1951-1952 మొదటి 'ఒక దేశం ఒకే ఎన్నిక' విధానాన్ని ఆచరణలో అమలు చేయాలని ప్రధాని మోదీ ఎందుకు
నిలదీసే శక్తులకు అసలే చోటివ్వొద్దు
మోదీ సర్కార్ నియంత పోకడలు
ఆరెస్సెస్ అజెండా అమలుకు యత్నం
ఆ దిశగానే విపక్ష నేతలపై అరాచకాలు!
అప్పుడెప్పుడో 1990లో ఆంధ్రాకింగ్ చిరంజీవి హీరోగా, బాంబే క్వీన్ శ్రీదేవి హీరోయిన్గా వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా కథ గుర్తుందా? ఆ సినిమాలో అమ్రిష్పురి మహాద్రష్ట అనే మాంత్రికుడి పాత్ర పోషించారు! ఆ మాంత్రికుడి లక్ష్యం.. ‘నిత్య యవ్వనం.. త్రిలోకాధిపత్యం’. అందుకోసం ఒక దేవ కన్య సహా ఐదుగురు ఉత్తమజాతి కన్యలను అగ్నికి ఆహుతి చేసేందుకు సిద్ధపడతాడు. అందుకోసం కన్నడ ప్రభాకర్, రామిరెడ్డి, తనికెళ్ల భరణి వంటి వారు పోషించిన పాత్రలు సహకరించేందుకు పనిచేస్తాయి. కానీ.. ఆ ప్రయత్నాలు సత్తా ఉన్న రాజు అనే యువకుడి ముందు విఫలమవుతాయి! ఇదే సినిమా కథను ఇప్పుడు వర్తమాన రాజకీయాలకు వర్తింపజేయొచ్చని అంటున్నారు విశ్లేషకులు! సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగేందుకు, తన పార్టీ తప్ప రాజకీయ యవనికపై మరో పార్టీ లేకుండా చేసేందుకు.. అందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ, ఐటీ వంటివాటిని యథేచ్ఛగా వాడుకునేందుకు చేసిన, చేస్తున్న ప్రయత్నాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయని చెబుతున్నారు.
న్యూఢిల్లీ : 1951-1952 మొదటి ‘ఒక దేశం ఒకే ఎన్నిక’ విధానాన్ని ఆచరణలో అమలు చేయాలని ప్రధాని మోదీ ఎందుకు ఉబలాటపడుతున్నారు? మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో ఒకే దేశం.. ఒకే ఎన్నికపై అధ్యయనం చేయించి, సిఫార్సులు స్వీకరించడం వెనుక అసలు ఉద్దేశాలేంటి? వాటికి.. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి, ప్రతిపక్ష పార్టీల నేతలను లోపలే ఉంచేందుకు చేస్తున్న ప్రయత్నాలకు లింకు ఉన్నదా? లోతుగా గమనిస్తే భారీ కుట్రలో భాగంగానే ఈ పరిణామాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తన లక్ష్యం కోసం ప్రధానంగా ఎన్డీయే కూటమిలో లేని ప్రాంతీయ పార్టీలను మోదీ లక్ష్యంగా చేసుకున్నారని అంటున్నారు. తాము అధికారంలో లేని చోట తమ మాట నెగ్గాలంటే.. అక్కడ తన ప్రభుత్వం అయినా ఉండాలి లేదా తన తైనాతీ ప్రభుత్వమైన కొలువుదీరాలి! కొన్నేళ్లగా గమనిస్తే అనేక రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలు కూలిపోవడం వెనుక లింకులు.. ఒక్కొక్కటి కనెక్ట్ అవుతుంటాయి. ఇటీవలి కాలంలో బీహార్లో నితీశ్ను తనవైపు తిప్పుకొన్న బీజేపీ.. తదుపరి జార్ఖండ్పై కన్నేసి, అవినీతి ఆరోపణలపై హేమంత్ సొరేన్ను అరెస్టు చేయించడం ద్వారా రాజకీయ అస్థిరతను సృష్టించాలని, తద్వారా తాను ప్రభుత్వంలో దూరాలని ప్రయత్నం చేసింది. అయితే.. ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయినా అక్కడితో ఆగలేదు. జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత శిబుసొరేన్ పెద్ద కోడలు సీతా సొరేన్ లోక్సభ ఎన్నికల వేళ పార్టీని వీడి కాషాయ కండువా కప్పుకొన్నారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన హేమంత్ సొరేన్ స్థానంలో ఆయన సతీమణి కల్పనాకు పాలనా పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. దీన్ని సీతా సోరెన్ బహిరంగంగానే వ్యతిరేకించారు. ఇది అప్పట్లో చర్చనీయాంశమైంది. ఎన్నికల తర్వాత జార్ఖండ్లో అధికార మార్పిడికి బీజేపీ చేసే ప్రయత్నాలకు సీతా సొరేన్ను పావుగా మార్చుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే కర్ణాటక ఎన్నికల ఫలితాల రోజు బీజేపీ నేతలు తమకు మెజారిటీ రాకపోతే జేడీఎస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కానీ కన్నడ ప్రజలు కాషాయ నేతల ఆశలపై నీళ్లు చల్లారు. కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ కట్టబెట్టారు. దీంతో కంగుతిన్న బీజేపీ నేతలు లోక్సభ ఎన్నికల అనంతరం కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా ఎన్నికల తర్వాత జేడీఎస్ ఎన్డీఏలో కలిసింది. లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీచేయబోతున్నాయి. తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆ ప్రభుత్వ మనుగడపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తర్వాత బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకు లేదని, ఆ పార్టీ నేతలే దానికి బీజం వేస్తారని అంటున్నారు. గతంలో కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోవడానికి ఆ పార్టీ నేతలే కారణమని గుర్తుచేస్తున్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్రెడ్డి బీఆర్ఎస్, బీజేపీ నేతల వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. అలాంటి ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయడానికే పీసీసీ అధ్యక్షుడిగా తన రాజకీయం చూపెడుతానని అన్నట్లే గేట్లు తెరిచారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఢిల్లీలో రాష్ట్రపతి పాలన!
