయిల రద్దు అనే అంశం ముందుకు వస్తుంది. అందరూ ఉద్దేశపూర్వకంగానే ఎగ్గొట్టరు. ఎన్పీఏల విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్నాయి. మొత్తం ఇచ్చిన రుణంలో 1 నుంచి 2 శాతం వరకూ రాని బకాయిల కింద జమకట్టవచ్చని అవి పేర్కొంటున్నాయి.
ఎన్పీఏ నిష్పత్తి మన వద్దే ఎక్కువ
2021లో ఐఎంఎఫ్ విడుదల చేసిన రికార్డులు పరిశీలిస్తే.. మొత్తం ఇచ్చిన రుణం, ఎన్పీఏ నిష్పత్తి అమెరికా, బ్రిటన్లలో 1శాతంగా ఉన్నది. కెనడాలో 0.4%గా ఉన్నది. ఆర్థిక నేరాలపై కఠినంగా వ్యవహరించే చైనాలో 1.7శాతంగా ఉన్నది. మలేషియాలో 1.7%, ఇండోనేషియాలో 2.6%, ఇటలీలో 3%, రష్యాలు 8.3%గా ఉన్నది. పాలకులతో కుమ్మక్కయ్యే ప్రభుత్వ బ్యాంకులను ఇష్టానుసారం దోచుకుంటారనేది అందరికీ తెలిసిందేనని ఒక ఆర్థిక నిపుణుడు చెప్పారు. అయితే.. మోదీ హయాంలో ఎన్పీఏ నిష్పత్తి రష్యాకంటే దారుణంగా ఉన్నదని ఆయన పేర్కొన్నారు.
నాలుగేళ్లలోనే బ్యాంకులకు 2 లక్షల కోట్ల మేర నష్టాలు
యూపీఏ-2 హయాంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏటా 35 వేల కోట్ల రూపాయల నుంచి 50వేల కోట్ల రూపాయల లాభాలు సంపాదిస్తే.. కేవలం 2015-16 నుంచి 2019-20 వరకు అంటే నాలుగేళ్లలోనే ఇవే బ్యాంకులు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశాయి. ఇది ఎన్పీఏ కారణంగా ఏర్పడిన నష్టమే. 2022 డిసెంబర్ 13న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక సమాధానం ఇస్తూ.. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకుల ఎన్పీఏలు 2014 మార్చి 31 నుంచి 2018 మార్చి వరకు 2.51 లక్షల కోట్ల రూపాయల నుంచి 9.63 లక్షల కోట్ల రూపాయలకు పెరిగాయని చెప్పారు.
అంటే నాలుగేళ్ల కాలంలో ఏకంగా నాలుగు రెట్లు పెరిగాయన్న మాట. ‘ఆర్థిక మేధావి, ఆర్బీఐ మాజీ గవర్నర్ మన్మోహన్ ప్రధానిగా ఉన్న కాలంలో 1.93 లక్షల కోట్ల ఎన్పీఏలను రద్దు చేస్తే.. అంతకు మించిన మేధావిగా కీర్తనలందుకుంటున్న మోదీ హయాంలో 2015-2020 మధ్యాకాలంలో అంతకు ఐదింతల మొత్తంలో ఎన్పీఏలు రద్దు చేశారు. వెరసి ఎన్పీఏ ప్రొవిజనింగ్ అనేది 10 లక్షల కోట్లు దాటిపోయింది.
గత మన్మోహన్సింగ్ హయాంలో ఇచ్చిన రుణాలు కొన్ని మోదీ హయాంలో ఎన్పీఏలుగా మారినా.. 9 ఏళ్ల మోదీ పాలనలోనే సింహభాగం నష్టాలు వచ్చాయి’ అని బ్యాంకు ఎంప్లాయీస్ సంఘ నాయకుడొకరు తెలిపారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ఇలా రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన పెద్దల్లో నీరవ్మోదీ, మెహుల్ చోక్సీ వంటివారికి బీజేపీతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు కోకొల్లలు.
కార్పొరేట్ అనుకూల మోదీ
మోదీ కార్పొరేట్ శక్తులకు అనుకూలమని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉంటాయి. ‘కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు గమనిస్తే దీనిలో నిజం లేకపోలేదని అర్థం అవుతుంది. మన్మోహన్ రెండో దఫా ప్రభుత్వంలో కార్పొరేట్ పన్నులు జీడీపీలో 3.34 శాతం ఉంటే.. మోదీ రెండో దఫా పాలనా కాలం నాటికి అవి 2.3 శాతానికి పడిపోయాయి. పైపెచ్చు.. సాధారణ ప్రజలపై జీఎస్టీ, కేంద్ర పన్నులు, సుకాలు, వ్యక్తిగత ఆదాయం పన్ను వంటివి తడిసిమోపెడవుతున్నాయి’ అని ఒక రాజకీయ విశ్లేషకుడు చెప్పారు.
ఎంత పోయింది?
ఆర్థిక మంత్రి వివిధ సందర్భాల్లో ఇచ్చిన సమాధానాల ప్రకారం.. అన్ని షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాకులు, విదేశీ, ప్రైవేటు బ్యాంకుల అన్నీ కలిపి.. 2014-15 నుంచి 2021-20 వరకూ ఎన్పీఏలు 66.5 లక్షల కోట్లుగా తేలుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘2022 డిసెంబర్ 18న ఆర్థిక మంత్రి ఇచ్చిన సమాధానం ప్రకారం గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల రూపాయల పైనే ఎన్పీఏలు రద్దు చేశారు.
అంటే.. ఈ ఐదేళ్లలో మొత్తం ఎన్పీఏలు 48 లక్షల కోట్లపైనే ఉంటే.. అందులో ఎన్పీఏ నిష్పత్తి ప్రకారం 22.34 శాతం రద్దయిపోయాయి. మొత్తంగా తొమ్మిదేళ్ల మోదీ హయాంలో ఎన్పీఏలు 66.5 లక్షల కోట్లు ఉంటే.. అందులో 14.5 లక్షల కోట్లు మాఫీ అయిపోయాయి. మొండి బకాయిలు రద్దు చేసిన తర్వాత కూడా వసూళ్ల కిందో, ఆస్తుల వేలం కిందో కొంత రాబడుతారు. ఆ విధంగా సుమారు పది లక్షల కోట్ల రూపాయలు (13%) రాబట్టారు.
అంటే.. దాదాపు 8.8 లక్షల కోట్లు వసూలు కాకుండానే మాయమైపోయాయి. పోనీ తర్వాతి కాలంలో అది 13 శాతం నుంచి 20 శాతం వసూలు చేశారని అనుకున్నా.. దేశం కోల్పోయింది దాదాపు 12 లక్షల కోట్లు’ అని ఆయన తెలిపారు. నిజానికి ఈ సొమ్మంతా సాధారణ ప్రజలు, చిన్న మదుపుదారులు తమ కష్టంతో బ్యాంకుల్లో పోగేసుకున్న మొత్తమే.