బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అధికారం కోల్పోయి.. లోక్సభ ఎన్నికల్లో సున్నా సీట్లకు దిగజారిపోయి.. వరుసగా సాగుతున్న ఎమ్మెల్యేల వలసలతో ఆగమాగమవుతున్న క్రమంలో పార్టీ నేతలతో ఫామ్ హౌస్ వరుస భేటీలు.. చెబుతున్న మాటలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్గాలలో విశ్వాస పరీక్షకు నిలబడ్డాయి
మారని అధినేత తీరు..
జనం నాడీ పట్టని సారూ
వలసల కట్టడికి గారడి మాటల సామూ
ఫామ్హౌస్ భేటీల్లో కేసీఆర్ తీరుపై రాజకీయ రచ్చ
తీరుమారని సారుతో భవిష్యత్పై బెంగ
ఫలించని వలసల కట్టడి
విధాత, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అధికారం కోల్పోయి.. లోక్సభ ఎన్నికల్లో సున్నా సీట్లకు దిగజారిపోయి.. వరుసగా సాగుతున్న ఎమ్మెల్యేల వలసలతో ఆగమాగమవుతున్న క్రమంలో పార్టీ నేతలతో ఫామ్ హౌస్ వరుస భేటీలు.. చెబుతున్న మాటలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్గాలలో విశ్వాస పరీక్షకు నిలబడ్డాయి. ఉద్యమకాలంలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష స్వరాష్ట్ర సాధన ఉద్యమ సారధిగా కేసీఆర్ చెప్పిన మాటలకు తలాడించి వెంట నడిచి, రెండు పర్యాయాలు అధికార పీఠాన్ని అప్పగించిన తెలంగాణ సమాజమే పదేళ్ల ఆయన పాలనా వైఫల్యాల పట్ల విసుగెత్తి గద్దె దించారు.
పదేళ్ల పాలనలో సాగిన లోటుపాట్లపై ఏనాడు ఆత్మవిమర్శకు.. భేషరం సమీక్షకు ఆసక్తి చూపని కేసీఆర్, ఆయన పరివార్ కేటీఆర్, హరీశ్రావు సహా అంతా ప్రజాతీర్పునే తప్పుబడుతూ పదేపదే అసంబద్ధ వ్యాఖ్యలు కొనసాగిస్తునే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం నిర్వహించిన అసెంబ్లీ నియోజకవర్గాల వారి సమీక్షా సమావేశాలు.. అనంతరం లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశాల్లోనూ.. బస్సు యాత్ర ప్రచార సభల్లోనూ పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతును తెచ్చుకున్నారంటూ వారు ప్రజాతీర్పుపై తమ అక్కసును వెళ్లగక్కారు.
ఏ గాలి మాయలోపడి జనం కాంగ్రెస్కు ఓట్లేశారని.. ప్రజల గుండెలను చీల్చితే కేసీఆర్ కనిపిస్తారని సోత్కర్ష చెప్పుకున్నారు. జనం కేసీఆర్ మాటలను విశ్వసించకుండా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను సున్నాకు దిగజార్చారు. అయినా సత్యం గ్రహించలేనట్లుగా ఇప్పుడు ఫామ్హౌస్ వేదికగా సాగుతున్న ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల.. జిల్లాల వారిగా పార్టీ నాయకులతో నిర్వహిస్తున్న భేటీలు.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశాల్లోనూ కేసీఆర్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలను ప్రజాస్వామిక స్ఫూర్తితో స్వీకరించకుండా తన వైఖరిని మార్చుకోకుండా ప్రజాతీర్పును తప్పుబడుతూ ఆత్మస్తుతి.. జన నిందకు దిగడం పట్ల రాజకీయ నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
సారూ మారరా..
ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నాలుక కరుచుకుంటున్నారని, మళ్లీ జనమే టార్చ్ పట్టుకుని దేవులాడుకుంటూ మరీ బీఆర్ఎస్ కోసం వస్తారని, తెలంగాణ సమాజం తిరిగి బీఆర్ఎస్ పాలనను కోరుకుంటుందని కేసీఆర్ ఫామ్హౌస్ భేటీల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పాలన సాగిస్తుందని, ఆ పార్టీని ప్రజలు ఛీకొడుతున్నారని, గతంలో సమైక్యవాద పాలకులను, చంద్రబాబు వంటి నేతను ఎదురించి పోరాడామంటూ వ్యాఖ్యానించారు. నిజమే నాడు తెలంగాణ సమాజం స్వరాష్ట్ర ఆకాంక్ష సాధనకు ఉద్యమ సారధిగా ఉన్న కేసీఆర్ వెనుక నడిచి సమైక్యవాద పాలకులను, చంద్రబాబును ఎదురించే పోరాటాల్లో సైన్యంగా కలబడింది.
