ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ లో భాగం.. కంగారూలతో 4 టెస్టుల సిరీస్ లో టీమ్ ఇండియా టఫ్ ఫైట్ 18 ఏండ్లుగా భారత గడ్డపై సిరీస్ గెలవని ఆసీస్.. వరుసగా గత రెండు సిరీస్ లను గెలుచుకున్న భారత్ ఇక్కడ భారత్ ఆధిపత్యం చెలాయిస్తే టెస్టుల్లోనూ నంబర్ వన్ ర్యాంక్ అవకాశం భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్పై ప్రపంచం దృష్టి విధాత ప్రత్యేక ప్రతినిధి: క్రికెట్ అంటే భారత్ లో పూనకాలే.. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ మాత్రమే […]
విధాత ప్రత్యేక ప్రతినిధి: క్రికెట్ అంటే భారత్ లో పూనకాలే.. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ మాత్రమే కాదు.. వాల్డ్ క్రికెట్ లో సూపర్ టీమ్.. ఆస్ట్రేలియాతో పోరు అన్నా అంతే.. క్రికెట్ లో ఆధిపత్యం చెలాయించాలన్నా.. అగ్రస్థానం నిలబెట్టుకోవాలన్న ఏ జట్టుకైనా కంగారూల ఆధిపత్యాన్ని దెబ్బ కొట్టాల్సిందే.. క్రికెట్ ఆట భారత్ లో మతం స్థాయికి చేరితే.. ఆస్ట్రేలియా జట్టుకు క్రికెట్ అంటే అదో ప్యాసినేషన్.. రెండు జట్ల అభిమానులకూ క్రికెట్ అంటే విపరీతమైన క్రేజ్.. అంతకుమించిన పిచ్చి..
రెండు దేశాల్లో అతిపెద్ద మార్కెట్ క్రికెట్
రెండు జట్ల నుంచి క్రికెట్ ప్రపంచంలోకి వచ్చిన స్టార్ ప్లేయర్లు ఎక్కువే.. విపరీతమైన పోరాటపటిమ… ఆఖరి బంతి వరకు విజయం కోసం పోరాటం.. ఆస్ట్రేలియా జట్టును వినూత్నంగా నిలబెడితే.. వరుస విజయాల ఊపును కొనసాగించడం.. స్టార్ ప్లేయర్ల అద్భుత ప్రదర్శనలు.. వ్యక్తిగత ప్రదర్శనలు.. అంతకుమించిన సంప్రదాయ క్రికెట్ ఆడే ప్లేయర్లు టీమ్ ఇండియా బలం కావడం విశేషం. రెండు దేశాల్లో క్రికెట్ అతిపెద్ద మార్కెట్ గా నిలుస్తున్నాయి.. టీ20 క్రికెట్ మజాను అందించే ఐపీఎల్ స్థాయిలో బీబీఎల్(బిగ్ బాష్ లీగ్) కూడా అలరిస్తుందంటే టీమ్ ఇండియా, ఆస్ట్రేలియా జట్ల స్టార్ క్రికెటర్ల ప్రదర్శనే కారణం..
అభిమానులను ఆకట్టుకుంటున్న ట్రోఫీ
రెండు దేశాల మధ్య జరిగే టఫ్ ఫైట్.. ప్రపంచ క్రికెట్ ను తలపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల మధ్య జరిగే యాషెస్ టెస్ట్ సిరీస్ ను మరిపించేలా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కూడా ప్రపంచ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. స్పీడ్ యుగంలో 5 రోజుల టెస్టు క్రికెట్ ఎవరు చూస్తారన్న అంచనాలను తలకిందులు చేస్తూ.. రెండు దేశాల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ కు అత్యంత ఎక్కువగా ప్రేక్షకాదరణ లభిస్తుండడంతో ఈ నెల 9 నుంచి జరిగే నాలుగు టెస్టుల సిరీస్ పై ప్రపంచ క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది.
ఈ టెస్ట్ సిరీస్ ఫలితమే ఈ ఏడాది జరగబోయే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2021-23 ఫైనల్కు చేరే రెండో జట్టు ఏదో తేల్చనుంది. ఒకవేళ భారత్ ఈ సిరీస్ ఫలితంతో రెండు జట్లలో ఒకటి లేదా రెండు జట్లూ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడనున్నాయి. దీంతో అందరి చూపు ఈ సిరీస్పైనే ఉంది. ప్రజెంట్ రెండు జట్ల బలాబలాలు.. టీమ్ కాంబినేషన్ చూస్తుంటే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ భారత్, ఆస్ట్రేలియాల మధ్య మాత్రమే జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
సిరీస్పైనే ప్రపంచ దృష్టి
భారత సొంతగడ్డపై జరిగే ఈ టెస్టు సిరీస్ లో టీమ్ ఇండియా 2-0, 3-0, 4-0 లేదా 3-1 తేడాతో విజయం సాధిస్తే టెస్టు ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియాను అధిగమించి ర్యాంకింగ్స్ లో నంబర్-1 అవుతుంది. యాషెస్ తర్వాత టెస్ట్ క్రికెట్లో భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకే ఎక్కువ క్రేజ్ కనిపిస్తున్న తరుణాన.. టెస్టు క్రికెట్లో ఈ రెండు జట్లు ఎప్పుడైతే ముఖాముఖి తలపడుతున్నాయో.. అప్పుడు క్రికెట్ ప్రపంచం దృష్టి ఈ సిరీస్పైనే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఎవరి ఆధిపత్యం ఎంత?
