CM REVANTH REDDY: కృష్ణాజలాల్లో 70 శాతం వాటా మాకే: సీఎం రేవంత్ రెడ్డి

- గోదావరిలో తెలంగాణ నికర జలాల వాటా తేల్చాలి
- జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి
- రేవంత్ రెడ్డి వినతి
విధాత:కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్దంగా 70 శాతం వాటా వస్తుందని, ఆ మేరకు తమకు కేటాయింపులు జరపాలని కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కృష్ణా నది పరివాహకంలో సుమారు 70 శాతం తెలంగాణలో ఉంటే కేవలం 30 శాతం మాత్రమే ఏపీలో ఉన్నందని, ఈ మేరకు కృష్ణా జలాల్లో 70 శాతం వాటా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలన్నారు. గోదావరికి సంబంధించి తెలంగాణ వాటా నికర జలాలు తేల్చిన తర్వాతే ఏపీ ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రి పాటిల్ను కోరామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.సోమవారం సాయంత్రం ఢిల్లీలో జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. కృష్ణా, గోదావరి నది జలాలకు సంబంధించి తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని కేంద్ర మంత్రిని కోరారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను తెలియజేశారు.
పక్షపాతంతో ఏపీకి కేటాయింపులు కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా ఉన్నప్పటికీ కృష్ణా నది యాజమాన్యబోర్డు (కేఆర్ఎంబీ) పక్షపాతంగా ఆంధ్రప్రదేశ్కు 66, తెలంగాణకు 34 శాతం నీటి కేటాయింపులు చేసిందని కేంద్ర మంత్రికి వివరించామన్నారు. ఏళ్లుగా తాము నష్టపోతున్నామని, ఈ ఏడాది సైతం ఆంధ్రప్రదేశ్ తమకు కేటాయించిన మొత్తానికి మించి నీరు తరలించుకుపోయిందన్నారు. ఇక ముందు తమ వాటాకు మించి కృష్ణా నది నీటిని ఏపీ తరలించుకొని పోకుండా చూడాలని చెప్పామన్నారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి వెంటనే టెలీ మెట్రీ యంత్రాలు ఏర్పాటు చేయాలని,అవసరమైతే అందుకయ్యే మొత్తాన్ని తామే భరిస్తామని కేంద్ర మంత్రికి తెలియజేశామన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 2022లోనే డీపీఆర్ సమర్పించినా అనుమతుల్లో ఆలస్యం చేస్తున్నారని జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్కు తెలిపామన్నారు.అదే సమయంలో న్యాయస్థానాల పరిధిలోని అప్పర్ భద్రకు మాత్రం అనుమతులు ఇచ్చారన్నారు.సీతారామ ఎత్తిపోతల, సమ్మక్క సాగర్ బ్యారేజీలకు మాత్రం అనుమతులు ఇవ్వలేదన్నారు. ఈ మూడు ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ),సాంకేతిక సలహా మండలి (టీఏసీ) నుంచి అవసరమైన అనుమతులుఇప్పించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు సీఎం తెలిపారు.
తెలంగాణ నీటి ప్రయోజనాలపై రాజీపడం
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి-బనకచర్ల
అనుసంధాన పథకానికి రూపకల్పన చేసిందని జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్కు తెలియజేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కేంద్ర జల సంఘం, గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ), కేఆర్ఎంబీల నుంచి ఎటువంటి అనుమతి పొందలేదన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్న అపెక్స్ కౌనిల్స్లోనూ ఏపీ గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ఎటువంటి చర్చ జరగలేదని కేంద్ర మంత్రికి వివరించామని సీఎం తెలిపారు. తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడుకునే విషయంలో తాము ఏమాత్రం రాజీపడబోమని కేంద్ర మంత్రికి స్పష్టం చేశామని సీఎం చెప్పారు.
అనుమతులు ఇవ్వండి
గోదావరిపై తాము చేపట్టిన సీతారామ ఎత్తిపోతల, సమ్మక్క సాగర్ప్రా జెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు అనుమతులు ఇవ్వలేదన్నారు. గోదావరి నదిలో తెలంగాణకు సంబంధించి నికర జలాల వాటాలు తేల్చాలని, గోదావరిపై తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరామన్నారు. అలా చేయకపోతే ఆయకట్టు స్థిరీకరణ పేరుతో తాము నష్టపోతామని, కృష్ణా డెల్టా ఆయకట్టును చూపి కృష్ణా జలాల్లో తెలంగాణకు నష్టం చేసిన విషయాన్ని తెలియజేశామన్నారు.
50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు ఇవ్వండి
పాలమూరు- రంగారెడ్డి, సీతారామఎత్తిపోతల, మోడి కుంట వాగు, చనాఖా కొరటా బ్యారేజీ (డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్), చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర) ఎత్తిపోతల పథకాలకు సత్వర సాగు నీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ).. పీఎంఆర్పీ 2024 కింద తగిన ఆర్థిక సహాయం అందజేయాలని జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్కు విజ్ఞప్తి చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సాగు నీటి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందజేసేందుకు మౌలిక వసతుల అభివృద్ధి కింద 50 సంవత్సరాలు పాటు వడ్డీలేని రుణాలు తెలంగాణకు ఇవ్వాలని కేంద్ర మంత్రిని అభ్యర్థించామన్నారు.
తమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్ట్ కు మహారాష్ట్ర నుంచి అనుమతి ఇప్పించండి
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని, ముంపునకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఇప్పించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు సీఎం రేవంత్ తెలిపారు. ఈ సమావేశంలో నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, రాష్ట్ర నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, రాష్ట్ర నీటి పారుదల శాఖ ఈఎన్సీ (ఓ అండ్ ఎం) విజయ్ భాస్కర్ రెడ్డి, తెలంగాణ భవన్ రెసిడెంట్క మిషనర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.