ఇప్పుడు కేసీఆర్ వెంట నడిచి ఎవరి మీద కలబడాలో తెలంగాణ సమాజానికి స్పష్టత లేకపోలేదు. కేసీఆర్కు ప్రత్యామ్నాయంగా తాము ఎన్నుకున్న కాంగ్రెస్ సర్కార్ తమ ఆకాంక్షల మేరకు పనిచేయకపోతే ప్రజాస్వామిక పద్దతిలో పాలనా మార్పు చేసుకునే వెసులుబాటు వారికే ఉండనే ఉంది. అంతేగాని ఇప్పటికిప్పుడు కేసీఆర్ ఆకాంక్షల సాధనలో పావులుగా మారి ఉద్యమించాల్సిన అత్యవసరం వారికి ఉందనుకోరు. ఇకపోతే కేసీఆర్ చెప్పినట్లుగా ప్రస్తుత కాంగ్రెస్పై ప్రజా వ్యతిరేకత ఉంటే అది లోక్సభ ఎన్నికల్లో ప్రస్ఫూటమైతే బీఆర్ఎస్కు నాలుగైదు ఎంపీ సీట్లు లేకపోతే మెజార్టీ ఎంపీ స్థానాల్లో రెండో స్థానంలో నిలువాల్సి ఉండేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కేవలం ఎమ్మెల్యేల వలసల కట్టడికి, సమీపిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ప్రస్తుత పదవీ కాలం ముగిసిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చేజారిపోకుండా ఉండేందుకు భవిష్యత్తుపై వారికి భరోసానిచ్చేందుకు కేసీఆర్ ఫామ్హౌస్ భేటీల్లో గారడి మాటలు చెబుతున్నారే తప్ప ఆత్మవిమర్శతో కూడిన మాటలు కావంటున్నారు. తన ఫామ్హౌస్లో పార్టీ నేతలతో వరుస భేటీలలో కేసీఆర్ చెబుతున్న మాటలు జనం నాడీ అనుసరించి చెబుతున్నట్లుగా లేవని, కేవలం ఫామ్హౌస్లో నాలుగు గోడల మధ్య ఉంటూ కలలు.. ఆశల ప్రాతిపదికనే ఉన్నాయని.. వాస్తవిక పునాదుల ప్రామాణికంగా లేవంటున్నారు సొంత పార్టీ శ్రేణులు.
నాడు దర్శనం దుర్లభం.. నేడు సులభం
ఫామ్హౌస్ వరుస భేటీలతో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా చివరకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కూడా భోజనాలు చేస్తూ ఫోటోలు దిగుతున్న కేసీఆర్ తాను మారినట్లుగా, కేడర్కు చేరువైతున్నట్లుగా వ్యవహారిస్తున్నారు. అయితే పదేళ్లు అధికారం వెలగబెట్టి తన చుట్టూ ప్రజాస్వామిక గాలి వీచనంత పక్కాగా నిర్మించుకున్న గడీ తరహా ప్రగతి భవన్లోకి నెలల తరబడిగా రానివ్వకుండా సొంత పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రివర్గ సహచరులకు సైతం కేసీఆర్ సారూ దర్శనం లభించని దుర్లభ సందర్భాలను, చేదు అనుభవాలను, అవమానాలను పార్టీ ప్రజాప్రతినిధులు విస్మరించలేకపోతున్నారు. నాడు ప్రగతి భవన్.. నేడు ఫౌమ్ హౌస్ రంగ స్థలంపై కేసీఆర్ చూపించిన దృశ్యాలు ఆయనలోని అవకాశవాద రాజకీయానికి నిదర్శమేనంటూ గుసగుసలు పోతున్నారు.
