అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు.. బాబు వెళ్లి అడ్డుకుంటారా.. విధాత: ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టిడిపిలు ఒకరిమీద ఒకరు జోరుగా విమర్శలు చేసుకుంటున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా జనంలోకి రాలేదు కానీ ఆయన స్కెచ్చులు ఆయనకు ఉన్నాయి అంటున్నారు. అయితే ఇదే తరుణంలో త్వరలో మార్చ్ 14 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో చంద్రబాబు అధికార పక్షాన్ని, ప్రభుత్వాన్ని కడిగి పారేస్తారా? తమ నాయకుల మీద […]
విధాత: ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టిడిపిలు ఒకరిమీద ఒకరు జోరుగా విమర్శలు చేసుకుంటున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా జనంలోకి రాలేదు కానీ ఆయన స్కెచ్చులు ఆయనకు ఉన్నాయి అంటున్నారు. అయితే ఇదే తరుణంలో త్వరలో మార్చ్ 14 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.
ఈ సమావేశాల్లో చంద్రబాబు అధికార పక్షాన్ని, ప్రభుత్వాన్ని కడిగి పారేస్తారా? తమ నాయకుల మీద జరుగుతున్న రాజకీయ, పోలీస్ దాడులను ఆయన సభలో ప్రస్తావించి ప్రభుత్వ దుర్నీతిని ఎండగడతారా? అసలు ఆయన సభకు వస్తారా? గత ఏడాది ప్రతినబూనిన మేరకు బడ్జట్ సమావేశంలో ఎగ్గొడతారా అన్న సందేహాలు వస్తున్నాయి.
గత ఏడాది జరిగిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఆవేశంగా మాట్లాడుతూ సభకు ఒక నమస్కారం. ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అంటూ మరీ బయటకు వచ్చేశారు. మొన్న జరిగిన శీతాకాల సమావేశాలకూ ఆయన రాలేదు.
బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారా!!
పోనీ ఈసారి జరిగే బడ్జట్ సమావేశాలకు అయినా వస్తారా..? అనే సందేహాలు ఉన్నాయి.. ఈసారి జరిగే సమావేశాలు కీలకమైనవి, బడ్జట్ కేటాయింపులు.. నిధులు.. ప్రాజెక్టులు వంటివాటి మీద చర్చ ఉంటుంది. ఇంకా కొత్తగా వచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతారు.
ఇలాంటి తరుణంలో సభలో బాబు వంటి సీనియర్ నేతలు ఉంటేనే మంచిది అని అంటున్నారు . ఇదే సమావేశాల్లో జగన్ సర్కారు మూడు రాజధానుల బిల్లుని ప్రభుత్వం ప్రవేశపెడుతుంది అని అంటున్నారు. అదే జరిగితే సభలో చంద్రబాబు కచ్చితంగా ఉండాల్సిందే.
అసెంబ్లీకి వెళ్లాల్సిందే అంటున్న రైతులు..
అమరావతి ఆయన కలల రాజధాని అలాంటి రాజధానిని మూడుగా విభజిస్తూ వైసీపీ ప్రభుత్వం తాను చేయాల్సింది చేస్తూ ఉంటే చంద్రబాబు కచ్చితంగా అసెంబ్లీలో ఉండి అడ్డుకోవాల్సిన అవసరం ఉందని అంతా అంటున్నారు. ముఖ్యంగా అమరావతి రైతులు బాబు అసెంబ్లీకి వెళ్లాల్సిందే అని అంటున్నారు.
అమరావతి ప్రాముఖ్యాన్ని సభ ద్వారా ప్రజలకు వివరిస్తే ఆయన వాయిస్ ప్రజల్లోకి వెళ్తుందంటున్నారు. బయట మీడియా ముందు మాట్లాడే దానికి, చట్ట సభలో మాట్లాడడానికి తేడా ఉంటుందని, ఆ గౌరవం వేరని అంటున్నారు. ఈ విషయం ఆయనకు తెలిసిందే కానీ తమ పంతం వీడి సభకు వస్తారా? ముఖం చాటేస్తారా అన్నది సందేహంగా ఉంది.