ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు బృందం గురువారం మరో ఇద్దరు పోలీసు అధికారులను అరెస్టు చేసి విచారిస్తుంది. మాజీ డీసీపీ రాధాకిషన్రావు, ఇన్స్పెక్టర్ గట్టు మల్లులను అదుపులోకి తీసుకున్న దర్యాప్తు బృందం
ఏఎస్పీలకు ఐదు రోజుల కస్టడీ
విధాత : ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు బృందం గురువారం మరో ఇద్దరు పోలీసు అధికారులను అరెస్టు చేసి విచారిస్తుంది. మాజీ డీసీపీ రాధాకిషన్రావు, ఇన్స్పెక్టర్ గట్టు మల్లులను అదుపులోకి తీసుకున్న దర్యాప్తు బృందం మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్రావుతో వారికున్న సంబంధాలపై ప్రశ్నిస్తున్నారు. వారిని బంజారాహీల్స్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. వారు ఎవరి ఆదేశాల మేరకు, ఎవరెవరు ఫోన్లు ట్యాపింగ్ చేశారు..వారికి ట్యాపింగ్తో ఉన్న ప్రమేయం ఏమిటన్నదానిపై ప్రశ్నిస్తున్నారు. వ్యాపార వేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేయడంలో రాధాకిషన్రావు, గట్టు మల్లులు కీలక పాత్ర వహించినట్లుగా విచారణలో పోలీసులు గుర్తించారు. ట్యాపింగ్ కేసు నమోదుకాగానే రాధాకిషన్ అమెరికా వెళ్లిపోయారు. అయితే పోలీసులు లుక్ అవుట్ నోటీస్ జారీ చేయడంతో ఆయన తిరిగి వచ్చారు.
ఇద్దరు ఏఎస్పీలకు ఐదు రోజుల కస్టడీ
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు కోర్టు ఐదు రోజుల కస్టడీ విధించింది. రేపటి నుంచి ఐదు రోజులపాటు విచారించేందుకు కోర్టు పోలీసులకు అనుమతించింది. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్రావు ను సైతం మరో ఐదు రోజుల కస్టడీ కోరగా, కోర్టు అతడి కస్టడీ పిటిషన్ను కొట్టివేసింది. ప్రస్తుతం ఆ ముగ్గురు నిందితులు చంచల్గూడ జైలులోనే ఉన్నారు. ప్రణీత్రావు టీమ్ ఆధ్వర్యంలో జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రంలో సంచలనంగా మారింది. తొలుత ప్రణీత్రావు విచారణతో సంచలన విషయాలు వెలుగుచూసిన ఈ కేసులో భుజంగరావు, తిరుపతన్నల కస్టడీ విచారణతో మరిన్ని కొత్త విషయాలు వెలుగుచూస్తాయని భావిస్తున్నారు. గత బీఆరెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రభుత్వ రాజకీయ అవసరాల మేరకు ప్రతిపక్ష నాయకుల ఫోన్ల ట్యాపింగ్తో మొదలైన అక్రమ ట్యాపింగ్ వ్యవహారం కాస్తా అడ్డదారులు తొక్కి రియల్టర్లు, వ్యాపారులు, జర్నలిస్టుల, సెలబ్రేటీల ఫోన్లను కూడా ట్యాప్ చేసి బ్లాక్ మెయిల్ దందాలకు పాల్పడి వందల కోట్లు వసూలు చేసినట్లుగా విచారణలో గుర్తించడంతో దీనిపై మరింత లోతుగా దర్యాప్తు బృందం విచారణ కొనసాగిస్తుంది.