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికతో పాటు టెస్ట్ ర్యాంకింగ్స్లో ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు నంబర్ వన్ స్థానంలో ఉంది. గత ఏడాది కాలంగా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లను వారి సొంత గడ్డపైనే కంగారూలు చిత్తుగా ఓడించారు. అంతేకాదు భారత ఉపఖండంలోనూ పాకిస్తాన్ను వారి సొంత గడ్డపైనే ఓడించింది. బాల్ టాంపరింగ్ వివాదాలు.. ఆటగాళ్ల గాయాల లాంటి సమస్యలు అధిగమించిన ఆస్ట్రేలియా జట్టు చాలా బలంగా కనిపిస్తోంది.
తిరుగులేని జట్టుగా..
స్టార్ పేసర్ పాట్ కమిన్స్ కెప్టెన్సీ.. స్మిత్, లబుషేన్, ఖవాజా, డేవిడ్ వార్నర్ లాంటి స్టార్ బ్యాటర్లు.. మిచెల్ స్టార్క్ లాంటి ఎక్స్ ప్రెస్ బౌలర్, హేజిల్ వుడ్ వైవిధ్యమైన పేస్.. స్పిన్నర్ నాథన్ లైయన్.. వికెట్ కీపర్లు హ్యాండ్స్ కోంబ్, అలెక్స్ కేరీల సుడిగాలి బ్యాటింగ్ ఇలా అన్ని విభాగాల్లో బలంగా తిరుగులేని జట్టుగా కనిపిస్తోంది. ఇందుకు భిన్నంగా గతేడాది టీమ్ ఇండియా టెస్టు స్టాటిస్టిక్స్ అంత గొప్పగా ఏమీ లేవు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్లపై టెస్టుల్లో ఓడిన భారత్.. శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి జట్లపై విజయాలు నమోదు చేసింది.
కాగా, సొంతగడ్డపై భారత్ను ఓడించడం ఎంత బలమైన జట్టుకు కూడా అంత తేలికైన విషయం కాదు. 18 ఏండ్లలో ఆస్ట్రేలియా జట్టు ఒక్కసారి కూడా భారత్లో టెస్టు సిరీస్ను గెలవలేకపోయింది. ఆస్ట్రేలియాతో ఆడిన చివరి రెండు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలను కూడా భారత జట్టే గెలుచుకుంది. ప్రస్తుతం రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా కూడా బలహీనంగా లేదు. బ్యాటింగ్ లో రోహిత్, కోహ్లి, రాహుల్, గిల్, పుజరాతోపాటు శ్రేయాస్ అయ్యర్ కూడా ఉన్నాడు. వికెట్ కీపర్లుగా ధనాధన్ షాట్లు ఆడగల భరత్, ఇషాన్ కిషన్ అందుబాటులో ఉన్నారు.
తగ్గేదేలే.. అన్నట్టుగా టీమిండియా
కొత్తగా జట్టులోకి చేరిన సూర్యకుమార్ యాదవ్.. భారత్ కు బ్యాటింగ్ లో అదనపు బలం.. పేస్ బౌలింగ్ లోనూ ఉమేశ్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, షమీలకు తోడుగా దేశవాళీలో దుమ్ము రేపిన ఉనాద్కత్ ఉన్నాడు. మోకాలి సర్జరీ అనంతరం కోలుకున్న ఆల్ రౌండర్ జడేజా… మిస్టరీ బౌలింగ్ తో ఆసీస్ గుండెల్లో గుబులు రేపుతున్న అక్షర్ పటేల్.. చైనామెన్ కుల్దీప్ యాదవ్ ఫామ్.. ఎక్కడా తగ్గేదేలేదన్నట్లుగా టీమ్ ఇండియా కూడా ఆసీస్ జట్టుకు సమానంగా కనిపిస్తోంది.
ఆసీస్ … భారత్ టెస్టు సిరీస్ గణాంకాలు..
