వంద రోజుల కాంగ్రెస్ ప్రభుత్వంలో వసూళ్లు, దందాలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని, సీఎం స్థాయి నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఢిల్లీకి మూటలు పంపుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీశ్రెడ్డి విమర్శించారు
విధాత : వంద రోజుల కాంగ్రెస్ ప్రభుత్వంలో వసూళ్లు, దందాలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని, సీఎం స్థాయి నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఢిల్లీకి మూటలు పంపుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీశ్రెడ్డి విమర్శించారు. బుధవారం మిర్యాలగూడ మండలం యాద్గర్ పల్లి గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కరరావు, కంచర్ల భూపాల్ రెడ్డి, బీఆరెస్ నేతలు తిప్పన విజయసింహ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కంచర్ల కృష్ణా రెడ్డిలతో కలిసి పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద రెండు లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు ఏడుస్తుంటే ఏ ఒక్క మంత్రికి ఎమ్మెల్యేలకు సోయలేదన్నారు. రెండు తడులు నీళ్ళు అందిస్తే పంటలు గట్టెక్కేవి ,కానీ జిల్లా మంత్రులకు సోయి లేదన్నారు. రైస్ మిల్లర్లను, క్రషర్ ఓనర్లను బెదిరిస్తూ జిల్లా మంత్రులు వసూళ్లకు పాల్పడ్డారని, ఇసుక దందాలో తలమునకులయ్యారని ఆరోపించారు. మిల్లర్లతో మంత్రులు కుమ్మక్కు కావడంతో రైతులకు తక్కువ ధరలు చెల్లిస్తూ మిల్లర్లు దోపిడీ మొదలుపెట్టారన్నారు.
ఇంతవరకు ప్రభుత్వపరంగా ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రారంభించలేదని, క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, మిల్లర్లతో మాట్లాడి రైతులకు మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే మంత్రులను గ్రామాల్లోకి రానివ్వమని హెచ్చరించారు.