బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు మంత్రి ఎర్రబెల్లి సవాల్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: TSPSC లీక్ లపై బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు గాలికి మాట్లాడి, బట్టకాల్చి మీద వేయడం కాదు దమ్ముంటే ఆరోపణలు నిరూపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సవాల్ విసిరారు. హనుమకొండ జిల్లా ఐనవోలులో శుక్రవారం జరిగిన డీసీసీబీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గుజరాత్ లో పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్లు శిక్ష విధిస్తే ఒక […]
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: TSPSC లీక్ లపై బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు గాలికి మాట్లాడి, బట్టకాల్చి మీద వేయడం కాదు దమ్ముంటే ఆరోపణలు నిరూపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సవాల్ విసిరారు. హనుమకొండ జిల్లా ఐనవోలులో శుక్రవారం జరిగిన డీసీసీబీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
గుజరాత్ లో పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్లు శిక్ష విధిస్తే ఒక రకంగా.. పేపర్ లీకేజీ పై మరోరకమైన నీతి ఉంటుందా? అంటూ ప్రశ్నించారు. ఆరోపణలు చేయడం కాదు దమ్ముంటే నిరూపించాలన్నారు. కేటీఆర్, ఆయన టీమ్ రాష్ట్ర అభివృద్ధికి రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్నారని సంజయ్, రేవంత్ నోటికి వచ్చినట్లు మాట్లాడి, పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారని సరైన సమయంలో ప్రతిపక్షాలకు సరైన బుద్ది చెప్తారన్నారు. TSPSC లీక్ కేసులో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుందని, ఎవరు దొంగలో ఎవరు దొరలో దర్యాప్తులో తేలుతుందని మంత్రి అన్నారు. సీఎం కెసిఆర్ పర్యటనను తక్కువ సమయంలో ఏర్పాట్లు చేసి విజయవంతం చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులకు, ప్రజా ప్రతినిధులకు పేరు పేరున ధన్యవాదాలు చెప్పారు.
దేశంలో ఇప్పటివరకు ఎక్కడ కూడా నష్టపరిహారం 3,000 రూపాయలు కన్నా ఎక్కువ ఇవ్వలేదని మంత్రి అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.5వేలు మాత్రమే ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా 10,000 ఇచ్చిందన్నారు. నల్ల చట్టాలను రద్దు చేయమని కోరిన రైతులను కాల్చి చంపిన దిక్కుమాలిన ప్రభుత్వం బిజెపిదని ఫైరయ్యారు. 700 మంది రైతులను పొట్టన పెట్టుకున్న సర్కార్ అన్నారు. దేశంలో ప్రజలంతా కేసిఆర్ కోసమే ఎదురుచూస్తున్నారని అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అంటూ నినదిస్తున్నారని అన్నారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు తగిన గుణపాఠం ప్రజలు చెబుతారని మంత్రి ఎర్రబెల్లి జోస్యం చెప్పారు.