నెలల తరబడిగా జైలులో ఉన్న సొంత కూతురినే రాజకీయ విమర్శలకు జడిసి పరామర్శకు సైతం దూరంగా ఉంటున్న తమ అధినేత వ్యక్తిత్వాన్ని ఏమని అర్ధం చేసుకోవాలంటూ అంతర్మథనం చెందుతున్నారు. రాజకీయ జీవితంలో ప్రజలు ఎటువంటి బాధ్యతను అప్పగించినా నిర్వర్తించడమే నాయకుల లక్షణమని, అధికారముంటేనే పనిచేస్తామంటే గుడెద్దు చేనుల పడ్డ చందంగా ఉంటదని మాజీ స్థానిక ప్రజాప్రతినిధులకు ఉద్బోధ చేసిన కేసీఆర్ తను ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి హాజరుకాకపోవడం.. రాజ్యంగబద్ధ జ్యుడీషియల్ కమిషన్ల ముందు హాజరుకాకుండా కోర్టుకెళ్లి భంగపడిన తీరు ఆదర్శనీయంగా లేదన్న సోయి విస్మరించడం విడ్డూరమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
వలసల పోటు.. కేసుల వేట
వరుసగా సాగుతున్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వలసల పర్వం ఒకవైపు..పదేళ్ల పాలనలో జరిగిన అవకతవకలపై విచారణ కమిషన్లు, కేసులు.. కూతురు లిక్కర్ స్కామ్ కేసు మరోవైపు కేసీఆర్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గతంలో కేసీఆర్ పార్టీ ఫిరాయింపులకు తెరలేపి టీడీఎల్పీనీ, సీఎల్పీని విలీనం చేసుకున్నట్లుగానే ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి సైతం నీవు నేర్పిన విద్యయే అన్న చందంగా కేసీఆర్ బాటలోనే సాగుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హస్తం గూటికి చేర్చుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ వీడి కాంగ్రెస్లో చేరిపోయారు. మరో 20మంది చేరుతారన్న ప్రచారం బలంగా వినిపిస్తుంది. ఫామ్హౌస్ సమావేశాలకు వచ్చి కేసీఆర్తో మాటమంతి చేసిన ఎమ్మెల్యేలు సైతం త్వరలో పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి.
గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు దిగేందుకు సిద్ధమయ్యారు. పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై అనర్హత వేటువేయాలంటున్న కేసీఆర్కు తాను గతంలో సాగించిన ఫిరాయింపులను సమర్ధించుకున్న వైనాన్ని గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ నేడు తన పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై పెడబొబ్బలు పెడుతున్న తీరుపై నెట్టింట సైతం సెటైర్లు సాగుతున్నాయి. వలసల కట్టడికి కేసీఆర్ అనుసరిస్తున్న వ్యూహాలు ఫలించకపోవడంతో ఆయనలోని అసహనం పెరిగిపోతుంది. వలస ఎమ్మెల్యేనుద్దేశించి దొంగల్లో కలిసిపోయే వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, వారుపోతే పార్టీలో ఉన్నవారి నుంచే మెరికల్లాంటి నాయకులను తయారు చేస్తామంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. అదే కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాటి సిటింగ్ ఎమ్మెల్యేల్లో మెజార్టీ సిటింగ్లపై ప్రజల నుంచి, కేడర్ నుంచి వ్యతిరేకత ఉందని ఎందరూ చెప్పినా వారికే తిరిగి ఎందుకు టికెట్ ఇచ్చారో ఆయనకే తెలియాలంటున్నారు ఆనాటి ఆశావహులు.
కేసులపై కప్పదాట్లతో కేడర్లో సందేహాలు
కేసీఆర్ పాలనలో మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుతో వెలుగులోకి వచ్చిన కాళేశ్వరం స్కామ్, గొర్రెల స్కామ్, విద్యుత్తు కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణాల్లో అవకతవకలు, ఫార్మూలా రేస్ స్కామ్, ధరణి అక్రమాలు, భూదందాలు అన్నింటికి మించి ఫోన్ ట్యాపింగ్ కేసు, కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ కేసు కేసీఆర్ ముందరికాళ్లకు బంధంగా మారాయి. లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కుంగుబాటుతో మేడిపండు చందంగా మారిపోగా కేసీఆర్ విశ్వసనీయతను పాతాళానికి పడేసింది. తెచ్చిన అప్పులు.. నిధుల సమీకరణ పేరుతో నిర్వహించిన భూదందాలు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాయి. ఎన్నికల ముందు తెచ్చిన దళితబంధు, బీసీ, మైనార్టీ బంధు పథకాలు. ధరణి, టీజీపీఎస్పీ పేపర్ల లీకేజీలతో బీఆర్ఎస్కు రాజకీయంగా భారీ నష్టమే ఎదురైంది.
విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్ పవర్ ఫ్లాంట్లపై అసెంబ్లీ చర్చలో విచారణ కమిషన్లు వేసుకోవాలని సవాల్ విసిరిన బీఆర్ఎస్ పార్టీ.. తీరా నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్, జగదీశ్రెడ్డిలకు నోటీస్లివ్వగానే నాలుక మడతేయ్యడం సైతం కేసీఆర్కు శీల పరీక్ష పెడుతుంది. తన వాదనలో నిజాయితీ ఉంటే జ్యుడిషియల్ కమిషన్ ముందు హాజరై చెప్పాల్సింది చెప్పకుండా.. కోర్టుకెళ్లి కమిషన్ రద్దు చేయాలని కేసీఆర్ కోరడం.. ఆయన పిటిషన్ను కోర్టు కొట్టివేసిన పరిణామాలు సొంత పార్టీ కేడర్లోనే కేసీఆర్ విశ్వసనీయతపై సందేహాలు రేకెత్తించింది.
