మీ చేతగానితనానికి ఉమ్మడి రాజధాని అడుగుతారా

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను మరో రెండేళ్లు కొనసాగించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు

మీ చేతగానితనానికి ఉమ్మడి రాజధాని అడుగుతారా
  • వైసీపీ నేతలపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్‌.షర్మిల ఫైర్‌


విధాత : ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను మరో రెండేళ్లు కొనసాగించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారంటే.. ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమినట్లా..? మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా అని ఫైర్ అయ్యారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ 10ఏండ్ల తర్వాతా కూడా ఆంధ్రుల రాజధాని ఎక్కడా అని అడిగితే హైదరాబాద్ వైపు చూపించే దయనీయ పరిస్థితి ఉందన్నారు. వైసీపీకి రాజధానిపై, రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఆరోపించారు.


పూటకో మాట, రోజుకో వేషం వేసే వైసీపీ నేతలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే కుట్రలో భాగమే ఉమ్మడి రాజధాని అంశమని విమర్శించారు. ఓటమి ఖాయమని తెలిసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అమరావతి పేరుతో చూపించింది 3డీ గ్రాఫిక్స్ అయితే.. మూడు రాజధానుల పేరుతో జగనన్న ఆడింది మూడు ముక్కలాట అంటూ ఎద్దేవా చేశారు. ఐదేళ్లు అధికారమిస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు కాలేదన్నారు.


రాష్ట్రానికి రాజధాని లేదని, ప్రత్యేక హోదా రాలేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీలు లేవని.. పోలవరం పూర్తి కాలేదన్నారు. కనీసం జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టులకు దిక్కులేదేలని ఆరోపించారు. కొత్త పరిశ్రమలు లేవని.. ఉన్నవి ఉంటాయో లేదో తెలియదంటూ విమర్శలు గుప్పించారు. రూ. 8లక్షల కోట్ల అప్పులు చేసి ఏపీని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా చేశారే తప్పా.. అభివృద్ధి చేయలేదంటూ ఆరోపించారు. మోదీకి మోకరిల్లి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారే కానీ,, విభజన హామీలపై ఏనాడూ నోరు విప్పలేదన్నారు.