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను మద్యం కుంభకోణంలో ఈడీ అరెస్టు చేసింది. ఇప్పుడు అక్కడ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతారు? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. తమ అధినేత జైలు నుంచే పాలన సాగిస్తారని ఆప్ నేతలు అంటున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తి దోషిగా తేలేవరకు రాజీనామా చేయాల్సిన అవసరం లేని న్యాయనిపుణులు చెబుతున్నారు. కానీ జైలు నుంచే సమీక్షలు, మంత్రివర్గ సమావేశాలు నిర్వహించడం ప్రాక్టికల్గా సాధ్యం కాదంటున్నారు. దీన్నికారణంగా చూపెట్టి కేంద్రం అక్కడ రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. అంటే.. వీలుంటే ఎన్నికల్లోపే ఢిల్లీలో రాష్ట్రపతిపాలన వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు! ఎన్నికల ముందు మద్యం కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరించడం వెనుక కేంద్రం ఉన్నదనే విమర్శలున్నాయి. ఇండియా కూటమిని కకావికలం చేయడమే దాని ఉద్దేశంగా కనిపిస్తున్నది రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా పంజాబ్లో పాత మిత్రుడు అకాలీదళ్ తిరిగి ఎన్డీఏలో చేరనున్నదని సమాచారం. ‘కేజ్రీవాల్ బైట ఉంటే పంజాబ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో బీజేపీకి నష్టం జరుగుతుందని మోడీ, షా ఆందోళన చెందుతున్నారు. అందుకే విపక్ష నేతలు ముఖ్యంగా బీజేపీ హవాకు అడ్డుకట్ట వేస్తున్న ప్రాంతీయపార్టీలనే టార్గెట్చేసినట్టు కనిపిస్తున్నది’ అని ఒక విశ్లేషకుడు అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అజెండాలో భాగంగా రాజ్యాంగాన్ని మార్చాలనే తమ ఆలోచనలు అమలు కావాలంటే దానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో భాగమే ఈ పరిణామాలు అంటున్నారు. అధికారంలో ఉండటం మాత్రమే కాదు అధికారంలో స్థిరపడాలనే కోరిక నరేంద్రమోదీలో ఉన్నదని చెబుతున్నారు. అందుకే దాన్ని ఆచరణలో పెట్టాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన కార్యాచరణకు ఈడీ, ఐటీ, సీబీఐ వంటి స్వతంత్ర ప్రతిపత్తికలిగిన సంస్థలను కూడా యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారని మండిపడుతున్నారు.
మత అజెండా గట్టెక్కించడంపై అనుమానాలు!
సార్వత్రిక ఎన్నికల ముందు రామ మందిరం నిర్మాణం, ఆర్టికల్ 370, సీఏఏ వంటి అంశాలే బీజేపీని గెలుపుతీరాలకు తీసుకెళ్లలేవన్న ఆందోళన కాషాయపార్టీ నేతల్లోనూ కనిపిస్తున్నది. అందుకే ప్రతిపక్షాలను టోకుగా కట్టడి చేసే చర్యలకు పాల్పడుతున్నదని అంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఖాతాలను స్తంభింపజేసినా, కేజ్రీవాల్ను ఇప్పుడు, ఆ పార్టీకి చెందిన కీలక నేతలను గతంలోనే అరెస్టు చేయించినా ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులు లేకుండా చూసుకోవడమే మోదీ లక్ష్యమని విశ్లేషిస్తున్నారు. ఇదంతా మోదీ దీర్ఘకాలిక లక్ష్యంలో భాగమేనని స్పష్టం చేస్తున్నారు.