తెలివైన నాయకుడినంటూనే పవర్ కమిషన్ విచారణపైన, కాళేశ్వరంపైన, ఫోన్ ట్యాపింగ్పైన కేసీఆర్ కప్పదాట్లు వేయడాన్నిచూసిన పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ భవిష్యత్తుపై సందేహాపడుతూ వలసబాట పడుతున్నారంటున్నారు విశ్లేషకులు. ఏతావాత కేసీఆర్ పదేళ్ల పాలనా వైఫల్యాలు…ఆయన అనుసరించిన నాయకత్వ విధానాల కర్మ ఫలితమే ఎన్నికల్లో ఘోర ఓటములు.. కేసులు, పార్టీ ఎమ్మెల్యేలు నాయకుల వలసల రూపంలో ఆయనను వెంటాడుతున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారడంతో తెలంగాణ సెంటిమెంట్ మాటలు పనిచేయకపోతుండగా, జాతీయ పార్టీ భ్రమలు వరుస ఓటములతో తొలగిపోయాయి.
దూకుడులో దుందుడుకే
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పదేళ్లు సీఎంగా పనిచేసిన అనుభవంతో ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన స్థితిలో అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండటం.. ప్రభుత్వంపై వంద రోజుల్లోపే విమర్శల దాడికి దిగడం ద్వారా కేసీఆర్ తన గౌరవాన్ని, హుందాతనాన్ని తానే తగ్గించుకున్నారన్న విమర్శలు లేకపోలేదు. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లుగా కేసీఆర్ బాటలోనే కేటీఆర్, హరీశ్రావు సహా ఆ పార్టీ నాయకులు వందరోజుల్లోపే కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజకీయ విమర్శలతో పాటు కూలిపోతుందంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు.
స్వరాష్ట్రంలో కేసీఆర్ తొలినాళ్ల ప్రభుత్వంపై ఆనాటి కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తే నెలల పసికందులాంటి ప్రభుత్వాన్ని ఎట్లా విమర్శస్తారంటూ ఎదురుదాడికి దిగారు. కాని ఇప్పుడు వారు ప్రతిపక్షంగా అదే పని చేశారు. చివరకు ఆరు నెలల పాలన పూర్తి చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై 2 లక్షల రుణమాఫీ సహా ఎన్నికల హామీలన్ని అమలు చేయడం లేదంటూ దూకుడు విమర్శలతో దుందుడుకు విధానాలే అనుసరిస్తున్నారు.
లక్ష రుణమాఫీకి ఐదేళ్లు తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ రెండు లక్షల రుణమాఫీని ఇప్పటికిప్పుడు మాఫీ చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సవాల్ చేయడం విడ్డూరమే. ప్రతిపక్షంగా తమ అభిప్రాయాలను తీసుకోవడం లేదని, గొంతు నొక్కుతున్నారని, అణిచివేస్తున్నారంటున్న బీఆర్ఎస్ మాటల్లో నిజమున్నా వారి పదేళ్ల ఏలికలో ధర్నాచౌక్ ఎత్తివేసి, అసెంబ్లీ రద్దు సమయంలో, సచివాలయం నిర్మాణం, జిల్లాల పునర్విభజన వంటి కీలక అంశాల్లోనూ ప్రతిపక్షాల అభిప్రాయాలను పట్టించుకోకపోగా, అసలు ప్రతిపక్షాలనే లేకుండా చేసే ఫిరాయింపులకు పాల్పడిన వైనం గుర్తుకు రాకమానదు.
ఇక నిరుద్యోగులకు సహా వివిధ వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు వైఫల్యాలపై బీఆర్ఎస్ ఇప్పటిదాకా చేసిన ప్రత్యక్ష ప్రజా ఉద్యమాలేవి లేకపోగా ట్విటర్ పిట్ట వేదికగా పిట్ట కథలను తలపించే ట్విట్ల పంచాయతీపైనే ఎక్కువగా ఆధారపడుతున్న వైనం కేడర్కు, పార్టీకి భవిష్యత్తుపై భరోసానిచ్చేదిగా లేదంటున్నారు విశ్లేషకులు.