తెలంగాణలో మా ప్రత్యర్ధి కాంగ్రెస్: బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రంలో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, బీఆరెస్ మూడో స్థానానికే పరిమితమవుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

- బీఆరెస్ బీజేపీల పొత్తుపై కేసీఆర్ అసత్య ప్రచారం
విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, బీఆరెస్ మూడో స్థానానికే పరిమితమవుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాండూర్లో బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీని కాపాడుకునే ఎత్తుగడల్లో భాగంగానే కేసీఆర్ కొత్తగా బీఆరెస్తో బీజేపీ పొత్తు అంటూ అసత్య ప్రచారం సాగిస్తున్నారన్నారు. ఢిల్లీ పర్యటన అంటూ హడావుడి చేస్తున్నారని, ఢిల్లీలో కేసీఆర్ను పట్టించుకునే రాజకీయ పార్టీలు లేవన్నారు.
బీఆరెస్ పార్టీలో ఉన్న నేతలే పక్క పార్టీల వైపు చూస్తున్నారన్నారు. పలువురు బీఆరెస్ ఎమ్మల్యేలు, సిటింగ్ ఎంపీలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీ కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు. తెలంగాణలో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 15స్థానాలు గెలవబోతుందన్నారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాబోతుందని, తెలంగాణ ప్రజలు కూడా ఎంపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం ద్వారా అభివృద్ధికి అవకాశం కల్పించాలన్నారు.