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 1947-48 నుంచి ఇప్పటివరకు 27 టెస్టు సిరీస్ లు జరిగాయి. ఇందులో ఆస్ట్రేలియా జట్టు 12 సిరీస్ లు గెలుచుకోగా .. టీమ్ ఇండియా 10 సిరీస్ విక్టరీలు కొట్టింది. 5 టెస్టు సిరీస్ లు డ్రాగా ముగిసాయి. భారత్ ఆతిథ్యమిచ్చిన 14 టెస్టు సిరీస్ లలో 8-4 తేడాతో కంగారూలపై స్పష్టమైన ఆధిక్యం సాధించింది. మరో రెండు టెస్టు సిరీస్ లు డ్రాగా ముగిసాయి.
2004-05లో భారత గడ్డపై జరిగిన 4 మ్యాచ్ లటెస్టు సిరీస్ లో గిల్ క్రిస్ట్ కెప్టెన్సీలో 2-1తేడాతో టీమ్ ఇండియాను ఓడించిన కంగారూలు అనంతరం 2016-17 లో సొంతగడ్డపై జరిగిన సిరీస్ తోపాటు ఆవల 2018-19, 2020-21 జరిగిన సిరీస్ ల్లో ఆస్ట్రేలియా జట్టును భారత్ కంగుతినిపించింది.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా
ఆడిన టెస్టులు :109
భారత్ గెలిచిన మ్యాచ్ లు: 30( 29.41 శాతం)
ఆస్ట్రేలియా గెలిచిన మ్యాచ్ లు: 43 (42.15 శాతం)
డ్రా : 28, టై : 1
ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు 75.56 విన్నింగ్ పర్సంటేజీతో అగ్రస్థానంలో ఉండగా.. భారత్ 58.93 విజయాల శాతంతో రెండో స్థానంలో ఉంది. భారత్ కు దగ్గరగా 53.33 శాతంతో శ్రీలంక, 48.72 విజయాల శాతంతో సౌతాఫ్రికా సమీపంలో ఉన్నాయి. ఈ సిరీస్ ఫలితంతో నిమిత్తం లేకుండా దాదాపు కంగారూ జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ బెర్తు ఖాయం చేసుకోగా.. ఒకవేళ భారత్ ఈ సిరీస్ లో ఓడినా.. శ్రీలంకతో ఆడబోయే రెండు టెస్టు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో న్యూజిలాండ్ విజయం సాధిస్తే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ నకు గణాంకాలతో నిమిత్తం లేకుండానే భారత్ రెండో స్థానంతో అర్హత సాధిస్తుంది.
ఆస్ట్రేలియా, భారత్ ఆటగాళ్ల రికార్డ్స్
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్టుల్లో సచిన్ 55 సగటు, 11 సెంచరీలతో 3630 పరుగులు చేసి అత్యధిక రన్స్ సాధించిన ఆటగాడుగా రికార్డు నెలకొల్పాడు. ఆసీస్ తరఫున రికీపాంటింగ్ 54.36 యావరేజి, 8 సెంచరీలతో 2555 రన్స్ చేసాడు. ప్రస్తుత ఆటగాళ్లలో చటేశ్వర్ పుజార 1893 పరుగులు.. స్మిత్ 1742 రన్స్.. కోహ్లీ 1682 రన్స్ చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లుగా ఉన్నారు.
రెండు దేశాల మధ్య జరిగిన టెస్టు సిరీస్ ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ (329 నాటౌట్, 2012 సిడ్నీటెస్టు) పేరిట ఉండగా.. 2001లో కోల్ కతాలో జరిగిన చారిత్రక టెస్టు మ్యాచ్ లో వీవీఎస్ లక్ష్మణ్ (281) పేరిట ఉంది. అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో అనిల్ కుంబ్లే (111 వికెట్లు), హర్భజన్ సింగ్(95) వికెట్లు సాధించారు. ఆసీస్ బౌలర్ నాథన్ లైయన్ (94 వికెట్లు) తీసుకున్నాడు.
4టెస్టులు.. 3 వన్డేలు
భారత పర్యటనలో ఆస్ట్రేలియా జట్టు నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్తో పాటు మూడు వన్డేల సిరీస్ను ఆడనుంది. తొలిటెస్టు ఫిబ్రవరి 9-13.. రెండో టెస్టు ఫిబ్రవరి 17-21.. మూడో టెస్టు మార్చి 1-5
నాలుగో టెస్టు మార్చి 9-13.. తొలి వన్డే మార్చి 17, రెండో వన్డే మార్చి 19, మూడో వన్డే మార్చి 22 వ తేదీన జరగనుంది.
ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవి అశ్విన్ , అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, సూర్యకుమార్ యాదవ్.
ఆస్ట్రేలియా జట్టు:
పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్(వైస్ కెప్టెన్), ఆస్టన్ అగర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కేరీ(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, పీటర్ హ్యాండ్స్ కోంబ్, జోష్ హాజిల్ వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లైయోన్, లాన్స్ మోరిస్, మర్ఫీ, మాథ్యూ రెన్ షా, మిచెల్ స్టార్క్, స్వెప్సన్, డేవిడ్ వార్నర్.