విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఇంజెక్షన్ వికటించడంతో అవినాష్ అనే విద్యార్థి మృతి చెందాడు. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రానికి చెందిన మీసరకొండ అవినాష్ (12) మామునూరులోని మహాత్మా జ్యోతిరావుఫూలే గురుకులంలో ఆరో తరగతి చదువుతున్నాడు.
అతడికి జ్వరం రావడంతో అవినాష్ ను తల్లిదండ్రులు ఆదివారం సాయంత్రం హసన్ పర్తిలోని ఒక ఆర్ ఎంపీ దగ్గరకు తీసుకెళ్లామని చెప్పారు. పరీక్షించిన ఆర్ ఎంపీ బాలుడికి జ్వరం వచ్చిందని చెప్పి రెండు ఇంజెక్షన్లు ఇచ్చాడన్నారు.
ఇంజెక్షన్ వికటించడంతో సోమవారం తెల్లవారుజామున చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.