పన్నుల లక్ష్యాలను సాధించాలి: సీఎం రేవంత్ రెడ్డి
పన్నుల రాబడి లక్ష్యాలను సాధించేందుకు అధికార యంత్రాంగం ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు

విధాత : పన్నుల రాబడి లక్ష్యాలను సాధించేందుకు అధికార యంత్రాంగం ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర వాణిజ్య పన్నులు, ప్రొహిబిషన్-ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, గనులు-భూగర్భ శాఖ, రవాణా పన్నులపై సంబంధిత శాఖల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆదాయ సేకరణ వివరాలపై సీఎం ఆరా తీశారు. ఆర్ధిక సంవత్సరాలవారీగా ఆదాయ సేకరణ, పన్నుల వసూళ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాణిజ్య పన్నుల విభాగంలో నిర్దేశించిన టార్గెట్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎక్సైజ్ విభాగంలో అక్రమాలను అరికట్టి పూర్తి స్థాయిలో ట్యాక్స్ వసూళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ సూచించారు.
రాష్ట్రంలో ఉన్న అన్ని డిస్టీలరీల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేయాలని ఆదేశించారు. బాటిల్ ట్రాకింగ్ ఉండేలా తయారీ సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అన్ని శాఖలు సమన్వయంతో ముందుకెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ సూచించారు.