విధాత : టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. మూడు కేసుల్లో ఒకేసారి ఏపీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి. మల్లికార్జునరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్), ఇసుక, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది. వీటిపై ముందస్తు బెయిల్ కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో ఆయన మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.
ఇప్పటికే వాదనలు ముగిసిన నేపథ్యంలో హైకోర్టు నేడు తన నిర్ణయాన్ని ప్రకటించింది. మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ శ్రీనరేశ్ కూ ముందస్తు బెయిల్ మంజూరైంది. చంద్రబాబుకు బెయిల్ మంజూరీ చేసిన న్యాయమూర్తి ఆయన ఈ కేసుల దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించారు. వారంలోపు రూ.లక్ష చొప్పున ఇద్దరు పూచీకత్తు ఇవ్వాలని తెలిపారు. పిటీషనర్లకు 48 గంటల ముందు నోటీసు ఇచ్చాకే విచారించాలని సీఐడీని ఆదేశించారు.